వి.ఐ.పి. లకు అడ్డాగా మారుతున్న ఆళ్ళగడ్డ
Publish Date:May 18, 2012
Advertisement
కడప జిల్లాకు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక గెలిచేది నీవా? నేనా? అన్నట్లు మూడు ప్రధాన ప్రార్తీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. ప్రత్యేకించి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరులో తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటింగ్ పరంగా మూడు పార్టీల ప్రభావం కనిపించినా రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే నడుస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీలో అత్యల్ప మెజార్టీలే నమోదైనా వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అభ్యర్థులు కుతూహలపడుతున్నారు. వీరితోపాటు ఈ రెండు నియోజకవర్గాలపైనా మూడు పార్టీల ప్రధాననేతలు దృష్టిసారించారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహనరెడ్డి ముందుగానే ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు సహకరించాలని ప్రచారం చేశారు. చంద్రబాబు ఇక్కడ విజయం కోసం పట్టుపడు తున్నారన్న ప్రచారం జరగటంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్ ముందస్తు సర్వే నిర్వహించారు. ఆ సర్వే సూచనలను పాటిస్తూ ఆయన ఎమ్మిగనూరులో ఇంటింటికీ నడిచి తిరిగారు. జగన్ ఇలా తిరగటం ఆ పార్టీ నాయకులంతా ఆళ్ళగడ్డలో కార్యకర్తల సమావేశానికి వచ్చారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉప ఎన్నికల పరిశీలకులు వాయలార్ రవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, టి.జి.వెంకటేష్, ఎంపీలు ఎస్.పి.వై. రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక్క రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒక్కరే రాలేదు. ఇదిలా ఉంటే ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమా శోభానాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ప్రచారానికి ముందుగానే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించటంతో ఫలితాల్లో వీరిద్దరిలో ఒక్కరు విజయం సాధించినట్లు ప్రకటించవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. ఏమైనా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతాయని వారు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/allagadda-as-vips-den-24-14126.html





