జయహో గొర్రె!

న్యూయార్క్‌లో ఒక మటన్ షాపు ఓనర్ తన దగ్గరున్న గొర్రెని చంపి మాంసాన్ని రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కత్తి తీసుకుని ఆ గొర్రె దగ్గరకి వెళ్ళాడు. ప్రమాదాన్ని గ్రహించిన గొర్రె ఆ మటన్ షాపులో నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ మటన్ షాపు ఓనర్ తప్పించుకున్న గొర్రె కోసం వెతికీ వెతికీ ఊరుకున్నాడు. కానీ, గొర్రె తప్పించుకున్న విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియా ప్రపంచం కదా.. వెంటనే ఒక షీప్ వాచ్ ట్వంటీఫోర్ అనే ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేశారు.. తప్పించుకున్న గొర్రె ఎవరికైనా కనబడిందా అని అందులో ఎంక్వయిరీ ప్రారంభించారు. అయితే, అయితే తప్పించుకున్న ఆ గొర్రె అలా అలా ట్రావెల్ చేస్తూ వాషింగటన్‌విల్లే అనే ఊరికి చేరుకుంది. ఇది న్యూయార్క్.లో తప్పించుకున్న గొర్రె అని ఆ ఊరి వాళ్ళకి అర్థమైంది. ఆ ఊరివాళ్ళు ఆ గొర్రెని పట్టుకున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ గొర్రెని ఇక మటన్ కోసం చంపకూడదని డిసైడ్ చేశారు. ఫేస్‌బుక్ గ్రూప్ కూడా దీనికి మద్దతు తెలిపింది. దాంతో వన్యప్రాణుల ఆలనాపాలనా చూసే జూకి తరలించారు. మొత్తానికి గొర్రె సాహసం చేసింది.. బతికిపోయింది.
Publish Date: Jul 6, 2024 1:39PM

జగనన్న అగ్గిపెట్టెలపై విచారణ!

పులివెందులలో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళని నిర్మించడానికి ఉద్దేశించిన జగనన్న మెగా లేఔట్‌లో అక్రమాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ లేఔట్ పేరుతో 8,400 ఇళ్లను మంజూరు చేసి, వాటిని అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేశారన్న విమర్శలు వున్నాయి. ఈ లేఔట్ మీద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సీఎం విచారణకు ఆదేశించారు. మూడేళ్ళ క్రితం ఇక్కడ స్థలాలు మంజూరయ్యాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ద్వారా కాంట్రాక్టర్‌కి 60 కోట్ల బిల్లులు వెళ్ళాయిగానీ, పనులు జరగలేదు. ఆ తర్వాత మరో ఏడు సంస్థలను ఎంపిక చేసి దాదాపు 85 కోట్ల బిల్లులు చెల్లించారు. 6,990 ఇళ్ళ నిర్మాణం జరగాల్సి వుండగా, కేవలం 99 ఇళ్ళను మాత్రమే నిర్మించారు. 
Publish Date: Jul 6, 2024 1:03PM

