కలరా కలవరపెడుతోందా!

  ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా... రోగం అనే పదం మనిషిని ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఏదో ఒకవైపు నుంచి విరుచుకుపడుతూనే ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు చాలా మందులు ఉండవచ్చు కాక! కానీ నివారణను మించిన మార్గం లేనే లేదు. ఇప్పుడ కలరాదీ అదే పరిస్థితి! ఒకప్పుడు కలరా వ్యాపిస్తే లక్షలాదిమంది పిట్టల్లా రాలిపోయేవారు. మానవచరిత్రలో కలరా బారిన పడి చనిపోయినవారి సంఖ్య కోట్ల మీదే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తూ ఇప్పుడు కలరాని ఎదుర్కొనేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అయినా కలరా గురించి తెలుసుకోవడమే, దాన్ని ఎదుర్కొనేందుకు తొలిమార్గం!   ఇదీ కారణం   మనుషులు తీసుకునే ఆహారంలో, మరీ ముఖ్యంగా మంచినీరులో ‘విబ్రియో కలరే’ అనే సూక్ష్మక్రిమి చేరడం వల్ల కలరా వ్యాపిస్తుంది. ఇది మన పేగులలో చేరి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కలరా సోకిన మనిషిలో వాంతులు, విరేచనాలు, దాహం, గొంతు పొడిబారిపోవడం, కండరాల నొప్పులు, కడుపునొప్పి... ఇలా చాలా రకాలైన లక్షణాలు కనిపించవచ్చు. శరీర తత్వాన్ని బట్టి ఈ లక్షణాలు ఒక గంట నుంచి ఐదు రోజుల వరకూ ఎప్పుడైనా బయటపడవచ్చు. అలాగని కలరా సోకిన వారందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయనుకోవడానికి లేదు. ఎలాంటి లక్షణాలు లేనివారు తమకు తెలియకుండానే ఇతరులకు కలరాని అంటించే ప్రమాదం లేకపోలేదు.   వ్యాపించే తీరు!   కలరా సోకిన మనిషి మలమూత్రాల ద్వారా ఈ వ్యాధి చాలా త్వరితగతిన ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. నీటిలో కలిసి ఈ విసర్జితాలన ద్వారా కలరా వ్యాపిస్తుంది. మన ఇంట్లో తాగే నీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ హోటళ్లు, చిరుతిండి బళ్లు, బస్టాండుల వంటి ప్రదేశాలలో నీటి గురించి అంత శ్రద్ధ వహించే అవకాశం ఉండకపోవచ్చు. నీరు చల్లగా ఉండేందుకు వాడే ఐస్‌ ఏ నీటితో తయారుచేస్తున్నారో తెలియదు. మనం వాడే కూరగాయలు ఏ నీటిలో పండిస్తున్నారో తెలుసుకోలేం! ఆఖరికి పానీపూరీ వంటి పదార్థాలలో ఏ నీరు కలుస్తోందో చెప్పలేం! అందుకని కలరా గురించిన వార్తలు వినిపిస్తుంటే... తినే ఆహారం విషయంలోనూ, తాగే నీటి విషయంలోనూ వీలైనంత జాగ్రత్త వహించడం అవసరం.   ఎలాంటి జాగ్రత్తలు?   - పైపుల్లో వస్తున్న నీరు రంగుమారినట్లు కానీ, వాసనతో కానీ వస్తుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.   - కలరా వ్యాపించిందని తెలియగానే త్రాగునీటిని కాచి చల్లార్చి వడబోసి మాత్రమే తాగాలి. ముఖ్యంగా పిల్లలుండే ఇళ్లలో ఈ జాగ్రత్తను తప్పకుండా పాటించాలి.   - బయటకు వెళ్లేటప్పుడు ఒక బాటల్‌ నీటిని వెంట తీసకువెళ్లక తప్పదు. దీనివల్ల ఎక్కడ దాహం వేస్తే అక్కడి నీటిని తాగాల్సిన అగత్యం ఉండదు.   - బయట నుంచి వచ్చిన తరువాత కూడా కాళ్లూచేతులను శుభ్రంగా కడుక్కోవడం మరువకూడదు.   - వాంతులు, విరేచనాలు వంటి కలరాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించడం మంచిది. కలరాను కనుక నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.   - పళ్లు, కూరగాయలను వాడకానికి ముందు శుభ్రంగా కడగాలి. కలరా భయం తీరేంతవరకూ పళ్లు, కాయగూరలను చెక్కుతీసుకునే వాడుకోవాలి.   ఈ చర్యలతో కలరా ఆమడ దూరంలో ఉండిపోతుందని వేరే చెప్పనవసరం లేదు కదా!   - నిర్జర.

read more
మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!

    మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!   నలుగురూ నడిచేదారే సవ్యమైనది కాకపోవచ్చు. అందరూ మంచి అని నమ్మేదే నిజం కావాలన్న నియమం ఏదీ లేదు! ఆహారంలో పోషకాల విలువలకి సంబంధించి కూడా ఇదే విషయం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. సాధారణ పౌరులంతా ఆహా ఓహో అనుకునే ఆహారాలలో అంత పటుత్వం ఉందని చెప్పలేమంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేయడం కోసం ‘న్యూయార్క్‌ టైమ్స్’ పత్రిక ఓ పరిశోధనను చేసింది. అదేమిటంటే...   ఆహారంలో పోషక విలువలకు సంబంధించి, అమెరికాలోని ఒక రెండువేల మంది పౌరుల అభిప్రాయాలను సేకరించింది న్యూయార్క్‌ టైమ్స్‌! ఒక యాభైకి పౌగా ఆహార పదార్థాల జాబితాను వీరికి అందించి వీటిలో ఏ పదార్థానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నారో తెలియచేయమంది. మరోవైపు ఒక 672 మంది పోషకాహార నిపుణులను కూడా సంప్రదించింది. పౌరులకు అందించిన ఆహారపదార్థాల జాబితానే ఈ నిపుణులకు కూడా అందించింది. ఆ జాబితాలో ఉన్న పదార్థాల మీద వారి అభిప్రాయమూ సేకరించింది.     పోషక పదార్థాలకు సంబంధించి ఇటు పౌరులకీ, అటు పోషకాహార నిపుణులకి ఉన్న అభిప్రాయాలలో భూమ్యాకాశాలకు ఉన్నంత వ్యత్యాసం కనిపించింది. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో రకరకాల పప్పులతో రూపొందిస్తున్న ఎనర్జీ బార్స్‌ (granola bars) అద్భుతమైన పోషకాలను అందిస్తాయని 71 శాతం పౌరులు భావిస్తే, కేవలం 28 శాతం నిపుణులు మాత్రమే ఈ వాదనతో ఏకీభవించారు. దీనికి పూర్తివ్యతిరేకంగా ద్రాక్షసారాయి (Wine) ఆరోగ్యానికి మంచిదని 70 శాతం మంది నిపుణులు అనుకుంటే, కేవలం 52 శాతం పౌరులు మాత్రమే ఈ అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నారు. అలాగని అన్ని ఆహారపదార్థాల విషయంలోనూ ఈ వైరుధ్యం కనిపించింది అనుకోవడానికి లేదు. పాప్‌కార్న్‌, జున్ను, పాలు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివని అటు నిపుణులూ, ఇటు పౌరులూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇంతకీ పౌరులు, నిపుణుల అభిప్రాయాల మధ్య ఇంత వైరుధ్యం ఎందుకు తలెత్తినట్లు! అంటే దానికి చాలా కారణాలే చెబుతున్నారు పరిశోధకులు.   - ఆహారపదార్థాలలో పైపైన కనిపించే మెరుగులకి పౌరులు ఆకర్షింపబడతారే కానీ అందులో అంతర్గతంగా ఉన్న అంశాల జోలికి పోరు. ఉదాహరణకు ఎనర్జీ బార్స్‌లో ఉండే పప్పుల గురించి ఆలోచిస్తారే కానీ ఆ చాక్లెట్లని రూపొందించేందుకు వాడే చక్కెర పదార్థాలని పట్టించుకోరు.   - పౌరుల ఆలోచనాతీరు ఎక్కువగా ప్రకటనల వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు... నారింజరసం తాగడం వల్ల వెంటనే శక్తి, పోషకాలు కలుగుతాయని తరచూ ప్రకటనలు వస్తే... అది నిజమే కాబోసు అని వారు నమ్మేస్తారు. కానీ అందులో పీచుపదార్థాలు ఉండవనీ, చక్కెర శాతం అధికమనీ నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు.   - మన రోజువారీ అవసరాలను తీర్చేందుకు ఏఏ పోషకాలు ఏ స్థాయిలో అవసరం అన్న అవగాహన సాధారణ పౌరులకు తక్కువగా ఉంటుంది.   కాబట్టి మనం ఆరోగ్యమైన ఆహారం అనుకునేదో, ప్రకటనల్లో కనిపించే అభిప్రాయాలో నిజం అనుకోవడానికి వీల్లేదని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. ఏది నిజమైన పోషకాహారమో తెలియాలంటే నిపుణుల మాట వినాలని హెచ్చరిస్తోంది.   - నిర్జర.

