టీడీపీ కార్యకర్తల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చాను : నారా లోకేష్
Publish Date:Apr 29, 2026
Advertisement
నాయకులు, కార్యకర్తల త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నానని, చిన్న వయసులోనే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం విశ్వవిఖ్యాత నాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు. ఆ పార్టీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన చరిత్ర మనదేనని, దేశ రాజకీయాల్లో టీడీపీ ఒక ప్రభంజనమని పేర్కొన్నారు. నాపై బాధ్యత మరింత పెరిగింది… కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి 44 ఏళ్ల గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్టీలో నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ బాధ్యతతో పాటు మరింత కర్తవ్యబోధ పెరిగిందని, ఈ ప్రయాణంలో ఒక్కడినే కాదు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే విజయాలు సాధ్యమని స్పష్టం చేశారు. “లోకేష్ అన్నీ చేస్తాడనే భావన తప్పు… మనం అందరం కలిసి పని చేస్తేనే లక్ష్యాలు చేరుకోగలం” అని అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలే పార్టీ బలం “నాడు, నేడు, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడతా” అని పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కష్టకాలంలో కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులను, అక్రమ కేసులను ప్రస్తావిస్తూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు. ప్రాణాలకైనా లెక్కచేయకుండా పార్టీ కోసం నిలబడిన అనేక మంది కార్యకర్తలు తనకు స్ఫూర్తి అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలే మన బలం టీడీపీ 44 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ రూపొందించిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. సంక్షేమం – అభివృద్ధి రెండు చక్రాలు గడిచిన రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా నడిపిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు పెంపు, దివ్యాంగులకు సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు.రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని, గూగుల్, టీసీఎస్, రిలయన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం దీనికి నిదర్శనమని అన్నారు. విధ్వంసం కాదు… అభివృద్ధే మా లక్ష్యం విమర్శలకు సమాధానంగా మాట్లాడుతూ “మీ సినిమా విధ్వంసం అయితే… మా సినిమా అభివృద్ధి” అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల మధ్యే నాయకత్వం ప్రజలతో మమేకమై పనిచేస్తే పార్టీ గుర్తింపు వస్తుందని తెలిపారు. మై టీడీపీ యాప్ ద్వారా కార్యకర్తల పనితీరును గుర్తిస్తున్నామని, టెక్నాలజీతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గదుల్లో కూర్చొని రాజకీయాలు చేయకుండా ప్రజల మధ్య ఉండాలని సూచించారు. పార్టీలో ఐక్యత అవసరం పార్టీలో విభేదాలు సహజమని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మార్పు నిరంతర ప్రక్రియ అని, యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు. ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం గుజరాత్, ఒడిశా రాష్ట్రాల ఉదాహరణగా తీసుకుంటూ, ఒకే ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. విమర్శలకు గట్టి సమాధానం అవసరం ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ, క్రెడిట్ తీసుకునే రాజకీయాలపై మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. భవిష్యత్ నాయకత్వం నిర్మాణం టీడీపీ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడం పార్టీ లక్ష్యమని చెప్పారు. అహంకారం వల్లే గతంలో ఎదురైన పరిస్థితులను గుర్తు చేస్తూ, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను చివరిగా మాట్లాడుతూ, “మీ అందరి త్యాగాలు, కష్టాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. యువగళం పాదయాత్ర విజయానికి మీ సహకారం కారణం. నాపై నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తూ, కార్యకర్తల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగుజాతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/tdp-working-president-nara-lokesh-36-218587.html