లోటస్‌పాండ్‌కు జగన్ మకాం మార్పు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ను వీడి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికి మకాం మార్చనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచే కాదు పరిశీలకుల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణకు హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించిన నేపథ్యంలో జగన్ తాడేపల్లి నుంచి లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పదని అంటున్నారు. ఇంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటూ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ కు ఇకపై ఆ అవకాశం ఉండదు.   దీంతో ఆయన ఇకపై కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందే అవకాశాలు దాదాపు మృగ్యమే.  జగన్ రెడ్డి ఉన్మాదమే కావచ్చు. పిచ్చితనమే కావచ్చు కానీ ఆయన ఊరికో ప్యాలెస్ చొప్పున కట్టేసుకున్నారు.   నిధులు, నిబంధనలు అనే సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఆయన పాలనతో ఎంతగా వివాదాస్పదుడయ్యారో.. తన ప్యాలెస్ ల పిచ్చితో అంతగా పాపులర్ అయ్యారు. అవి  నిర్మించింది సొంత సొమ్ముతోనా? ప్రజాధనంతోనా అన్నది పక్కన పెట్టేస్తే ఆయన ఎక్కడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.    బెంగళూరు, తాడేపల్లి, విశాఖపట్నం.. పులివెందులలో కూడా ప్యాలెస్ పలాంటి భవనం ఉంది లెండి.  అయితే జగన్ రెడ్డి గద్దెదిగిన తరువాత ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, పులివెందుల వాసంలో కానీ, ఆఖరికి రాష్ట్రం దాటిపోయి తన బెంగళూరు ప్యాలెస్ కు కూడా వెళ్ల లేని పరిస్థితి కొని తెచ్చుకున్నారు.   ఎన్నికలలో ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయకు అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన జగన్ అక్కడెక్కడా స్థిమితంగా ఉండలేకపోయారు. మళ్లీ తాడేపల్లికి తిరిగి వచ్చారు.  ఓటమి దిగులు నుంచి తేరుకున్నారా అనిపించేలా ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల తరువాత ఆయన బయటకు వచ్చారు. పాపం ముఖ్యమంత్రి హోదా లేదు కదా!  దాంతో పరదాలు కట్టించుకునే అవకాశం ఉండదని తెలిసి ఆయన నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లిని పరామర్శించడానికి హెలికాప్టర్ లో వచ్చారు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడి నవ్వులపాలయ్యారు. అది వేరే సంగతి. మళ్లీ ఆయన నివాసాల వద్దకు వస్తే.. ఇప్పుడాయన లోటస్ పాండ్ కు మకాం మార్చక తప్పని పరిస్థితి. కేసుల రోజువారీ విచారణే కాకుండా... గతంలోలా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి కూడా రావడం తథ్యం. ఈ పరిస్థితుల్లో ఆయన తాడేపల్లిలో స్థిమితంగా ఉండగలిగే అవకాశం లేదు. దీంతో ఆయన ఇప్పుడు ఏపీని వదిలేసి తెలంగాణకు బిచాణా ఎత్తేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూడా ఆయనకు మనస్థిమితం ఉండే అవకాశాలు లేవు.   
Publish Date: Jul 6, 2024 12:51PM

పిల్లలు కాదు.. పిశాచాలు!

విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో వుండే తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదువుతున్న మరో అమ్మాయిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో అబ్బాయిని వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పేరెంట్స్ మందలించారు. ఎందుకు మందలించారంటే ఈ ముగ్గురూ చదువుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు. దాంతో ముగ్గురికీ కోపం వచ్చింది. ముగ్గురూ ఒకచోట చేరారు. భారీ ప్లాన్ వేశారు. ఇంట్లోంచి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ముగ్గురూ వాళ్ళవాళ్ళ ఇళ్లలోంచి బంగారం, డబ్బు దొంగతనం చేసి తీసుకొచ్చారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడ ప్లాట్‌ఫామ్ మీద వున్న జన్మభూమి ఎక్స్.ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్‌కి చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద పోలీసులకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. వాళ్ళని ఆపి ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళు తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు. ఈలోపు తమ పిల్లలు కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ విజయవాడలో పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ ముగ్గురు పిల్లల్నీ.. కాదు.. కాదు... పిశాచాల్ని విజయవాడకి పంపించారు. సికింద్రాబాద్‌లో పోలీసుల కంటపడ్డారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఏమయ్యేదో!
Publish Date: Jul 6, 2024 12:03PM

హల్లో మిస్.. అది ఎర్రబస్సు కాదు.. ఎయిర్‌బస్!

