ఏ పప్పులలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో తెలుసా?

ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం.  శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి,  ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది.  శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు. ఇక మాంసాహారులు అయితే మాంసాన్ని తీసుకుంటారు. కానీ కాయ ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరచుగా పప్పు ధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. వంటింట్లో ఎన్నో రకాల పప్పు దాన్యాలు ఉంటాయి. వీటిలో ఏ ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సోయాబీన్.. సోయాబీన్లో అన్ని పప్పు ధాన్యాల కంటే అత్యధికంగా వంద గ్రాముల సోయాబీన్ కు 36–40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) దాదాపు సమతుల్యంగా లభిస్తాయి. అందువల్ల దీనిని అత్యుత్తమ ప్లాంట్  ప్రోటీన్ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోయాబీన్‌తో తయారయ్యే పాలు, టోఫూ, సోయా నగెట్స్ వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. మినుములు.. ప్రోటీన్ అత్యధికంగా ఉండే ధాన్యాలలో మినుములు రెండవ స్థానంలో ఉంటాయి.  ఈ మినుములు ఒక  కప్పు మినుములలో సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతారు. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాల్లో మినప్పప్పు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది. పెసలు.. పెసలులో 23–24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు వచ్చిన పెసలు విటమిన్ సి, కొన్ని బి విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. శనగలు.. శనగలులో ప్రోటీన్‌తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి, బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. శనగలు ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా అందిస్తాయి.   రాజ్మా.. రాజ్మాలో మంచి ప్రోటీన్, పీచు, పొటాషియం , ఐరన్  ఉంటాయి. అయితే వీటిని తప్పనిసరిగా బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది అవుతుంది. కందిపప్పు.. కందిపప్పు మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా వాడే పప్పు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు కూడా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చడం మంచి అలవాటు. ఎలా తింటే ప్రయోజనం.. పప్పులను కేవలం ఒకటే తినడం కంటే వాటిని బియ్యం, జొన్న, రాగి లేదా గోధుమ వంటి ధాన్యాలతో కలిపి తినడం మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. పప్పులను కూరగాయలతో కూడా కలిపి తింటే మంచి సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. అలాగే పప్పులను 6–8 గంటలు నానబెట్టి వండితే జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని పప్పులను మొలకలు చేసి తింటే విటమిన్లు పెరగడంతో పాటు కొన్ని పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది. రోజువారీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఒక సాధారణ ఆరోగ్యవంతుడికి రోజుకు శరీర బరువు ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 48 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు లేదా కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి అవసరం మరింత ఎక్కువగా అవసరం కావచ్చు.                             *రూపశ్రీ.

read more
బ్రెయిన్ ఫాగ్.. గందరగోళంగా ఉంటూ విషయాలన్నీ మర్చిపోతుంటారా?  అయితే మీ సమస్య ఇదే కావచ్చేమో..!

  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
శరీరంలో మెగ్నీషియం తగ్గితే ఏమవుతుంది? కనిపించే హెచ్చరిక సంకేతాలు

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

read more
ఉదయం అమృతంగా ఉండి, రాత్రికి విషంగా మారే ఆహారాల గురించి తెలుసా?

మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని  ఆహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండి, పగటిపూట శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ వాటిని రాత్రిపూట తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆహార  నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట తప్పుడు ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, నిద్ర , విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు పగటిపూట శరీరానికి మేలు చేస్తాయని  అనుకుంటారు, , కానీ  ఆ ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం అమృతంలా ఉండి రాత్రికి విషంగా మారే ఆహారాలు ఏమిటో, వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే.. పెరుగు.. పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెరుగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారు. అయితే, రాత్రిపూట పెరుగు తినడం హానికరం కావచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే చలువ చేసే గుణం శ్లేష్మం ఉత్పత్తికి కారణం కావచ్చని, కొంతమందికి కడుపులో గ్యాస్ , బరువుగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చని అంటున్నారు. పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి , దాదాపు ప్రతిఒక్కరికీ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.  అయితే పండ్లను  పగటిపూట తినడం ఉత్తమం. రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి వివిధ అనారోగ్య  సమస్యలను కలిగిస్తుంది. పండ్లలో సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పండ్లు తినడం వల్ల గ్యాస్ , మలబద్ధకం కూడా కలగవచ్చు. చికెన్.. కోడి మాంసం లేదా చికెన్ ను ప్రోటీన్‌కు మంచి మూలంగా చెబుతారు. అయితే అందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం , శక్తి అవసరం. అందుకే రాత్రిపూట చికెన్  తినడం జీర్ణక్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ  రాత్రిపూట చికెన్  తినాలని అనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో , సమతుల్యంగా తినడం మంచిది. ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్.. రాత్రిపూట నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల తగినంత విశ్రాంతి లభించక, నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే నిపుణులు రాత్రిపూట కొవ్వు పదార్థాలను తినవద్దని సిఫార్సు చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్.. ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం పూట తినడం వల్ల శక్తి , పోషణ లభిస్తాయి. అయితే, వాటిని సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు , కడుపులో భారంగా అనిపించడం వంటివి ఎదురవుతాయట, ఎందుకంటే కడుపులోని ఎంజైమ్‌లు డ్రై ప్రూట్స్ ను  సులభంగా విచ్ఛిన్నం చేయలేవు. క్రూసిఫెరస్ కూరగాయలు.. క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , జీర్ణ సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల, ఈ కూరగాయలను పగటిపూట తినడం మంచిది.                                      *రూపశ్రీ.