read more
గార్డెనింగ్‌తో ఆరోగ్యం!

  ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో ఎవ్వరికీ నిమిషం ఖాళీ ఉండటం లేదు. ఇంత వేగంగా సాగే జీవితంలోనూ మొక్కలని పెంచడం అంటే ఇష్టపడేవారు లేకపోలేదు. ఇంటి పెరడులో ఏ కాస్త జాగా ఉన్నా, రోజులో ఏ మాత్రం ఖాళీ ఉన్నా... తోటపనిలో తృప్తిని పొందేవారు కనిపించకపోరు. కానీ తోటపని అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదనీ, అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించే మార్గం అని అంటున్నారు నిపుణులు. నమ్మనివారి కోసం చాలా కారణాలనే చూపిస్తున్నారు.   ప్రశాంతత లభిస్తుంది:  నెదర్లాండ్స్‌ చెందిన కొందరు నిపుణులు ఆ మధ్య ఒక పరిశోధనను చేశారు. అందులో భాగంగా రోజులో ఒక అరగంటపాటు కొందరిని తోటపని చేయమని, మరికొందరిని ఇంట్లోనే ఉండి చదువుకోమనీ చెప్పారు. ఫలితం! తోటపని చేసిన వారి మనసు చాలా ఉల్లాసంగా మారిపోయిందట. పైగా మానసిక ఒత్తిడి కారణంగా ఉత్పత్తి అయ్యే ‘కార్టిసాల్‌’ అనే రసాయనం కూడా వీరిలో తగ్గుముఖం పట్టిందట. ఊబకాయం నుంచి గుండెజబ్బుల వరకూ నానారకాల అనారోగ్య సమస్యలకూ ఈ కార్టిసాల్‌ ఓ కారణం! దీనిని బట్టి తోటపని అమితమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తేలిపోయింది.   అధిక వ్యాయామం:  చాలామంది నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలే అత్యద్భుత ఫలితాలు ఇస్తాయని అనుకుంటారు. కానీ తోటపని ఒకటి ఉందన్న విషయం మర్చిపోతారు. తోటపనిలో మట్టిని తవ్విపోయడం, పాదులు కట్టడం, మొక్కలు నాటడం, కలుపుని ఏరివేయడం... ఇలా చాలా పనే చేయవలసి ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావల్సినంత వ్యాయామం లభిస్తుంది. పైగా ఈ తోటపని చేసే సమయంలో కళ్ల దగ్గర్నుంచీ వేళ్ల వరకూ ప్రతీ అవయవమూ నేర్పుగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే శరీరంలోని ప్రతిభాగానికీ ఇది చురుకుదనాన్ని అందిస్తుందన్నమాట! పైగా శరీరం ఎటు పడితే అటుగా వంగే నేర్పునీ అలవరుస్తుంది.   విటమిన్‌ డి:  శరీరానికి ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే పోషకం- విటమిన్‌ ‘డి’. కానీ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్న జీవనశైలి వల్ల ఈ డి విటమిన్‌ కూడా ఇప్పుడు మనకి దూరమవుతోంది. దీంతో శరీరానికి అవసరమయ్యే కాల్షియంను శోషించుకునే శక్తిని కోల్పోతున్నాము. చర్మవ్యాధుల దగ్గర్నుంచీ చక్కెర వ్యాధి వరకూ... చాలా సమస్యలని అదుపులో ఉంచేందుకు డి విటమిన్‌ అత్యవసరం. తరచూ తోటపని చేయడం వల్ల ఈ డి విటమిన్ మనకు కావల్సినంతగా లభించే అవకాశం ఉంది.   మెదడుకీ మంచిదే!:  తోటపనిలో కేవలం శరీరం మాత్రమే కాదు... మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంతో పాటు వచ్చే అల్జీమర్స్‌, మతిమరపు వంటి సమస్యలకి తోటపని చాలా ఉపయుక్తమట! తోటపని చేసే అలవాటు లేనివారితో పోలిస్తే, ఆ అలవాటు ఉన్నవారిలో మతిమరపు సమస్య దాదాపు 47 శాతం తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.   సంతృప్తి:  తోటపని చేసేవారిలో..... తాము ఒక మొక్కకి జీవం పోసామన్న సంతృప్తి, ఆ మొక్కలు పెరుగుతున్నప్పుడు కలిగే సంతోషం ఏ ఆస్తిపాస్తులకీ తీసిపోవు. ఇక తాము నాటిన చెట్ల నుంచి సహజసిద్ధంగా లభించే కూరగాయలు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు. చెట్లని పెంచడం, వాటి మధ్య ఉండటం... మనిషికి తాను కూడా ప్రకృతిలో ఒక భాగం అన్న భావనను కలిగిస్తుంది. ప్రకృతితో ఉండే ఆ అనుబంధంతో అతని ఆయుష్షు మరింతగా పెరుగుతుంది.   - నిర్జర.

read more
మైదాతో జాగ్రత్త!

