భారత రాజ్యాంగ పునాదులపై సరికొత్త చర్చ.. డిస్కవరీ అండ్ భారత్ గ్రంథం!
భారతదేశ సార్వభౌమత్వానికి, పరిపాలనా విధానానికి అత్యున్నత పీఠమైన భారత రాజ్యాంగంపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఒక సరికొత్త మేధోమథనం ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వెలువడిన డిస్కవరీ అండ్ భారత్.. క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎ హిందూ నేషన్ అనే పరిశోధనాత్మక గ్రంథం దేశ వ్యవస్థాపక పత్రం యొక్క మూలాలను సరికొత్త కోణంలో విశ్లేషించింది. జవహర్లాల్ నెహ్రూ రాసిన ప్రసిద్ధ రచన డిస్కవరీ ఆఫ్ ఇండియా కు భిన్నమైన ప్రతివాదంగా ఈ అధ్యయనం ముందుకు వచ్చింది. హిందూ సమాజం, భారత నాగరికత ప్రాథమిక తాత్విక పునాదులను విస్మరించి, వలసరాజ్యాల కాలం నాటి ఆలోచనలను, పాశ్చాత్య క్రైస్తవ రాజకీయ సిద్ధాంతాలను మన పాలనా చట్రంపై ఏ విధంగా రుద్దారో ఈ విశ్లేషణ బహిర్గతం చేస్తోంది. 1946, 1949 మధ్య కాలంలో రాజ్యాంగ సభ సాగించిన చర్చలు, తీర్మానాలు స్వదేశీ సంస్థాగత వనరుల నుండి ఉద్భవించలేదని, కేవలం విదేశీ నమూనాల అనుకరణగానే మిగిలిపోయాయని ఈ జాతీయవాద, నాగరికతా దృక్కోణం వాదిస్తోంది. రాజ్యాంగ రూపకల్పనలోని అతుకుల బొంత – వలసపాలన ముద్ర రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దేశ విభజన సంక్షోభం, మతపరమైన కల్లోలాలు, పౌర అశాంతి నెలకొన్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వీడి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆ హడావుడి వాతావరణంలో అప్పటి చట్టసభలలోని ఉన్నత వర్గాలు తక్షణమే అందుబాటులో ఉన్న ఒక ఆచరణాత్మక నమూనాను ఎంచుకోవడానికి మొగ్గు చూపాయి. దీని ఫలితంగానే.. బ్రిటిష్ పాలకులు వదిలివెళ్లిన అధికార యంత్రాంగాన్ని యథాతథంగా స్వీకరించడం జరిగింది. ఈ రాజ్యాంగ ప్రక్రియను విమర్శకులు ఒక రకమైన కట్-కాపీ-పేస్ట్ చర్యగా అభివర్ణిస్తున్నారు. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నుండి సుమారు 80 శాతం నిబంధనలను స్వల్ప మార్పులతో ప్రస్తుత రాజ్యాంగంలోకి దిగుమతి చేసుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఐర్లాండ్ వంటి వివిధ పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుండి అనేక అంశాలను అరువు తెచ్చుకుని, ఒక సమగ్రమైన సేంద్రీయ రూపకల్పన లేకుండా ఒక అతుకుల బొంతలా దీనిని తయారు చేశారనే విమర్శలు ఉన్నాయి. అడ్వకేట్ జనరల్ స్థానంలో అటార్నీ-జనరల్ వంటి పదజాల మార్పులు మినహా.. అంతర్లీనంగా ఉన్న అధికార నిర్మాణంలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు రాలేదని ఈ డిస్కవరి అండ్ భారత్ స్పష్టం చేస్తోంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ కారణంగానే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత భారీ గ్రంథంగా, సుమారు లక్షా 50 వేల పదాల నిడివితో రూపుదిద్దుకుంది. కేవలం 8ంూల పదాలతో అత్యంత సంక్షిప్తంగా ఉండే అమెరికా రాజ్యాంగంతో పోల్చితే.. ఈ గ్రంథ నిడివి కేవలం తాత్విక లోతు లేకపోవడాన్ని, వలసవాద పరిపాలనా పద్ధతులను పరిరక్షించాలనే తాపత్రయాన్ని మాత్రమే సూచిస్తోంది. దీనివల్ల కేవలం తెల్ల దొరల నుండి గోధుమ రంగు దొరలకు అధికారం బదిలీ అయిందే తప్ప.. రాజ్యం యొక్క ఆలోచనా విధానంలో ఎటువంటి వలస విముక్తి జరగలేదు. చట్టపరమైన కోణంలో చూస్తే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 395 ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని, 1947 భారత స్వాతంత్ర్య చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ, బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలను రద్దు చేసే సార్వభౌమ అధికారం భారత రాజ్యాంగ సభకు ఏ విధంగా సంక్రమిస్తుందనే చట్టపరమైన వైరుధ్యం ఇప్పటికీ మిగిలే ఉంది. ఈ సాంకేతిక లోపాలు 1970ల వరకు బ్రిటన్లో జరిగిన కొన్ని శాసన సవరణల ద్వారానే చట్టబద్ధంగా సర్దుబాటు చేయబడ్డాయి. సిద్ధాంతాల మూలాలు: క్రైస్తవ త్రిత్వం, లౌకకవాదం ఆధునిక ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన సిద్ధాంతానికి కేవలం హేతుబద్ధమైన పునాది మాత్రమే కాకుండా, క్రైస్తవ దైవశాస్త్ర మూలాలు ఉన్నాయనే వాదన ఈ గ్రంథం ద్వారా వెలుగులోకి వచ్చింది. మాంటెస్క్యూ ప్రతిపాదించిన ఈ విభజన క్రైస్తవ మతంలోని పవిత్ర తండ్రి, పవిత్ర కుమారుడు, పవిత్రాత్మ అనే త్రిత్వ (Trinity) భావన నుండి లౌకీకీకరించబడిన రూపమేనని రాజ్యాంగ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇండియాలో దీనిని ఒక సార్వత్రిక లౌకిక సూత్రంగా బోధిస్తున్నప్పటికీ.. ఇదే తరహా త్రివిధ నమూనాను బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి హిందూ తత్వాలతో ముడిపెట్టి ఉంటే మతపాలన అనే ఆరోపణలు వచ్చేవి. ప్రస్తుత లౌకికవాద చర్చలలో చాలా భాగం పాశ్చాత్య క్రైస్తవ నాగరికతా విలువల ప్రపంచీకరణేననడంలో ఎలాంటి సందేహం లేదు. ధర్మం వర్సెస్ హక్కులు.. గాంధీజీ విస్మరించబడిన సంప్రదాయం భారతీయ తాత్విక ఐక్యత అంతటా ద్వైత, అద్వైత వంటి భిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే పరమ సత్యాన్ని వివిధ రూపాల్లో అంగీకరిస్తాయి. భారత మూలాల ధార్మిక సంప్రదాయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు సూత్రాలు. - ధర్మం: సమాజం పట్ల వ్యక్తి నిర్వహించాల్సిన కర్తవ్యం లేదా నియమావళి. - కర్మ: మానవుడు చేసే ప్రతి చర్య మరియు దాని ఫలితం. - సంసారం: జనన మరణాల అస్తిత్వ చక్రం. - మోక్షం: భౌతిక బంధాల నుండి లభించే అంతిమ విముక్తి. ఈ నాలుగు స్తంభాలలో ధర్మం అనేది విధి ఆధారిత ప్రవర్తనను నిర్దేశిస్తుంది. కానీ రాజ్యాంగం ఈ విధి కేంద్రీకృత సంస్కృతిని పక్కన పెట్టి.. పూర్తిగా పాశ్చాత్య హక్కుల-కేంద్రీకృత' చట్టపరమైన పత్రం చుట్టూ తిరగడం ఒక పెద్ద నాగరికతా వైరుధ్యం. 