read more
షుగర్ ఉన్నవారికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎంత? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే నియంత్రిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ డయాబెటిస్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు: ✔ నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? ✔ భోజనం తర్వాత షుగర్ స్థాయిలు ఎంత వరకు సాధారణంగా పరిగణిస్తారు? ✔ HbA1c అంటే ఏమిటి? ✔ HbA1c విలువల ఆధారంగా ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్‌ను ఎలా గుర్తిస్తారు? ✔ ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ✔ డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ✔ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ✔ షుగర్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎందుకు స్పష్టంగా కనిపించకపోవచ్చు? ✔ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల కొంతమందిలో హార్ట్ ఎటాక్ వచ్చినా సాధారణ ఛాతినొప్పి కనిపించకపోవచ్చు. దీనినే "సైలెంట్ హార్ట్ ఎటాక్" అంటారు. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, HbA1c స్థాయిలను పర్యవేక్షించడం మరియు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో నియంత్రిస్తే అనేక సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

read more
జిమ్ లో చేసే కామన్ మిస్టేక్స్.. చాలా డేంజర్ ఇవి!

ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. అవి వారి ఆరోగ్యం పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయి.  తెలియకుండా చేసే కొన్ని తప్పులు  కొన్ని సార్లు చాలా డేంజర్ గా మారతాయి.  ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం జిమ్ లో చేసే  ఒక పొరపాటు ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది.  అలాంటి తప్పులేంటో తెలుసుకుంటే.. జిమ్ కు వెళ్ళినప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. పళ్లు బిగించడం.. జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే పళ్ళు బిగిస్తారు లేదా కొరుకుతారు. బరువైన వెయిట్ లిఫ్టింగ్, పుష్-అప్స్, ప్లాంక్స్, డెడ్‌లిఫ్ట్స్ లేదా ఇతర శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేటప్పుడు ఈ అలవాటు ప్రత్యేకంగా సాధారణం.   సమస్య.. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు  పళ్ళు బిగిస్తే, దవడ కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా తలకు ఇరువైపులా ఉండే కణతల కండరాలకు , మెడ కండరాలకు వ్యాపిస్తుంది. దీని ఫలితంగా, వ్యాయామం తర్వాత తల బరువుగా అనిపించడం, ఒత్తిడి తలనొప్పులు , మెడ పట్టేయడం వంటివి జరుగుతాయి. దవడ , మెడ కండరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. పళ్ళు బిగపట్టడం వల్ల  మెడ కండరాలు కూడా అనవసరంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల మరుసటి రోజు మెడ బిగుసుకుపోవడం, నొప్పి , మెడను కదపడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ సమస్య ఎవరికి వస్తుంది? బరువులు ఎత్తే వ్యక్తులు, కొత్తగా జిమ్‌కు వెళ్లేవారికి,  ఒత్తిడి లేదా ఆందోళన ఉన్న వ్యక్తులకు,  వ్యాయామం చేసేటప్పుడు తమ శరీరాన్ని అతిగా బిగుతుగా ఉంచుకునేవారికి ఇది వస్తుంది. వ్యాయామం తర్వాత మీకు తరచుగా తలనొప్పి, దవడ నొప్పి, చెవుల చుట్టూ ఒత్తిడి లేదా మెడ బిగుసుకుపోవడం వంటివి ఎదురైతే, అది కేవలం అలసట వల్ల మాత్రమే కాకుండా, వ్యాయామం చేసేటప్పుడు పళ్ళు కొరికే అలవాటు వల్ల కూడా కావచ్చు అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చిన్న తప్పును సరిదిద్దుకోవడం చాలా మంచిది.                                      *రూపశ్రీ.

read more
బెల్లీ ఫ్యాట్‌కు గుడ్‌బై చెప్పండి.. సహజంగా బరువు తగ్గించే ఆయుర్వేద మార్గాలు!

ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు మరియు బెల్లీ ఫ్యాట్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డైట్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో వివరించారు.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పనితీరు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెబుతున్నారు.  అలాగే బరువు తగ్గాలంటే కేవలం మందులు లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సహజమైన ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆరోగ్య అవగాహన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

read more
ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంతో వేగంగా, సులభంగా బరువు తగ్గుతారు..!

నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం  శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్నిసార్లు తప్పుడు ఆహారం , తీవ్రమైన వ్యాయామాలు శరీరానికి హాని కలిగిస్తాయి. కానీ బరువు తగ్గాలని అనుకునేవారు దినచర్యలో కొన్ని సాధారణ, ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం ద్వారా  నెమ్మదిగా , సురక్షితంగా బరువు తగ్గవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. గోరు వెచ్చని నీరు.. రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం బరువు తగ్గే ప్రక్రియను మెరుగుపరచడానికి ఒక సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. ఇది శరీర జీవక్రియను ఉత్తేజపరిచి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోయి, రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. నడక.. బరువు తగ్గడంలో శారీరక శ్రమ ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు చురుకుగా నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి , శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.   ఇది అన్ని వయసుల వారు తమ దినచర్యలో చేర్చుకోగలిగే ఒక సులభమైన వ్యాయామం అవుతుంది. క్రమం తప్పకుండా నడవడం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. స్వీట్స్, జంక్ ఫుడ్.. బరువు పెరగడానికి చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రధాన కారణాలలో ఒకటి, ఇవి శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోవడానికి కారణమవుతాయి. వీటికి బదులుగా,  ఆహారంలో పండ్లు, సలాడ్‌లు, డ్రై ఫ్రూట్స్ , ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. నిద్ర.. నిద్రలేమి బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, దీనివల్ల ఆకలి, పదే పదే తినాలనే కోరిక, జంక్ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.  ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు చక్కగా నిద్రపోవడం వల్ల శరీరం కోలుకుంటుంది , బరువు అదుపులో ఉంటుంది. నీరు.. తగినంత నీరు త్రాగడం బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.   నీరు శరీరాన్ని తేమగా ఉంచి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. చాలాసార్లు శరీరం దాహాన్ని ఆకలిగా పొరబడుతుంది, అందువల్ల క్రమం తప్పకుండా నీరు త్రాగడం ముఖ్యం. క్వాంటిటీ.. బరువు తగ్గాలంటే, మీరు ఏమి తింటున్నారు అనేదే కాదు, ఎంత తింటున్నారు అనేది కూడా ముఖ్యం. సమతుల్య ఆహారాన్ని కొద్దికొద్దిగా తినడం వల్ల, కేలరీల వినియోగం అదుపులో ఉంటుంది , శరీరంలో కొవ్వు పేరుకుపోదు.  ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, శక్తి స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.                                       *రూపశ్రీ.

read more
గ్యాస్ సమస్యకు మందుల కంటే ముందు ఇవి ప్రయత్నించం

ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఆరోగ్య అవగాహన వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణుడు Dr. Murali Manohar Chirumamilla గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలను వివరంగా చెబుతున్నారు. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద గృహచిట్కాలు, ఆహార నియమాలు, జీర్ణశక్తిని పెంచే అలవాట్లు గురించి కూడా సూచనలు అందిస్తున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణాలు అజీర్తి మరియు ఉబ్బరం సమస్యల లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరచే సహజ మార్గాలు గ్యాస్ సమస్య తగ్గించేందుకు ఆయుర్వేద సూచనలు ఆహారంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వీడియో ఉపయోగకరమైన అవగాహనను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం సరైన ఆహారం, సరైన అలవాట్లు ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!). 

read more
స్కూల్‌కి వెళ్లే పిల్లల కోసం పర్ఫెక్ట్ డైట్ ప్లాన్.. ప్రతి పేరెంట్ తప్పక తెలుసుకోవాలి!

