తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస బిడ్డలు కలిసిరావాలి : కేటీఆర్

Publish Date:Jun 7, 2026

Advertisement

 

మలేషియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్‌ఎస్ ఎన్నారై మలేషియా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సంబరాలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలంగాణ బిడ్డలను (ఎన్నారైలను) ఉద్దేశించి ఆయన  ప్రసంగించారు.

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తమ మాతృభూమిని మర్చిపోకుండా ఆవిర్భావ సంబరాలు చేసుకుంటున్న ఎన్నారైలందరికీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మర్చిపోకుండా ఖండాలు దాటినా తెలంగాణ తల్లిని తలుచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.


తరతరాల పోరాటాల గడ్డ తెలంగాణ

వేల సంవత్సరాల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యుద్ధాన్ని, రణాన్ని నడిపించిందని గుర్తుచేశారు. అది సాయుధ పోరాటాలైనా కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, త్యాగాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా కావచ్చు... ప్రతిసారి తెలంగాణ జాతి తోటి ప్రజల కోసం కొట్లాడిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదన్నారు.

భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నుంచి గోరటి వెంకన్న దాకా దిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారుల నుంచి మొదలుకొని ప్రజానాయకులు ఎందరినో కన్న ఈ గడ్డ అత్యంత ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతితో మమేకమై బతుకమ్మను జరుపుకునే, పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క జాతి ఈ ప్రపంచంలో తెలంగాణ జాతి అని ఆయన స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం "నాది తెలంగాణ, నాది తెలంగాణ జాతి, నేను తెలంగాణ బిడ్డను" అని సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.


కేసీఆర్ నాయకత్వంలోనే సాకారం:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నదని, అయితే ఈ ప్రత్యేక రాష్ట్రం ఊరికేనే రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్దాల పాటు జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన మలి తెలంగాణ ఉద్యమంతోనే ఇది సాధ్యమైందన్నారు. మలి విడత ఉద్యమానికి నాయకత్వం వహించి, సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళిన కేసీఆర్ గారి నాయకత్వంలో పుష్కరానికి పైగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమం వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందన్నారు. అనేక పదవీ త్యాగాలు, సవాళ్లను దాటుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.

కాలం మనది కానప్పుడు వానపాములు కూడా బుసకొడతాయి:

ప్రపంచంలో కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలను 'ఏషియన్ టైగర్స్' గా పిలుస్తుంటారని, అవి చిన్న దేశాలే అయినా సాధించిన విజయాలు అతి గొప్పవని కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా భారతదేశంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ సైతం అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. ఒకనాటి వలసల తెలంగాణను, కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ గారిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణను వ్యవసాయం నుంచి మొదలుకొని పరిశ్రమల దాకా ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది ముమ్మాటికీ కేసీఆర్ గారేనని స్పష్టం చేశారు. ఒకనాడు అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న తెలంగాణను ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి, తలసరి ఆదాయంతో పాటు స్థూల జీఎస్డీపీ (GSDP) లోనూ ప్రథమ స్థానానికి చేర్చామన్నారు. ఒకప్పుడు గేలి చేయబడిన తెలంగాణ సంస్కృతిని ఈనాడు సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది కూడా ముమ్మాటికీ కేసీఆరే అన్నారు.

"ఇవేమీ తెలియని 4 ఫీట్లు ఉన్న నాయకులు కొంతమంది తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయి. అలాంటి విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన హెచ్చరించారు. 2028లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మలేషియాతో అనుబంధం - తెలంగాణ పామాయిల్ విప్లవం:

ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న మలేషియాతో కూడా తెలంగాణకి ఒక అద్భుతమైన సంబంధం ఉందన్నారు. మలేషియా మాదిరే తెలంగాణలోనూ పామాయిల్ విప్లవం సాధించి, రైతన్నల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఏకైక ఉద్దేశంతో పామాయిల్ కోసం మలేషియా నుంచి విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించిన అంశాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఫలితంగా ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు.


రాబోయే 25 ఏళ్లకు ప్రత్యేక విజన్:

ఈరోజు ప్రపంచం విపరీతమైన మార్పులకు గురవుతున్నదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతిక రంగాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయన్నారు. కేవలం విజ్ఞానం ఉన్నవాడే నాయకుడని, ఆ దేశం మాత్రమే ఎదుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు అణ్వాయుధాలు ఉన్నవాడు నాయకుడైతే, ఈరోజు విజ్ఞానం, ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో నిలబడుతున్నారన్నారు. 


అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నారైల సేవలు కావాలని, తెలంగాణ అభివృద్ధికి వారి సూచనలు, భవిష్యత్తుకు ప్రవాసుల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల పాటు వెనుకబడిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ గారికి, భారత రాష్ట్ర సమితికి వచ్చే 25 సంవత్సరాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక విజన్ ఉందన్నారు. అలాంటి అద్భుతమైన విజన్‌ను నిజం చేయగలిగే శక్తి ముమ్మాటికీ కేసీఆర్ గారికే ఉన్నదని, గత 10 సంవత్సరాల ఆయన పరిపాలనే దానికి సజీవ సాక్ష్యమని అన్నారు.

భవిష్యత్ కార్యాచరణ ఇదే:

60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అన్ని రంగాలకు అందించిన తీరుగానే... రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా 24 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ ప్రధాన విజన్ అని కేటీఆర్ ప్రకటించారు. దీనితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి కేసీఆర్ గారికే ఉన్నదని, కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రాగానే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో విపరీతమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో, ప్రవాస భారతీయులు స్థానికులతో కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. స్థానికులతో, స్థానిక సంస్కృతితో కలిసి ముందుకు పోతే ప్రతి దేశంలోనూ తెలంగాణ బిడ్డలు అద్భుతమైన విజయాలు సాధిస్తారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.