బీహార్ లో బీజేపీ చేతిలో ఏడు పార్టీలు చిత్తు!
Publish Date:Jul 11, 2015
Advertisement
ఈ ఏడాది చివర్లో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి తన సత్తా చాటుకోవాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. అందుకు ఇప్పటి నుండే గట్టిగా కృషి చేస్తోంది కూడా. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని ఎలాగయినా తన అధికారం నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. అందుకోసమే ఆయన ఆరు పార్టీలు కలిపి ఏర్పాటు చేసుకొన్నజనతా పరివార్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడా తనంతట తాను పోటీ చేసే గెలిచే పరిస్థితుల్లో లేదు కనుక అది కూడా జనతా పరివార్ పడవెక్కింది. అన్ని పార్టీలు ఒక వైపుంటే బీజేపీ ఒక్కటే మరోవైపు నిలబడి విధానసభ ఎన్నికలలో తలపడ్డాయి. అవకాశం దొరికితే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలే సత్తా తమకుందని భావిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జెడి. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వంటి హేమాహేమీలున్న జనతా పరివార్ ఇటీవల జరిగిన విధాన సభ ఎన్నికలలో బీజేపీని డ్డీకొన్నారు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్లుగా వారందరూ అమిత్ షా వ్యూహాలకి చిత్తయిపోయారు. మొత్తం 24 సీట్లలో బీజేపీ ఏకంగా 12 సీట్లు కైవసం చేసుకోగా, అధికార జేడీయు పార్టీకి 5 సీట్లు, ఆర్.జేడికి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కించుకోగలిగాయి. విధాన సభ ఎన్నికలలోనే జనతా పరివార్ చతికిల పడినప్పుడు ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఎలా గెలుస్తుంది? అనే సందేహం వారికీ కలిగే ఉండాలి. జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనను నిలబెట్టకపోతే తాను ఆ కూటమితో కలవనని తెగేసి చెప్పి మరీ తన పంతం నెగ్గించుకొన్న నితీష్ కుమార్ ని ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్న అడుగవచ్చును. లేదా ఆయన బదులు ఏ లాలూనో లేక ములాయమో మరొకరో నిలబడతామని పట్టుబట్టినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే కప్పల తక్కెడ వంటి జనతా పరివార్ లో నుండి ఇప్పుడే కొందరు బయటకి దూకేసినా ఆశ్చర్యం లేదు.
http://www.teluguone.com/news/content/bihar-45-48246.html