మన ఇండియాలో ఎర్రబస్సు ఆపాలంటే ఏం చేస్తాం? ఆ బస్సుకి ఎదురుగా నిలబడి చెయ్యి ఊపుతాం.. అప్పుడు ఆ బస్సు ఆగుతుంది.. మనం బస్సు ఎక్కుతాం. అయితే, ఈమధ్య ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఒక లేడీ... మనం ఎర్రబస్సు విషయంలో ఏం చేస్తామో.. ఆమె ఎయిర్‌బస్సు విషయంలో అలా చేసింది. కదులుతున్న విమానం ముందుకు వెళ్ళి ఆపండి.. ఆపండి అన్నట్టుగా చేతులు ఊపింది. టేకాఫ్‌కి రెడీ అవుతున్న పైలెట్ విమానానికి ఎదురుగా వచ్చిన ఈ లేడీని చూసి బిత్తరపోయి ఫ్లైట్ ఆపేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి, ఆమెని అరెస్టు చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ లేడీ ఆ ఫ్లైట్లోనే ఎక్కాల్సి వుంది. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకి ఆలస్యంగా వచ్చింది. అప్పటికే విమానం డోర్లు క్లోజ్ చేశారు. టేకాఫ్ అవడానికి విమానం కదిలింది కూడా. తాను ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోతూ వుండేసరికి ఆ లేడీ కంగారుపడిపోయింది. లేడిలాగా రన్‌వే మీదకి దూసుకెళ్ళింది. ఎయిర్ పోర్టు స్టాఫ్ బిత్తరపోయి ఆపేలోపే ఆమె విమానం ముందుకు వచ్చేసి ‘స్టాప్.. స్టాప్..’ అని అరిచింది. పైలట్ అలెర్ట్ అయి విమానాన్ని ఆపేశాడుగానీ, లేకపోతే ఈ లేడీ పచ్చడైపోయేదే. 
Publish Date: Jul 6, 2024 11:32AM

అమరావతికి అడ్డంకుల్లేవ్.. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డులకు కేంద్రం ఓకే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా పరుగులు పెట్టనుంది. అమరావతి విషయంలో రాష్ట్ర వినతులన్నిటికీ కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా రాజధాని అమరావతికి మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది.  ఖర్చు ఎంతైనా  అమరావతి కోసం వ్యయం చేయడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విస్పష్ట హామీ ఇచ్చారు. హస్తిన పర్యటనలో భాగంగా గడ్కరీతో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.   ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను  కేంద్రమే చేపట్టేందుకు అంగీకారం తులిపింది. పెరిగిన ట్రాఫిక్‌, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్‌ నిర్మాణం చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్‌ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ రెడీ అయ్యింది. రూ.18 వేల కోట్లతో ఈ రోడ్డు  నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది. అయితే జగన్‌ వచ్చాక ఈ ప్రాజెక్టును మూలనపడేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఔటర్‌ మళ్లీ పట్టాలెక్కనుంది.  రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై  చంద్రబాబు గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు.  అమరావతి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్‌ చేపట్టాలన్న చంద్రబాబు వినతికి సానుకూలంగా స్పందించిన గడ్కరీ ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తామన్న విస్పష్ట హామీ ఇచ్చారు.    రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్‌ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకోవైపు జాతీయ, రాష్ట్ర రహ దారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మిద్దామని గడ్కరీ ప్రతిపాదించారు. రోడ్లపై ఐదేళ్లకోసారి నిర్వహణ పేరిట కోట్లు ఖర్చుపెట్టడం, వర్షాలకు అవి దెబ్బతినడం జరుగుతోందని, ఇకపై సిమెంట్‌ (సీసీ) రోడ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఆధునిక టెక్నాలజీతో రహదారుల నిర్మాణంపై టాటా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు తెలిపారు.   
Publish Date: Jul 6, 2024 11:07AM

బెయిలు కోసం సుప్రీంకు కవిత!

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిలు కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఢిల్లీ హైకోర్టు కవిత బెయిలు పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇలా ఉండగా మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితతో శుక్రవారం (జులై 5) తెలంగాణ మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్ రావు ములాఖత్ అయ్యారు.  అనంతరం ఢిల్లీలో వారు న్యాయనిపుణులలో సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయడంపై చర్చించారు. సుప్రీం కోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిలు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆమె బెయిలు పిటిషన్ దాఖలు అయ్యే వరకూ కేటీఆర్, హరీష్ రావులు హస్తినలోనే మకాం వేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 8న కవిత బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయిన కేటీఆర్, హరీష్ రావులు కవితకు ధైర్యం చెప్పారు. ఆమెక త్వరలోనే బెయిలు వస్తుందని భరోసా ఇచ్చారు.  మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  
Publish Date: Jul 6, 2024 10:50AM

బ్రిటన్ ఎన్నికలలో భారత సంతతి విజయకేతనం!