ఒకప్పుడు దక్షిణాది భారతీయులకి మైదా అంటే ఏమిటో తెలియదు. బియ్యం లేదా గోధమపిండితోనే వారి జీవనశైలి ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడో! బేకరీల దగ్గర నుంచీ పరాఠా హోటళ్ల దాకా మైదాదే ప్రపంచం. కానీ ఆహార నిపుణులు మాత్రం ఈ మైదాని స్లో పాయిజన్‌గా గుర్తిస్తున్నారు. వీలైనంతగా మైదాకు దూరంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే...   ఉత్పత్తిలోనే రసాయనాలు:  గోధుమ గింజల్లో ఉండే పిండి పదార్థాలను వేరు చేస్తే అదే మైదాగా మారుతుంది. నిజానికి మైదా రంగు తెలుపు కాదు- పసుపు. పసుపు రంగులో ఉండే మైదాకు తెల్లటి తెలుపుని ఇచ్చేందుకు Benzoic peroxide అనే రసాయనాన్ని కలుపుతారు. ఇక మెత్తగా ఉండేందుకు alloxan అనే రసాయనాన్నీ వాడతారు. ఆహారంలో ఇలాంటి కృత్రిమ రసాయనాలు చేరిక ఏమంత ఆరోగ్యం కాదని వేరే చెప్పనవసరం లేదు కదా!   ఒక్కసారిగా చక్కెర:  మైదాలో GI (glycaemic index) చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిని తిన్నవెంటనే చాలా అధికంగా, చాలా త్వరగా చక్కెరను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇలా త్వరగా ఉత్పత్తి అయిన చక్కెరను నియంత్రించేందుకు మన శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుంది. తరచూ మైదాని తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి, తద్వారా పాంక్రియాస్‌ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే చక్కెర వ్యాధి బారిన పడక తప్పదు.   పీచుపదార్థాలు సున్నా:  మైదాలో పిండిపదార్థాలే కానీ పీచుపదార్థాలు కనిపించవు. మనం తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావాలంటే, అందులో ఎంతో కొంత పీచుపదార్థం తప్పనిసరిగా ఉండితీరాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పేగుల్లో పుండు మొదలుకొని మొలల వ్యాధి వరకూ నానారకాల రోగాలు దాడిచేసే ప్రమాదం మైదా కలిగిస్తోంది.   పోషకాలు గుండుసున్నా:  మైదాలో ఉండే పోషకాల పట్టికను చూస్తే గుండె తరుక్కుపోక తప్పదు. అందులో పిండిపదార్థాలు తప్ప విటమిన్లు కనిపించవు. ఇక ఖనిజాలు, ప్రొటీన్ల శాతమూ అంతంతమాత్రమే! అంటే మైదాతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం తప్ప మరేదీ మిగలదన్నమాట.   అవసరానికి మించి తినిపిస్తుంది:  మైదాలో gliadin అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తాత్కాలికంగా పెంచుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. అంటే ఒక పరాఠా తిన్నవాడు వెంటనే మరో పరాఠా కోసం సిద్ధపడిపోతాడన్నమాట. అసలు మైదాలో ఉండేదే పిండిపదార్థాలు! ఇక ఈ పిండిపదార్థాలను రెట్టింపుగా తీసుకునేలా చేయడం వల్ల మైదా ఊబకాయానికి దారితీస్తోంది.   మైదామయం:  ఇప్పుడు ఏ సందు చివర చూసినా బేకరీలే కనిపిస్తున్నాయి. బేకరీ పదార్థాలలో మైదాదే ముఖ్యపాత్ర. పఫ్‌ దగ్గర నుంచి బ్రెడ్ వరకూ మైదా లేనిదే బేకరీలో పని జరగదు. ఇక ఈ మైదాకి తోడు అజినమోటో, MSG వంటి పదార్థాలు కలిస్తే ఇక చెప్పేదేముంది. అనారోగ్యాన్ని టోకుని ఆహారం ద్వారా తీసుకున్నట్లు అవుతుంది.   అసటే మన ఆహారంలో పిండిపదార్థాల శాతం ఎక్కువ. బియ్యం, స్వీట్లు, దుంపలు... వంటి ఆహారాన్ని మనం అధికంగా తీసుకుంటూ ఉంటాము. ఇక వీటికి తోడు ఇప్పుడు బేకరీ చిరుతిళ్లు, పరాఠాలు, పూరీలు, చపాతీలు... అన్నీ కూడా మైదాతోనే తయారవుతున్నాయి. కాబట్టి మైదా పదార్థాల జోలికి పోయేముందు కాస్త నిదానించి, మంచీ చెడూ బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   - నిర్జర.

read more
ఊబకాయం తగ్గాలంటే!

  ఇప్పుడు ఎవరిని కదిపినా, ఊబకాయమే తమ ప్రధాన సమస్య అంటున్నారు. మారుతున్న జీవనశైలిలో కలిసి సాగినందుకు ప్రతిఫలంగా ఇప్పుడందరికీ ఊబకాయమే దక్కుతోంది. బరువెక్కిపోతున్న ఒంటితో మనిషి రూపం ఎలాగూ మారిపోతుంది. దీంతో రోజువారీ వెంటాడే సమస్యలు మొదలుకొని దీర్ఘకాలికంగా దెబ్బతీసే అనారోగ్యాల వరకూ ఏర్పడే దుష్ప్రభావాలు తక్కువేమీ కాదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే ఊబకాయం నుంచి దూరం కావడం అంత తక్కువేమీ కాదేమో.. మీరే చూడండి!   సమస్యని గుర్తించడం:  ఊబకాయం ఏర్పడటానికి ఒకొక్కరికీ ఒకో కారణం ఉంటుంది. కొంతమంది అధికంగా చక్కెర పదార్థాలు తినడం వల్ల (కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌) ఊబకాయం వస్తుంది. మరి కొందరికి మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. ఇంకొందరికి కదలకుండా కూర్చోవడం వల్లో, తరచూ మద్యపానం చేయడం వల్లో వస్తుంది. అందుకని ముందుగా సమస్యని గుర్తించడం... దాన్ని ఎలా ఎదుర్కోవడం అన్నదాని మీద కసరత్తు జరగాలి.   ఆహారంలో మార్పులు:  ఆహారం అంటే ఔషధం అని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర తత్వానికీ, పరిస్థితికీ అనుగుణంగానే ఆహారాన్ని నిర్ణయించుకోవాలన్నది శతాబ్దాలుగా వినిపిస్తున్న మాట. కొన్ని ఆహారాలు చక్కెర అధికంగా ఉంది శక్తిని అందిస్తాయి. కొన్ని కావల్సిన పోషకాలని ఇస్తాయి. మరి కొన్నింటి వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. అందుకని ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకున్న శ్రద్ధ ఉన్నప్పుడు అవసరానికి మించి శక్తిని అందించే బంగాళదుంప వంటి కూరలనీ బేకరీ పదార్థాలనీ విడనాడాలి. మనకి అవసరమయ్యే శక్తిని అందిస్తూనే, ఒంట్లోని కొవ్వుని కరిగించే ఓట్స్‌ వంటి పదార్థాలకి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.   శిక్షకుల అవసరం:  ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు ఏ యోగాసనాలో, వ్యాయామాలో చేసేయాలని ఉబలాటపడటం సహజం. కానీ నిపుణుడైన పర్యవేక్షకుని సలహా ఉన్నప్పుడే... ఒక క్రమశిక్షణ ప్రకారం, నియమానుసారంగా శ్రమించడం మంచిది. పైకి సాధారణంగా కనిపించే కపాలభాతి వంటి వ్యాయామాలు కూడా పర్యవేక్షకుని సలహా లేకపోతే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. మన శరీర తత్వాన్ని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు నిపుణులు ఎలాంటి వ్యాయామం చేయాలి? ఎప్పుడు చేయాలి? వాటిని పాటించేటప్పుడు ఏర్పడే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? వంటి సూచనలు సలహాలు ఇస్తారు.   చిట్కాలతో పోయేదేముంది:  కొన్నికొన్నిసార్లు చిట్కావైద్యం అద్భుతాలు చేయవచ్చు. వేడి నీటిలో తేనెని కలుపుకుని తాడగం, రాగిచెంబులో ఉంచిన నీరు తాగడం, వెల్లుల్లిని తీసుకోవడం, గ్రీన్‌ టీ తాగడం... వంటి చిట్కాల మీద ఓ రాయి వేసి చూడవచ్చు. అయితే ఒకోసారి చిట్కా వైద్యం కూడా వికటించే ప్రమాదం ఉంది కాబట్టి... అజీర్ణం, నిద్రలేమి, వాంతులు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే ఈ చిట్కాలను ఆపేయడం మంచిది. ఇక నిపుణుల సలహా లేకుండా భస్మాలూ, పొడులూ వంటివాటి జోలికి పోకపోవడం ఉత్తమం.   సహనమే శ్రీరామరక్ష!:  ఏదో ఒక రోజున అద్దంలో ఊబకాయం ఉన్న విషయం మనల్ని బాధపెడుతుంది. వెంటనే దానిని తగ్గించుకునేందుకు హడావుడి పడిపోతాం. కానీ రోజులు గడుస్తున్నా మన శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవడం చూసి నిరుత్సాహంతో మళ్లీ పాత జీవనశైలికే అలవాటుపడిపోతాము. కానీ ఊబకాయం ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో ఏర్పడినది కాదన్న నిజాన్ని మనం గ్రహించం. నెలల తరబడి పేరుకుపోయిన అధిక కొవ్వుని కరిగించేందుకు ఒకోసారి ఏళ్లు పడతాయన్ని విషయాన్ని అంగీకరించం. కాబట్టి ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ముందు కావల్సింది సహనం. కోరుకున్న మార్పుని ఏళ్ల తరబడి ఆచరించే నిబద్ధత!

read more
మనసు బాగోకపోతే... ఆర్థికంగా దివాళా!

  ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ... ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘Money and Mental Health Policy Institute’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది.   మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం... ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో... - 93 శాతం మంది తాము అవసరానికి మించి ఖర్చుపెడుతున్నామని ఒప్పుకున్నారు. - 92 శాతం మంది తాము ఆర్థిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని తేల్చిచెప్పారు. - 59 శాతం, తమకి అవసరం లేకపోయినా కూడా అప్పులు తీసుకుంటున్నామని తెగ బాధపడిపోయారు.   అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడమే కాదు... ఆ రుణాలకి సంబంధించిన నిబంధనలను అర్థం చేసేకోకుండానే రుణ ఒప్పందాలు పూర్తిచేశామని 24 శాతం మంది వాపోయారు. మరో 38 శాతం మంది ఆ అప్పు తీసుకునే సమయంలో తనకి ఏం చెప్పారో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా అప్పులకు దిగడం మాట అటుంచి, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకంగా 38 శాతం మంది ఉద్యోగాన్ని కోల్పోయారని తేలింది. ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా చాలానే బయటపడ్డాయి. అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, ఆర్థిక సంబంధాలను చెడగొట్టుకోవడం... వంటి దీర్ఘకాలిక నష్టాలతో జీవితం కునారిల్లిపోతుందిట.   పైన పేర్కొన్న కారణాలన్నింటివల్లా... మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. మనసులో ఉన్న అలజడి ఉపశమించేందుకో, సమాజంలో విలువను పెంచుకునేందుకో, అలవాటుగానో, నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనో... ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మానసిక స్థితిని గమనించుకోమని సూచిస్తున్నారు. మరోవైపు అటు వైద్యులు కానీ, ఇటు ఆర్థికరంగ సలహాదారులుకానీ తమ దగ్గరికి వచ్చేవారిలో మానసిక ఒత్తిడిని గమనించడమూ... వారి ఆర్థిక స్థితి మీద ఆ ఒత్తిడి ప్రభావం కలుగకుండా తగు హెచ్చరికలు చేయడమూ ఉండాలి.   - నిర్జర.

read more
ఆడవారు ఎక్కువసేపు ఉద్యోగం చేస్తే!

  మారుతున్న సమాజంలో స్పష్టంగా కనిపించే అంశం... ఆడవారు కూడా ఉద్యోగసోపానంలో ఉన్నత శిఖరాలను అందుకోవడం! మరి తమను తాము నిరూపించుకునే క్రమంలో వారు ఛేదిస్తున్న లక్ష్యాలతో పాటుగా వెంటాడుతున్న అనారోగ్యాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.   ఆదివారం మినహా రోజుకి పదేసిగంటలపాటు ఉద్యోగం చేస్తూ ఉంటే... ఎవరికైనా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటివారు అజీర్ణం, ఊబకాయం... లాంటి అనారోగ్యాలను గమనించుకోక తప్పదు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ‘అలార్డ్‌’ అనే పరిశోధకుడు పూనుకున్నాడు. తన పరిశోధన కోసం దాదాపు 7,500 ఉద్యోగులను మూడు దశాబ్దాల పాటుగా గమనించాడు. వీళ్లలో గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తపోటు, డిప్రెషన్‌ లాంటి సమస్యలు ఏర్పడటానికీ... పనిగంటలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని పరిశీలించాడు.   అలార్డ్‌ పరిశోధనల్లో... పనిగంటలకీ, పైన పేర్కొన్న వ్యాధులకీ కొంత సంబంధం ఉందని తేలింది. అయితే విచిత్రంగా ఆడవారిలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోందన్న దాని మీద అలార్డ్‌ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది. ‘బహుశా ఉద్యోగిగా, గృహిణిగా, తల్లిగా... ఇన్ని బాధ్యతలను ఒక్కసారిగా సమర్థవంతంగా మోయాలనుకునే ప్రయత్నంలో వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోందేమో’ అని ఊహిస్తున్నారు అలార్డ్‌. అయితే డా॥ గోల్డ్‌బర్గ్‌ అనే వైద్యరాలు మాత్రం అధికపనిగంటల వల్ల ఆడవారు అనారోగ్యం పాలవ్వడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు.   పని ఒత్తిడిలో పడిపోయి ఆడవారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరనీ. స్త్రీలకు అవసరమైన మేమోగ్రాం వంటి పరీక్షలు చేయించుకునేందుకు కూడా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారనీ గోల్డ్‌బర్గ్‌ విశ్లేషిస్తున్నారు. అంతేకాదు! ఉద్యోగం చేసే ఆడవారు ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టేసుకుంటారనీ అంటున్నారు.   మరి అధిక పనిగంటలు ఉన్నాయి కదా అని ఆడవారు ఉద్యోగాలలో వెనుకంజ వేయాలా? అంటే అదేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలలో ఏది అవసరం, ఏది అనవసరం అని బేరీజు వేసుకుని అనవసరమైన బాధ్యతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజులో కాస్త సమయాన్నైనా తమకోసం వెచ్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేయడమో, పుస్తకాలు చదవడమో, టీవీతో కాలక్షేపం చేయడమో, ధ్యానంలో ఉండటమో... ఇలా ఉద్యోగపరమైన ఆలోచనల నుంచి కాసేపు మనసుకి విశ్రాంతిని కలిగించమంటున్నారు.   - నిర్జర.

read more
ఎప్పుడూ కూర్చుని వుంటే రిస్క్

        నడుము పూసలు, డిస్కులు వయసుతోపాటు అరిగే అవకాసం ఉన్న మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సాద్యమైనంత ఎక్కువ కాలం వాయిదా వేయచ్చు. కూర్చునిచేసే శరీరానికి నష్టం ఏముంటుంది అనుకుంటాం కాని, ఎప్పుడు కూర్చుని ఉండే వాళ్ళకే డిస్కుల అరుగుదల ఎక్కువగా వుంటుంది అంటున్నారు నిపుణులు.   మన వెన్నుపూస డిస్కుల మిద భారం పడేది కూర్చుని ఉన్నపుడే  - నడక వల్లకాని, పనులవల్ల కాని సైక్లింగ్ వల్ల కాని డిస్కుల మీదభారం పడదు. ఎప్పుడు కూర్చుని ఉండడం వల్ల డిస్కుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది .దీంతో ఆ డిస్కులు త్వరగా క్షీణించటం ప్రారంభిస్తాయట. అలా కాకుండదంటే  నడుముకు సంబందించిన వ్యాయామాలు తప్పక చేసి తీరాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు . వ్యాయామంవల్ల కండరాలు బలపడతాయి  - అప్పుడు అవి భారాన్ని పంచుకోగలుగుతాయి . దాని వలన  పూసలు, డిస్కులు  మీద ఒత్తిడి తగ్గుతుంది అందుకే ప్రాధమిక కదలికలు ఉండే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని హెచ్చరిస్తున్నారు  వైద్య నిపుణులు . ...రమ

read more
రాత్రిపూట వెలుతురుతో క్యాన్సర్‌!

