నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. ఇవి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట..!

ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.

read more
కొబ్బరి నీరు VS మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందంటే!

వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.

read more
వరల్డ్ హెల్త్ డే..ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..అందిరి చేతుల్లోనూ ఉంది!

  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు  చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు.  ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా  రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.  అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభం.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. ఉద్దేశ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.  ప్రజల్లో అవగాహన పెంచడం.. ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం,  అవగాహన  ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి,  మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన,  వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు.  ఉదాహరణకు..  మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్  వంటి అంశాలు ఉండవచ్చు.  ఈ రోజు తీసుకునే నిర్ణయాలు,  ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం.. దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం,  ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు,  పర్యావరణం,  ఆరోగ్య సూత్రాలు..  వంటివి సూచించడం జరుగుతుంది. నిర్వహించే కార్యక్రమాలు.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని  కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు,  ప్రభుత్వం,  స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.  గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు,  రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు. హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు.  కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు,  స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు. చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం,  ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం,  ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు. అందరూ చేయాల్సింది.. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి.  జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి.  ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి. వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి.  ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.  మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.

read more
వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం.. కారణాలు ఏంటి? ఎవరికి ఎక్కువ రిస్క్..?

వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం ,  ఇతర ఖనిజ స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయి, రాళ్లుగా ఏర్పడతాయి. భారతదేశంలో 12% కంటే ఎక్కువ మంది ప్రజలు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అసలు వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్య ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మూత్రపిండాల రాళ్ల ప్రమాదం.. వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోవడం శరీరంలో తేమ శాతం తగ్గడానికి  దారితీయవచ్చు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీటి కొరత మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాల సాంద్రతను పెంచుతుంది. ఈ ఖనిజాలు కలిసి చిన్న స్ఫటికాలుగా ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ , యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరం డీహైడ్రేషన్ కు  గురైనప్పుడు, ఈ స్ఫటికాలు బయటకు వెళ్లలేక రాళ్లుగా మారతాయి. వేసవిలో డీహైడ్రేషన్  పెరగడం వల్ల ఈ ప్రమాదం అధికమవుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రమాదం? వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం కొంతమందికి  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం,  నీరు తాగడంలో నిర్లక్ష్యం చేసే వారికి ప్రమాదం ఉంటుంది. అలాగే..  ఎక్కువ ఎండలో తిరిగే వారికి, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి,  ఉప్పు ఎక్కువ తినేవారికి,  ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారికి, కాఫీ టీ లు, శీతల పానీయాలు ఎక్కువ తీసుకునేవారికి, శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే వారికి వేసవి కాలంలో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీరు ముఖ్యం.. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. సాధారణంగా, ప్రతిరోజూ 2.5-3 లీటర్ల నీరు త్రాగాలి.  ఎక్కువగా చెమట పట్టినా లేదా బయట పనిచేసినా నీటిని మరింత ఎక్కువ తాగాలి. లేత పసుపు రంగు మూత్రం తగినంత నీరు తీసుకుంటున్నారని సూచిస్తుంది, అయితే ముదురు రంగు మూత్రం వస్తే.. నీరు బాగా తాగాలని సంకేతం.                            *రూపశ్రీ.

read more
వారం రోజుల పాటు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే మార్పులివే..!

పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.

read more
వేసవి కదా అని ఈత కొట్టడానికి వెళ్తున్నారా? ఈ  తప్పులు చేయకండి..!

వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం.  అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు,  చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. స్విమ్మింగ్ ఫూల్  నీటిలోని క్లోరిన్, రసాయనాలు,  బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా  ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్  పెరుగుతుంది.  స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్  తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే  ఈత కొట్టాలి. స్విమ్మింగ్ పూల్‌లో  అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి  జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి.  ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి.  స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది.  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.                               *రూపశ్రీ.

read more
ఖాశీ  కడుపుతో నీరు తాగడం మంచిదేనా? అసలు రోజులో ఎన్ని లీటర్ల నీరు తాగాలి?

ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.

read more
బ్రోకలీ తింటే ఈ వ్యాధులన్నీ దూరం..!

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి?  తెలుసుకుంటే.. బ్రోకలీలో ఉండే పోషకాలు.. బ్రోకలీలో ఫైబర్,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే.. గుండె జబ్బులు.. బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం.  ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తనాళాల ఆరోగ్యం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల  వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు,  పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. క్యాన్సర్.. బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కంటిచూపు.. కంటి చూపుకు పదును పెట్టడంలో,  దృష్టి లోపాన్ని నివారించడంలో,  రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ  కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యం.. బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా  సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం.  బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.

read more
ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలివి..!

మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి.  ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి... ఊబకాయం ఎలా పెరుగుతుందంటే.. కార్యకలాపాలు లేకపోవడం.. శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్  గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఉష్టోగ్రత.. వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది. ఆకలి.. చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. చెమట, డిటాక్స్.. చెమట పట్టడం అనేది శరీరం  సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం,  ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మనస్సు, శరీరం.. చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది.  సోమరితనం పెంచుతుంది. ఇలా జాగ్రత్త పడాలి.. ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి,  లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి. ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. తాజా పండ్లు, సలాడ్లు,  నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.                                   *రూపశ్రీ.

read more
పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయ్..!

భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.

read more
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రాత్రిపూట ఈ అలవాట్లు మానేయాల్సిందే..!

గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.

read more
ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటంటే..!

భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.

read more
శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.

read more
మూత్రపిండాల జబ్బులు.. దిమ్మతిరిగే వాస్తవాలు..!

మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.

read more
ఫ్రూట్ చాట్ అంటే తెగ ఇష్టంగా తింటున్నారా? వైద్యులు చెప్పిన దిమ్మతిరిగే నిజాలు ఇవీ..!

నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.

read more
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే సత్తు ఫుడ్స్..!

వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.

read more