బ్రిటన్ సాధారణ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26 మంది భారత సంతతికి చెందిన వారు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన కన్జర్వేటివ్ పార్టీ నుంచి అరడజను మంది భరత సంతతికి చెందిన సభ్యులు ఎన్నికవ్వగా, విజయం సాధించిన లేబర్ పార్టీ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైన వారు ఏకంగా 19 మంది ఉన్నారు. ఇక లేబర్ డెమొక్రటిక్ పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికయ్యారు.  పార్టీల వారీగా ఎన్నికైన భారత సంతతికి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నుంచి బ్రిటన్ మాజీ ప్రధాని  రిషి సునక్, బ్రావెర్ మేన్, ప్రీతీ పటేల్. క్లారీ కౌంటినో, గగన్ మొహీంద్రా,  షివానీ రాజాలు హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఇక లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన భారత సంతతికి చెందిన  సీమా మల్హోత్రా, వలేరీ వాజ్, లిసా నాండీ, ప్రీత్ కౌర్, తన్మన్ జీత్ సింగ్ దేశి, నవెందు మిశ్రా, నాడియా విట్ హోం, జాస్ అథ్వాల్. బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ ప్రీత్ ఉప్పల్, వారిందర్ జుస్, గురీందర్ జోసాన్, కనిష్కనారాయణ్, సోనియాకుమార్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జి, కీర్తి కీర్తి ఎన్టవిజిల్, జీవన్ సంధీర్, సోజన్ జోసెఫ్ ఉన్నారు. అలాగే లేబర్ డెమొక్రాట్స్ నుంచి మునీరా విల్సన్ హౌస్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికయ్యారు. 
Publish Date: Jul 6, 2024 10:33AM

చంద్రబాబు-రేవంత్ భేటీ.. ప్రధానాంశాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం (06-07-24) నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో వున్న సంస్థల విభజన విషయంలో చర్చించే అవకాశం వుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల మీద చర్చ జరగనుంది. తనకు 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. కానీ,7 వేల కోట్లు తెలంగాణ చెల్లించాల్సి వుందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ చిక్కుముడిని విడిపించడానికి చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో ఏపీ భవన్‌కి సంబంధించిన విభజన వివాదాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిష్కరించారు. మైనింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన చిక్కుముడి కూడా ఈమధ్యే వీడిపోయింది.  తొమ్మిదో షెడ్యూల్లో వున్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబేడీ కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల  పంపిణీపై చర్చ జరిగే అవకాశం వుంది. పదో షెడ్యూల్లో వున్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ విషయంలో కూడా చర్చ జరగాల్సి వుంది. కీలకమైన ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులూ పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేసుకున్నారు.
Publish Date: Jul 5, 2024 10:03PM

చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్!

నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కి చేరుకున్ చంద్రబాబుకి తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎంగా మొదటిసారి నగరానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం దగ్గర నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబిలీహిల్స్.లోని చంద్రబాబు నివాసం వరకు చంద్రబాబు ర్యాలీ జరిగింది. వర్షంలోనూ ర్యాలీ కొనసాగింది.
Publish Date: Jul 5, 2024 8:57PM

ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవం!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు ఈ ఇద్దరి నుంచే నామినేషన్లు రావడంతో, ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు ఎమ్మెల్సీలుగా వున్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్య మీద అనర్హత వేటు పడింది. అలా ఖాళీ అయిన రెండు స్థానాలు ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా భర్తీ అయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో అభ్యర్థి పి.హరిప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయ కార్యదర్శి.
Publish Date: Jul 5, 2024 7:32PM

పట్టిసీమ పైప్ లైన్ లీక్

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు  సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే  పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక  కొద్ది రోజులు పట్టిసీమను  వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది.  ఈ ఏడాది నాగార్జున  ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు  తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా  రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో   పట్టిసీమ మోటార్లతో  నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం  మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ  పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్  ఘటనతో  20 అడుగులు ఎత్తులో  నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో   గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి.  గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు  విడుదల చేశారు.   పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.      పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.  అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.  
Publish Date: Jul 5, 2024 6:21PM