  ఒకప్పుడు సముద్రంలో ప్రయాణాలు చేసే నావికులు ఆకాశంలోని చుక్కల సాయంతోనే ముందుకు సాగేవారు. రాత్రిపూట నేల మీద సంచరించే బాటసారులు సైతం ఆకాశాన్ని చూసి సమయాన్ని, రుతువునీ చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం మనిషికి లేకపోయింది. చిన్న చిన్న పడవుల్లో కూడా ఇప్పుడు జీపీఎస్‌ సిస్టంలు వచ్చేశాయి. ఇక నేల మీద ఉండే మనిషి తల ఎత్తి ఆకాశాన్ని చూడటమే మానేశాడు. ఇప్పుడు ఆకాశం కూడా వెలుగుల మయం అయిపోతోంది. నాగరికత పుణ్యమా అని చీకటి రాత్రులు కృత్రిమ వెలుగులతో నిండిపోతున్నాయి. కానీ ఈ స్థితి శృతి మించిపోతోందనీ, కాంతి కాలుష్యానికి దారి తీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.   కాంతి కాలుష్యం వల్ల జీవవైవిధ్యానికి (బయో డైవర్సిటీ) ముప్పు వాటిల్లుతుందన్నది తెలిసిందే! గూళ్లకు చేరుకునే పక్షులు, రాత్రిపూట సంచరించే జీవులు, చెట్టూచేమా, సముద్ర జీవులూ, కోరల్‌ రీఫ్స్‌... వీటన్నింటికీ లెక్కలేనంత నష్టం జరుగుతోందని చెబుతున్నదే! కానీ తన దాకా వస్తేకానీ పట్టిచుకోని మనిషికి... ఈ కాంతి కాలుష్యం తన దాకా వచ్చేసిందని ఇప్పుడు తేలింది. ఈ విషయమై ఐరోపాలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు, మనిషి ఆరోగ్యం మీద కాంతి కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తేల్చి చెబుతున్నాయి.   మనిషి మీద కాంతి కాలుష్య ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్న వాస్తవాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరి అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడో వంతు మంది కృత్రిమ కాంతి వల్ల, రాత్రిపూట పాలపుంతని సైతం చూడలేకపోతున్నారట. ఇక ఉత్తర అమెరికాలో అయితే 80 శాతం మంది ఈ దురదృష్టానికి నోచుకుంటున్నారు. రాత్రిపూట నక్షత్రాలని చూసి ఆస్వాదించలేకపోవడం, ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలని సాగించలేకపోవడం అటుంచితే.... కాంతి కాలుష్యం మన స్పందనల మీద ప్రభావం చూపుతుందన్నది పరిశోధకుల వాదన.   పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం మన శరీరంలో `circadian rhythm’  అనే వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక రకంగా జీవగడియారం వంటిదన్నమాట. బయట ఉన్న వెలుతురు, వేడి ఆధారంగా ఇది శరీరానికి అవసరమైన సూచనలు చేస్తుంది. కాంతి కాలుష్యం ఈ సర్కేడియన్‌ రిథమ్‌ మీద ప్రభావం చూపుతుందంటున్నారు. దాంతో నిద్రలేమి, మానసిక క్రుంగుబాటు మొదలుకొని క్యాన్సర్‌, గుండెజబ్బుల వరకూ మన మీద దాడి చేసే అవకాశం ఉందట. మన శరీరంలో పదిశాతానికి పైగా జన్యువులను ఈ సర్కేడియన్‌ రిథమ్‌ ప్రభావితం చేస్తుంది కాబట్టి, శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలని నమ్మక తప్పదు.   ఇన్ని నష్టాలకు కారణమైన కాంతికాలుష్యం నుంచి ప్రపంచాన్ని తప్పించడానికి శాస్త్రవేత్తలు చాలా సూచనలే చేస్తున్నారు. అవసరం లేని చోట్ల లైట్లు వేయడం తగ్గించుకోవాలనీ, ఆర్భాటం కోసం విద్యుత్తుని వెలిగించకూడదనీ సలహా ఇస్తున్నారు. వీధి దీపాలు కూడా నేల వైపు వెలుగులు ప్రసరించేలా చూడాలని కోరుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరో ఆచరిస్తే సాధ్యమయ్యేవి కావు. పౌరులను బెదిరించి సాధ్యం చేసుకునేవీ కావు. కాంతి కాలుష్యాన్ని తగ్గించాలన్న స్పృహ వ్యక్తిగత విచక్షణతోనే సాధ్యపడుతుంది. అప్పటిదాకా రాత్రివేళల్లో బయట నుంచి వచ్చే కాంతి నుంచి కాపాడుకునేందుకు మందపాట కిటికీ తెరలను తెచ్చుకుందాం!   - నిర్జర.

read more
Chronic Sinusitis and its effect on Teeth

  Sinusitis that occurs due to immune system reaction to fungi causes oh-so many irritations...the cheek bones hurt, mainly due to inflammation and clogging of the sinus glands, the eye brows hurt as the sinuses behind the eye brows swell..breathing might be difficult for some, blowing the nose could be impossible for few, but strangely for the first time in six years of my stay in USA, i started feeling all symtoms of a Pollen allergy a month ago, and then has Throat irritation followed by a high fever, and after a gap of two days, it recurrence of allergy that triggered a serious sinus issue..i had never experienced a sinus infection and ddnt know what to expect..it took me just few hours to know that my sinuses are hurting...but why were my gums hurting too ?     I was so worried about my teeth health..then i suspect it could be the sinus problem that is causing my gums to hurt...when i research, it is proved that a poor sinus health can cause so much chaos in the jaw region creating sore pain and pressure on the gums..and to my question 'is there a treatment ?'...I found answers routing me to home remedies. Seriously, who could even imagine that Sinusitis causes Gum pain. What happens in there ?!   The upper teeth in our body are placed so close to the maxillary sinuses in the cheek region and even a slight sinus inflammation can be felt in the teeth and gums...the pain varies from person to person. The mucus fills in the pockets above the teeth and creates pressure, which seems like gum pain...ask me and i will tell you, it is not something you ask for !   The only relief options could be home remedies...rubbing Clove oil against the hurting gums, applying pressed ginger juice or garlic juice may offer an pain-reducing effect, however, the initial few minutes of applying these strong agents might be hard to handle. Take the case to your Doctor, he might combine an Aneasthetic with a Anti-histamine drug but pray that you dont get targeted by Sinusitis due to Cold or due to Climatic allergies every year ! Been there, done that !!   ..Prathyusha  

read more
Hic... Hic... Hiccups

  Hiccups might sound funny. Hiccups might just be a passing cloud. But they are a part of our anatomy. We often panic when we get them and confused with their cause. So, it’s always good to know everything about the Hiccups.   The Hic sound   There is an organ in our respiratory system called Diaphragm. This Diaphragm contracts and expands to allow air into our lungs. In the case of Hiccups, this Diaphragm gets into some involuntary contractions. Such sudden movements would also close the vocal cords at once... and that is the reason for the HIC sound.   But why?   Scientists are not sure of the reason for Hiccups. But some say that such reflex has developed in mammals to flush out the air locked up in the stomach while drinking milk. That might be the reason why Hiccups are found only in those mammals that drink milk... and this might also explain why kids feeding on milk are the ones who suffer with Hiccups often. This explanation proves the reason why elders warn us to wait till our kids burp after having milk to avoid Hiccups.   Other Reasons:   There are some other reasons that might trigger Hiccups... - Eating food quickly and in huge quantity. - Intake of Alcoholic beverages. - Swallowing much air while breathing or eating. - Unstoppable laughing. - Getting emotional through fear, excitement, stress.... - Eating dry or spicy food.   Home Remedies:   Hiccups might not be painful but are certainly disturbing. We have a lot of tried and tested methods to treat Hiccups...   - Having a teaspoonful of Sugar or Honey would help to soothe the irritated nerves and thereby calm down the diaphragm.   - Increasing the levels of Carbon dioxide might also solve the problem. This can be done either by holding your breathe for a while or inhaling into a paper bag.   - Let someone surprise or frighten you. We may have seen this in many films and read it in numerous jokes, but trust our elders... it works!   - There is another method called `Vagus nerve stimulation` which is done by swallowing huge chunk of dry bread, provoking a sneeze, dragging the tongue out etc.   When to panic:   Hiccups may not last for more than few hours. But if they last for more than 48 hours, then it might be a situation that should better be sorted out by a doctor. Because! Persistent hiccups might be a symptom of some serious problem in our nervous system. They might even be a hint for malfunctioning of our kidneys. Even if they are not hinting anything dangerous, persistent hiccups might result in fatigue and restlessness.   - Nirjara.

read more
ఇల్లు మారితే పిల్లలు పాడైపోతారా!

