'సాహో'కి ముందుంది ముసళ్ల పండుగ!
on Sep 5, 2019
గతమెంతో ఘనం, భవిష్యత్ అగమ్యగోచరం అన్నట్టుంది 'సాహో' టీమ్ పరిస్థితి. సినిమా విడుదలైన తొలి నాలుగైదు రోజులు వసూళ్లను ఘనంగా ప్రకటించారు. విమర్శకుల అభిప్రాయాలు, ప్రేక్షకుల స్పందనతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ గట్టిగా వచ్చాయి. నిర్మాతలు ప్రకటించిన లెక్కలతో విమర్శకులు ఇచ్చిన తీర్పులు తప్పేమో అనే చర్చ కొందరి మధ్య నడిచింది. వినాయక చవితి సెలవులు వెళ్లాక థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తీవ్రంగా తగ్గింది. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డున పడతారో లేదో అనే చర్చ మొదలైంది. మొత్తానికి సాహో ముందున్నది ముసళ్ల పండగే.
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, వీకెండ్ తర్వాత వినాయక చవితి సెలవులు రావడం వంటివి 'సాహో'కి కలిసొచ్చాయి. దీనికి తోడు విడుదల ముందు ప్రభాస్ ఊరూరు తిరిగి ప్రచారం నిర్వహించడంతో 'సాహో'పై విపరీతమైన హైప్ నెలకొంది. అందుకు తగ్గట్టు అడ్వాన్సు బుక్కింగులు బాగా జరిగాయి. దాంతో సినిమాకు మిక్స్డ్, నెగిటివ్ టాక్ వచ్చినా తొలి నాలుగైదు రోజుల వసూళ్లపై ఏమంత ప్రభావం పడలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల వసూళ్లు కలుపుకుంటే 350 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, బుధవారం వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. సినిమా టాక్ ఇప్పుడు వసూళ్లపై ఎఫెక్ట్ చూపిస్తోంది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
నిర్మాతలు చెప్పినట్టు సినిమాకు 350 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే... 350 కోట్లు వచ్చేశాయి. పైగా, శాటిలైట్ & డిజిటల్ రైట్స్ రూపంలో మరికొంత ఆదాయం వస్తుంది. సినిమాతో నష్టాలు ఎందుకు వస్తాయని అభిమానులు వాదించవచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే... నిర్మాతలు గ్రాస్ కలెక్షన్లు ప్రకటించారు. 350 కోట్ల రూపాయల్లో థియేటర్ ఖర్చులు వగైరా వగైరా తీసేస్తే 170 కోట్లకు అటు ఇటుగా షేర్ వస్తుంది. అంటే... డిస్ట్రిబ్యూటర్లు లేదా బయ్యర్ల చేతికి వచ్చేది. నైజాం, సీడెడ్, ఆంధ్రలో 'సాహో'ను నూట పాతిక కోట్లకు అమ్మారు. ఇప్పటివరకూ వచ్చిన సెర్ 70 కోట్లు మాత్రమే. ఇంకో 55 కోట్లు వస్తే గానీ సినిమాను కొన్నవాళ్లు గట్టున పడరు. ఈ టాక్ తో అంత మొత్తం రావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 'అజ్ఞాతవాసి' ప్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత కొంత మొత్తం తిరిగి ఇచ్చారు. సాహో నిర్మాతలు ఏం చేస్తారో?