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. ఈ వయస్సులో శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. అందుకే పిల్లలు తీసుకునే ఆహారం సమతుల్యంగా, పోషకాలతో నిండి ఉండాలి. ఈ "రైట్ డైట్" కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ స్కూల్ పిల్లల కోసం అనుసరించాల్సిన సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన డైట్ గురించి విలువైన సూచనలు అందిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: ✔️ స్కూల్ పిల్లలకు అవసరమైన పోషకాహారం ✔️ ఉదయం అల్పాహారం ఎందుకు తప్పనిసరి? ✔️ టిఫిన్ బాక్స్‌లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ✔️ పాలు, పండ్లు, కూరగాయల ప్రాముఖ్యత ✔️ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల అవసరం ✔️ చాక్లెట్లు, చిప్స్, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ✔️ పిల్లలలో మంచి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి? ✔️ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ✔️ చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే ఆహార సూచనలు తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ఆహారంలో సరైన మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా, చురుకుగా, చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రతి తల్లిదండ్రి తప్పక చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  

read more
స్వైన్ ఫ్లూ వార్నింగ్.. సాధారణ జలుబుకు స్వైన్ ఫ్లూ జలుబుకు డిఫరెన్స్ ఏమిటంటే!

  కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా కేరళలో షిగెల్లా , నిపా వంటి అంటువ్యాధులు తాండవం చేస్తుంటే.. మరోవైపు, కర్ణాటక ప్రజలకు H1N1 (స్వైన్ ఫ్లూ) గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సాధారణ జలుబుకు,  స్వైన్ ఫ్లూ కు మద్య తేడాలు ఏంటో తెలుసుకుంటే.. స్వైన్ ఫ్లూ లక్షణాలు తరచుగా సాధారణ ఇన్ఫ్లుఎంజా లక్షణాలను పోలి ఉంటాయి, అందుకే  ఈ రెండు వ్యాధుల మధ్య తేడాను గుర్తించలేరు. ఇన్ఫెక్షన్ వేగంగా ముదిరి, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం , తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు  ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. H1N1 కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్, కానీ దీని వ్యాప్తి, ప్రమాదం , కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత సాధారణ సీజనల్ ఫ్లూ కంటే ఎక్కువగా ఉంటాయి. వైద్య నివేదికల ప్రకారం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు , ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. వాతావరణ మార్పులను బట్టే.. వాతావరణం మారేకొద్దీ శ్వాసకోశ వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.  ఈ ఇన్ఫెక్షన్లు రద్దీ ప్రదేశాలు, పాఠశాలలు, కార్యాలయాలు , ప్రజా రవాణాలో వేగంగా వ్యాపిస్తాయి. దీర్ఘకాలం పాటు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  దగ్గు తగ్గకపోవడం లేదా తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణ జలుబు సమస్య.. స్వైన్ ఫ్లూ , సాధారణ ఫ్లూ రెండూ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లే, కానీ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్ రకాలు భిన్నంగా ఉండవచ్చు. H1N1 కేవలం ఇన్ఫ్లుయెంజా A వైరస్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. సాధారణ కాలానుగుణ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా A లేదా B తో సహా వివిధ రకాల వైరస్‌ల వల్ల సంభవించవచ్చు.  సాధారణ ఫ్లూలో కూడా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎలా గుర్తించాలి..  కేవలం లక్షణాల ఆధారంగా H1N1 , సాధారణ ఫ్లూ మధ్య తేడాను గుర్తించడం కష్టం. రెండింటిలోనూ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి  ఒళ్ళు నొప్పులు ఉండవచ్చు. ఒక ప్రాంతంలో H1N1 కేసులు పెరుగుతూ ఉండి, రోగి తీవ్ర అనారోగ్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, వైద్యుడు కొన్ని పరీక్షలను సిఫార్సు చేయవచ్చు. H1N1 , సాధారణ ఫ్లూ మధ్య అత్యంత స్పష్టంగా కనిపించే తేడాలలో ఒకటి ఏమిటంటే, H1N1 యొక్క సాధారణ లక్షణాలతో పాటు, కొంతమందికి కడుపు నొప్పి , విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు.                                 *రూపశ్రీ.

read more
మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి!