  ఉద్యోగ రీత్యా కొంతమంది నిరంతరం బదిలీలు అవుతూ ఉంటారు. తమతో పాటుగా తమ కుటుంబాన్ని కూడా వెంట తీసుకువెళ్తూ ఉంటారు. దీనికి మనం ఏమీ చేయలేం! పైగా సైన్యంలో పనిచేసే అధికారులు ఇలా బదిలీ అయినప్పుడు వారి జీవనశైలిలో పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. వారి పిల్లల చుట్టూ అదే రకమైన చదువు, అదే రకమైన సైనికుల కుటుంబాలూ తారసపడుతూ ఉంటాయి. కానీ ఎలాంటి స్థిరమైన కారణం లేకుండానే కొందరు ఇళ్లను మార్చేస్తూ ఉంటారు. ఒక వాతావరణానికి అలవాటు పడుతున్న పిల్లలను అకస్మాత్తుగా మరో వాతావరణంలోకి నెట్టివేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇంగ్లండులోని మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘డాక్టర్‌ రోజర్‌ వెబ్’ ఈ విషయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక భారీ పరిశోధనని చేపట్టారు.   తన పరిశోధన కోసం రోజర్‌ డెన్మార్క్‌ దేశంలోని గణాంకాల మీద ఆధారపడ్డారు. ఎందుకంటే ఆ దేశంలో పౌరుల కదలికలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది. ఆ గణాంకాల నుంచి రోజర్ 1971-1997 సంవత్సరాల మధ్య పుట్టిన దాదాపు 14 లక్షల మంది వివరాలను సేకరించారు. ఈ 14 లక్షల మందిలో తమకు 15 ఏళ్ల వయసు వచ్చే లోపల ఎవరు ఎన్నిసార్లు ఇల్లు మారారో లెక్కపెట్టారు. అలా తరచూ ఇల్లు మారడానికీ, తరువాత కాలంలో వారి మానసిక సమస్యలు ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం (correlation) ఉందేమో పరిశీలించారు.   రోజర్‌ పరిశోధన ఆశ్చర్యకరమైన ఫలితాలను వెలువరించింది. 15లోపు మరీ ముఖ్యంగా 12-14 ఏళ్లలోపు వయసువారు తరచూ ఇల్లు మారి ఉంటే కనుక తరువాత కాలంలో వారిలో ఆత్మహత్య యత్నాలు, హింసాత్మక ధోరణులు, మాదకద్రవ్యాలకు అలవాటుపడటం, మానసిక కుంగుబాటు... తదితర ప్రవర్తన కనిపించిందట. బాల్యంలో ఎంత ఎక్కువగా ఇళ్లు మారితే, అంత ఎక్కువగా ఇలాంటి సమస్యలు కనిపించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఫలితాలలో పేద పిల్లలు, గొప్పింటి బిడ్డలు అన్న తారతమ్యం కనిపించకపోవడం.   రోజర్‌ పరిశోధనని బట్టి నివాస స్థలాన్ని మార్చేయడం అన్నది ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది. ఆ మార్పు పిల్లల్లో, ముఖ్యంగా టీనేజిలో ఉన్న పిల్లల జీవితాలలో బహుశా పెను ప్రభావం చూపించవచ్చు. పెద్దవారిదేముంది? ఆఫీసుల్లోనో, ఇంటి పనుల్లోనో కాలం గడిపేస్తారు! కానీ సమాజంతో అనుబంధాన్నీ, తమదైన దృక్పధాన్నీ అలవర్చుకునే సమయంలో పిల్లల జీవితంలో ఇలాంటి మార్పు వారిలో అభద్రతా భావాన్ని కలిగించవచ్చు, చెడుసావాసాలకీ దారితీయవచ్చు. ప్రతి చిన్న మార్పూ పెను ప్రభావాన్ని చూపే కీలక వయసులో ఇల్లు మారడం అన్నది కూడా ముఖ్యమైన విషయమే అంటున్నారు రోజర్‌. అందుకనే కొత్తగా నివాసాన్ని మార్చుకున్న పిల్లలను కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.

read more
రంజాన్‌ మాసంలో ఖర్జూరాలు ఎందుకు!

  రంజాన్‌ మాసం రాగానే అందరికీ ఖర్జూరాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే ముస్లిం సోదరులంతా రంజాన్‌ రోజున ఉపవాసాన్ని ఉండి, సాయంత్రం పూట ఆ ఉపవాసాన్ని ఒక ఖర్జూరాన్ని తీసుకోవడంతో ముగిస్తారు. సాక్షాత్తూ మహమ్మద్‌ ప్రవక్తే ఇలాంటి ఆచారాన్ని పాటించేవారని చెబుతారు. ఇస్లాం రూపుదిద్దుకున్న ఎడారి నేలల మీద ఖర్జూర పుష్కలంగా పండే పండు కావచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే, రంజాన్‌ ఉపవాసపు ముగింపుగా ఖర్జూరన్నే ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే కనిపిస్తాయి.   - పగలంతా ఉపవాసం ఉన్నవారిలో చక్కెర నిల్వలు పడిపోతాయి. నీరసం, నిస్సత్తువా ఆవహిస్తాయి. ఇలాంటివారికి తిరిగిన శక్తిని అందించే ఔషధంగా ఖర్జూర పనిచేస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరలో 50 గ్రాములకి పైగా చక్కెర ఉంటుంది. ఇందులో మనిషికి తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ కూడా అధికంగానే ఉంటుంది.   -రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఖర్జూరలో కావల్సినన్ని పోషకాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఇందులో 6 రకాల విటమిన్లూ, 15 రకాల ఖనిజాలూ ఉన్నాయి. కాబట్టి రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటేనే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉపవాసంతో శరీరానికి దూరమైన పోషకాలను అందించే బాధ్యత ఖర్జూర తీసుకుంటుందన్నమాట.   - రోజంతా ఉపవాసం ఉన్నాక ఒక్కసారిగా భారీ ఆహారాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కానీ ఖర్జూరం అలా కాదు. ఇందులో ఉండే చక్కెర, పీచు పదార్థాల వల్ల చాలా తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తుంది.   - రోజూ ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకునేలా మన శరీరం సిద్ధపడిపోయి ఉంటుంది. మనం అలవాటు చేసిన పనిని శరీరం యథాతథంగా నిర్వర్తిస్తుంది. ఆకలి వేయడం, ఆహారం జీర్ణం కావడం, జీర్ణం అయిన ఆహారం విసర్జన కావడం... ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేలా శరీరం చూసుకుంటుంది. ఏదో ఒక రోజు ఉపవాసం అంటే ఫర్వాలేదు కానీ, రోజుల తరబడి ఉపవాసం అంటే శరీర ధర్మం తారుమారైపోతుంది. దీన్ని చక్కబెట్టే బాధ్యతను ఖర్జూర తీసుకుంటుంది. చక్కెర, రుచి ఉన్న ఖర్జూరను నోట్లో ఉంచుకోగానే జీర్ణరసాలు ఊరి రాత్రిపూట ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధపడిపోతాయి. ఖర్జురలో ఉండే పీచుపదార్థం తరచూ ఉపవాసాలు చేయడం వల్ల వచ్చే మలబద్ధకాన్ని అరికడుతుంది.   - రోజంతా నిరాహారంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా విపరీతంగా ఆహారం తీసేసుకోవాలన్న తపన కలుగుతుంది. దీని వల్ల ఉపవాస ఫలితం ఉండకపోగా, వ్యతిరేక పరిణామాలకు కూడా దారితీయవచ్చు. ముందుగా ఒకటి రెండు ఖర్జూరాలను తీసుకుంటే కడుపు కాస్త నిండిన భావన కలుగుతుంది. ఆహారం పట్ల తపన తగ్గుతుంది. పైగా ఉపవాస వేళలు ముగిసిన వెంటనే ఆహారాన్ని తీసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆహారం తీసుకునే అవకాశం వచ్చేలోగా ఖర్జూరాలతో ఆకలిని తీర్చుకోవచ్చు. - నిర్జర.

read more
దగ్గు మీద దాడి చేయండి!

  ఎండలు తగ్గుముఖం పట్టాయి. కాస్త వర్షాలు, వాటితో పాటుగా చలిగాలులు మొదలయ్యేసరికి దగ్గు విడవకుండా పలకరిస్తుంది. ఓ నాలుగు దగ్గులు దగ్గగానే ఇక దగ్గర్లో ఉన్న ఏదో ఒక మందుల షాపు దగ్గరకి వెళ్లి సిరప్పో, మందుబిళ్లలో తెచ్చుకోవడానికి సిద్ధపడిపోతాం. వీటి వల్ల మగత, నీరసంలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం లేకపోలేదు. కృత్రిమమైన మందుల వల్ల తాత్కాలిక లాభాలు, దీర్ఘకాలిక నష్టాలు సహజమే కదా! అందుకని ముందుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి చూస్తే పోయేదేముంది. ఏళ్లకేళ్లుగా మన పెద్దలు చెబుతున్న, ఆచరిస్తున్న ఈ చిట్కాలు మరోసారి...     తేనె:  పొడి దగ్గుకైనా, కఫంతో కూడిన దగ్గుకైనా తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే కాఫ్‌ సిరప్‌లతో సమానంతా తేనె పనిచేస్తుందని వాదించే నిపుణులూ లేకపోలేదు. నోటి నుంచి గొంతుదాకా తేనె ఒక సన్నటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి దగ్గుని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకని తేనెని నేరుగా కానీ, గోరువెచ్చటి పాలు లేక నీటితో కానీ తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.     అల్లం:  పొడి దగ్గుతో బాధపడేటప్పుడు అల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ముక్క అల్లాన్ని అలాగ్గా నమిలేసినా కొంత ప్రభావం ఉంటుంది. లేదా నీటిలో ఓ నాలుగు ముక్కల అల్లాన్ని వేసి ఆ నీరు సగానికి మరిగేదాకా ఉంచి, ఆ కషాయాన్ని పుచ్చుకున్నా ఉపశమనం ఉంటుంది. అల్లం ఘాటుకి గొంతులో స్రావాల ఉత్పత్తి ఎక్కువవుతుందనీ, తద్వారా తగినంత తేమ చేరి దగ్గు తగ్గుతుందని అంటున్నారు.     పసుపు: దగ్గుకి పసుపుని వాడటం అనాదిగా వస్తున్నదే! రాత్రిపూట గోరువెచ్చటి పాలలో చిటికెడంత పసుపు వేసుకుని తాగితే దగ్గు చిటికెలో మాయమైపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పసుపు వల్ల దగ్గు తగ్గడమూ, పాలతో సుఖంగా నిద్ర పట్టడమూ రెండూ సాధ్యమవుతాయి. ఇక ఊపిరితిత్తులలో కఫం పేరుకున్నప్పుడు వేడి వేడి నీటిలో పసుపుని వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా కఫం పల్చబడిపోతుంది.     మిరియాలు: కఫంతో కూడిన దగ్గుకి మిరియాలను మించిన చిట్కా లేదంటోంది సంప్రదాయ ప్రపంచం. ఇంగ్లండు నుంచి చైనా వరకు సనాతన వైద్యంలో దగ్గుని నివారించేందుకు నల్ల మిరియాలను వాడుతూనే వస్తున్నారు. ఇందుకోసం నీటిలో కానీ, పాలల్లో కానీ పొడి చేసిన మిరియాల పొడిన కలుపుని తాగమని చెబుతుంటారు. అయితే మిరాయలు వేడిని కలిగిస్తాయి. పైగా గొంతులో కఫాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పొడిదగ్గు ఉన్నప్పుడే వీటిని వాడాలి.   ఇవేకాదు... తులసి ఆకులు నమలడం, నిమ్మరసాన్ని తీసుకోవడం, బాదం పప్పులు తినడం, పుదీనా టీ తాగడం... ఇలాంటి చిట్కాలెన్నో ఇంగ్లీషు మందులకంటే అద్భుతంగా పనిచేస్తాయి.   - నిర్జర.

read more
గుండె కొట్టుకోవడంలో తేడా ఉండాల్సిందే!

  శ్వాస తీసుకునే విధానానికీ ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం మనకి తెలియనిది ఏమీ కాదు. కేవలం శ్వాస తీసుకునే పద్ధతిని నియంత్రించేందుకే భారతీయులు ప్రాణాయామాన్ని కనుగొన్నారన్న విషయం తెలిసిందే! ప్రాణాయామం ద్వారా శ్వాస మీద అదుపు సాధిస్తే కనుక ఊపిరితిత్తుల నుంచి గుండె వరకూ మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయనీ... తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనీ మన పెద్దల నమ్మకం. ఇదే విషయాన్ని మరోసారి మరో పరిశోధన రుజువు చేసింది.   మ్యూనిచ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జార్జ్‌ ష్మిట్‌ అనే పరిశోధకులు అందిస్తున్న ఈ నివేదిక గుండె కొట్టుకోవడానికీ, ఆయుష్షుకీ ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతోంది. తన పరిశోధన కోసం జార్జ్ 950 మంది గుండె పోటు వచ్చిన రోగులను ఎంచుకున్నారు. వీరందరి గుండె పనితీరునీ కూడా ఐదేళ్ల పాటు నిశితంగా గమనించారు. సాధారణంగా ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒకలా, శ్వాసను విడిచేటప్పుడు మరోలా అతని గుండె కొట్టుకుంటుంది. ఈ వ్యత్యాసాన్ని ‘Respiratory sinus arrhythmia’ అంటారు. తాము గమనించిన కొందరు రోగులలో ఈ వ్యత్యాసం పెద్దగా లేకపోవడాన్ని గమనించారు జార్జ్‌. అంటే సదరు రోగుల గుండె నిరంతరం ఒకే తీరున కొట్టుకుంటోందన్న మాట! చూడ్డానికి ఇది చాలా ఆరోగ్యకరమైన విషయంలా తోచవచ్చు. కానీ గుండె ఇలా ఒకే తీరున కొట్టుకునే రోగులు త్వరలోనే చనిపోవడాన్ని గమనించారు జార్జ్‌. అలా కాకుండా కొద్దిపాటి వ్యత్యాసంతో గుండె కొట్టుకునే రోగులు సుదీర్ఘకాలం జీవించినటట్లు తేలింది. ఇలా ఉఛ్వాస నిశ్వాసల మధ్య గుండె పనితీరులో కొద్దిపాటి మార్పు కనిపించడమే ఆరోగ్యకరమంటున్నారు జార్జ్‌. బహుశా గుండె విశ్రాంతి తీసుకోవడానికీ, తన పనితీరుని మెరుగుపరచుకోవడానికే ఇలాంటి వ్యత్యాసం ఉపయోగపడుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.   తను చేసిన పరిశోధన ఆధారంగా ఎవరైనా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునంటున్నారు జార్జ్‌. ముఖ్యంగా గుండె వ్యాధి ఉన్నవారు, తమ గుండె కొట్టుకునే విధానాన్ని అప్పుడప్పుడూ గమనించుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సాయంతో తమలోని ‘Respiratory sinus arrhythmia’ తగిన వ్యత్యాసంతో ఉందా లేదా బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. ఇందులో అకస్మాత్తుగా ఏదన్నా తేడా కనిపిస్తే నిపుణులను సంప్రదించమని హెచ్చరిస్తున్నారు.   -నిర్జర.