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు. కానీ వీటి వెనుక గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉండొచ్చు. శరీరంలో నీటి కొరత, తప్పుడు ఆహారపు అలవాట్లు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను మరింత పెంచవచ్చు. ఈ వీడియోలో నీటిని సరైన సమయంలో, సరైన విధంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, గట్ హెల్త్‌ను మెరుగుపరచే సులభమైన మార్గాలు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే గట్ హెల్త్ మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం, రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా తెలియజేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    

read more
మార్కెట్లో నెయ్యి కొంటున్నారా? కల్తీ నెయ్యి ఎలా గుర్తించాలంటే!

భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా చాలామంది నెయ్యి లేకుండా భోజనం చేయరు.  చాలా రకాల తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి వాడతారు.  నెయ్యి కలపడం వల్ల వాటి రుచి పెరగడమే కాకుండా, శరీరానికి కొవ్వు కూడా అందుతుంది, ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చాలామంది భారతీయుల ఇళ్లలో నెయ్యి కనిపిస్తుంది. వెనుకటి కాలంలో నెయ్యిని ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు నెయ్యిని మార్కెట్లో కొనడం అలవాటు అయిపోయింది. శరీరానికి నెయ్యి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో  నెయ్యిని తినడానికి వెనుకాడుతున్నారు. దీనికి కారణం నెయ్యిలో కల్తీ పెరిగిపోవడమే. ఈ కల్తీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా హాని కలిగిస్తోంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారు? కల్తీ నెయ్యిని చౌక నూనెలు, కొవ్వులు, రసాయనాలు, బంగాళాదుంపలు, యూరియా, ఫ్రెషనర్లు, స్వీటెనర్లతో పాటు దాని నాణ్యత , భద్రత రెండింటినీ తగ్గించే అనేక ఇతర హానికరమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది నెయ్యి యొక్క పోషక విలువను తగ్గించి, ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగంటే.. ఒక పరీక్ష నాళికలో 1 మి.లీ కరిగించిన నెయ్యి తీసుకోవాలి. దీనికి 1 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl) కలపాలి. తర్వాత అర టీస్పూన్ చక్కెర కలపాలి.  మిశ్రమాన్ని కనీసం రెండు నిమిషాల పాటు బాగా కదిలించాలి.  తర్వాత దాన్ని ఒకపక్కన ఉంచాలి. నెయ్యి స్వచ్ఛమైనదైతే దాని రంగులో ఎలాంటి మార్పు ఉండదు.  నెయ్యిలో కల్తీ జరిగితే, దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. పరీక్షించేటప్పుడు జాగ్రత్త.. ఇంట్లో HCl ఉపయోగించి నెయ్యిలో కల్తీని పరీక్షించాలని అనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక బలమైన ఆమ్లం , కొన్ని చుక్కలు  శరీరంపై పడినా హానికరం కావచ్చు. ఇది నెయ్యిని పరీక్షించడానికి, నెయ్యి స్వచ్ఛతను నిర్థారించడానికి సహాయపడుతుంది.  అవసరమైతే నెయ్యిని ల్యాబ్ టెస్ట్ కూడా చేయించవచ్చు.                            *రూపశ్రీ.

read more
పిల్లల కంటి చూపు తగ్గిపోవడానికి కారణం మొబైల్ కాదు.. మరి ఏంటి?

పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

read more
ఈ 5 కూరగాయలు ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తాయని చాలామందికి తెలియదు!

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ

read more
ఎప్పుడూ ఏదో ఒక స్నాక్స్ తినాలని అనిపిస్తుందా? ఈ హెల్తీ స్నాక్స్ ట్రై చేయండి!

ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.

read more
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా?  అసలు  నిజం ఏంటంటే!

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా?  ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే.. బరువు పెరగడానికి అసలు కారణం.. డాక్టర్ల ప్రకారం..  బరువు పెరగడం లేదా తగ్గడం అనేది  తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా  రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.  అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు. అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి శక్తిని అందిస్తాయి.  రాత్రి భోజనం చేసేటప్పుడు,  శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల,  ఎక్కువగా అన్నం తిని,  రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. బియ్యం రకం ముఖ్యం.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.  అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం.. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి  జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సమతుల్యం ఉంటేనే.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,  రోజువారీ కేలరీలను  గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల  బరువు పెరగడం అనేది జరగదు.  బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా  తినే ఆహారం పరిమాణం, ఆహార రకం ,  మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.                            *రూపశ్రీ.

read more