read more
Smoking kills others

Some people might enjoy smoking cigarettes and they may be ready to face the consequences. But what about the one’s around them? From Kids to pregnant women... people around the smokers are the ones who pay a heavy penalty for their addiction. Passive or Second hand smoking is as dangerous as the first hand smoking. Here is why!   Children: Children who are in constant company of smokers tend to acquire all sorts of respiratory diseases. Particularly if you are smoking before a baby less than two years... please do remember that you might alter his respiratory life forever. From Bronchitis to Asthma... children get prone to severe respiratory ailments. They get easily affected with cough, cold and phlegm.     Pregnant women: It’s not just the women who smoke during their pregnancy are responsible for complications in their delivery. Women who are in company of a constant smoker are also prone to too many hitches. They might pose the risk of miscarriage, still birth and premature birth. Even if the child is born... he might be of much lower weight. Even if he is of enough weight... he might be susceptible to unexpected death syndromes.   Passengers: As cars are enclosed, the chemicals from the cigar often hover inside it. According to an estimate, children in such cars are exposed to around three times higher than the normal pollution levels. This is the reason why many countries such as England have banned smoking in cars with children below 18 years of age.   Pets: People might complain at your smoking... but pets can’t. They would just die! Researchers have found that passive smoking is much dangerous to pets than to humans. Scientists at the University of Glasgow have found pets getting prone to weight gain, cell damage and cancer. Pets spend much of their time of carpets and sofa which retains the nicotine particles. Further cats and dogs clean their body by licking... which lets the harmful chemicals into their bodies.   People in the room: Smokers often leave most of the smoke into the room which alters its atmosphere. The particles from the poisonous chemicals hang in the air for longer times... which are of course inhaled by the rest. Such side stream smoke contains much higher levels of chemicals such as carbon monoxide and ammonia. Such chemicals are known to be a cause for ailments such as lung cancers. - Nirjara.    

read more
పచ్చగడ్డి మీద నడిస్తే... ఆరోగ్యం వస్తుందా!

మనిషి ఈ ప్రకృతిలో ఒక చిన్న భాగమే! కానీ ఈ ప్రకృతికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదన్నంతగా అతని జీవనశైలి మారిపోయింది. ఒక పక్క ప్రకృతిని తనకు అనుకూలంగా ఎడాపెడా వాడేసుకుంటూనే, నాలుగ్గోడల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఫలితం... కృత్రిమమైన జీవితంలాగానే, కృత్రిమమైన జబ్బులూ వచ్చేస్తున్నాయి.   మరే ఇతర జీవికీ లేనంతగా, మనిషి చిన్న వయసు నుంచే నానారకాల వ్యాధుల పాలిట పడుతున్నాడు. అందుకే ప్రకృతికి తిరిగి చేరువయ్యే మనిషికి ఆరోగ్యం కూడా దక్కుతుందంటూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ఒకటే పచ్చగడ్డి మీద నడక! రోజురోజుకీ ప్రచారంలోకి వస్తున్న ఈ విధానం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే...   - రిఫ్లెక్సాలజీ అనే శాస్త్రం ప్రకారం మన శరీరంలోని నాడులన్నీ కూడా పాదాల దగ్గరకి వచ్చి ఉంటాయి. కాబట్టి మన పాదంలోని ఒకొక్క భాగం మీద ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న నాడికి చెందిన అవయవం మీద అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. పచ్చగడ్డిలో నడిచేటప్పుడు మన పాదంలోని ప్రతి అణువు మీదా ఒత్తిడి కలిగి తీరుతుంది కాబట్టి... రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇది మన శరీరం మొత్తాన్నీ స్వస్థత పరుస్తుంది.   - పచ్చటి నేల మీద నడిచేటప్పుడు భూమితో ఒక అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నంత తృప్తిగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి వల్ల మనసు చాలా ప్రశాంతని పొందుతుందంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంతో ఏర్పడే ఒత్తిడి, భయాందోళనలన్నీ... ఇలా ప్రకృతిలో మమేకం అవ్వడం వల్ల దూరమవుతాయంటున్నారు.   - నిరంతరం పాదాలకు తోలుతోనో, ప్లాస్టిక్‌తోనో చేసిన చెప్పులను ధరించడం వల్ల... మన శరీరం మీద భూమిలోని అయస్కాంత క్షేత్రం చూపించే ప్రభావంలో అనుకూల/ ప్రతికూల మార్పులు రావచ్చు. రోజులో కాసేపన్నా ఇలా గడ్డి మీద నడవడం వల్ల మన శరీరం మీద ఈ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.   - పచ్చగడ్డి మీద నడవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని తేలింది. ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- రిఫ్లెక్సాలజీ ప్రకారం పచ్చగడ్డి మీద నడిచేటప్పుడు, మన పాదంలో... కంటినాడి మీద ప్రభావం చూపే స్థానాల మీద ఒత్తిడి కలుగుతుంది. రెండు- నిరంతరం కంప్యూటర్ ముందో, పుస్తకం ముందో, పేపరు పట్టుకునో కూర్చునే మనకి అప్పుడప్పుడూ కాస్త దూరంగా, పచ్చగా ఉండే వస్తువులు కనిపిస్తూ ఉండాలని వైద్య శాస్త్రం చెబుతోంది.   - నిరంతరం బూట్లు లేదా చెప్పులు ధరించి ఉండేవారికి... అరికాళ్లలో రక్తప్రసారం తగ్గిపోయి, పాదాలు మొద్దుబారిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజులో కాసేపన్నా పచ్చగడ్డి మీద నడిస్తే అప్పుడు తెలుస్తుంది... ఆ స్పర్శలో ఉన్న హాయి ఏమిటో. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డిలో నడక మన పాదాలకు మంచి మసాజ్‌లాంటిది.   - ఉదయాన్నే కాసేపు అలా పచ్చగడ్డి మీద నడిస్తే ఆ తాజా గాలి, పచ్చగడ్డి మీద నుంచి వచ్చే పసిరిక వాసనా, మెత్తటి గడ్డి అందించే స్పర్శా... ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని అందిస్తాయి. ఇక ఆ సమయంలో పై నుంచి వచ్చే సూర్యరశ్మి కూడా మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్‌ ‘డి’ను అందిస్తుంది. నేటి జీవనశైలితో వస్తున్న కీళ్ల వ్యాధి నుంచి డయాబెటిస్‌లకు ‘డి’ విటమిన్‌ లోపం కూడా ఓ కారణం అని ఇప్పటికే తేలింది. నిరంతరం నాలుగ్గోడల మధ్యే ఉంటున్న జనానికి సహజమైన ఈ విటమిన్‌ అందడం లేదని వెల్లడైంది. దీనికి ఉదయపు నడకే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతున్నారు.   చెప్పుకుంటూ పోతే... పచ్చగడ్డి మీద నడిస్తే వేస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఓ నాలుగడుగులు అలా వేసి చూడండి. ప్రత్యేకించి కాకపోయినా... ఎప్పుడన్నా పచ్చగడ్డి కనిపిస్తే దాని మీద పాదం మోపి చూడండి. మీరే ఒప్పుకుంటారు... ఆ స్పర్శలో ఏదో మాయ ఉందని! - నిర్జర.  

read more