1940లలో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనపై చర్చలు జరుగుతున్నప్పుడు.. మహాత్మా గాంధీజీ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. సమాజంలో హక్కుల కంటే విధులే ప్రాధాన్యమైనవని, ఒక వ్యక్తి తన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఇతరుల హక్కులు వాటంతట అవే రక్షించబడతాయని గాంధీజీ స్పష్టం చేశారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల సాంప్రదాయాలతో ఏకీభవించిన ఈ గాంధీ దృక్పథాన్ని పక్కన పెట్టి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు ప్రమోట్ చేసిన ప్రొటెస్టంట్ హక్కుల నమూనాకే భారతదేశం లొంగిపోయింది. ఉన్నత వర్గాల మేధోపరమైన దాస్యం.. జాతీయ చిహ్నాల మార్పు 1947, 48 కాలంలో అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధులు ప్రదర్శించిన ఆత్మన్యూనతా భావం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. పారిస్లో విజయలక్ష్మి పండిట్ ప్రసంగిస్తూ.. భారతదేశం ఫ్రాన్స్, అమెరికా, ఐర్లాండ్ వంటి దేశాల నుండి రాజ్యాంగ ఆలోచనలను అరువు తెచ్చుకుంటోందని గర్వంగా ప్రకటించడం.. ఐదు వేల సంవత్సరాల పురాతన నాగరికతకు ప్రపంచానికి ఇవ్వడానికి ఏమీ లేదనే సంకుచిత భావనను ప్రతిబింబించింది. లోకమాన్య తిలక్ జీవిత చరిత్రకారుడు థియొడోర్ షాయర్ అన్నట్లు, ఈ రాజ్యాంగం భారతదేశం చేయగలిగిన అత్యంత భారతీయేతర రాజ్యాంగం. స్వాతంత్ర్య సమరంలో సర్వస్వం త్యాగం చేసిన తిలక్, అరబిందో, గాంధీజీ వంటి అగ్రనాయకులు ఎవరూ ఈ ముసాయిదా రచనలో భాగస్వాములు కాలేదు. స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనని ఉన్నత ఎలైట్ వర్గాల చేతుల్లో ఈ పత్రం రూపుదిద్దుకుంది. స్వయంగా బి.ఆర్. అంబేద్కర్ ఈ రాజ్యాంగంలోని అరువు తెచ్చుకున్న స్వభావాన్ని అంగీకరించారు. గణతంత్ర దేశం ఎంచుకున్న ప్రతీకలలో కూడా ఈ నాగరికతా సంకోచం స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతాన్ని 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వేడుకల్లో కేవలం మొదటి చరణానికే పరిమితం చేసి, సీనియర్ నాయకులు లేని ఖాళీ సభలో పాడించడం దీనికి ఒక ఉదాహరణ. అలాగే.. జాతీయ పతాకం విషయంలో మొదట ప్రతిపాదించిన చరఖాతో కూడిన కాషాయ జెండాను పక్కన పెట్టి, అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎంపిక చేశారు. మొదట రంగులను మతపరమైన వర్గాలకు (హిందూ, ముస్లిం, క్రైస్తవ) ప్రతీకలుగా గాంధీజీ భావించినప్పటికీ, తరువాతి కాలంలో పాఠ్యపుస్తకాల ద్వారా వాటికి త్యాగం, శాంతి, శ్రేయస్సు అనే లౌకిక అర్థాలను పునర్నిర్మించారు. గాంధీజీ ముద్రను చెరిపివేయడానికే చరఖా స్థానంలో అశోకచక్రాన్ని తెచ్చారనే విమర్శ ఉంది. లౌకికవాదం, సామాజిక విధానాల పరంగా చూస్తే, భారతదేశంలో ఇది ఒక విపరీతమైన ద్వంద్వ విధానాన్ని సంతరించుకుంది. మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రక్షణలు, రాయితీలను కల్పించడానికి ఇది ఒక సాధనంగా మారింది. మెజారిటీ హిందూ నాగరికత యొక్క ఆకాంక్షలను, గుర్తింపును నైతికంగా అణచివేయడానికి దీనిని ఉపయోగించారు. ఆర్టికల్ 25 కింద మత ప్రచార హక్కును ప్రత్యేకంగా చేర్చడం మిషనరీ కార్యకలాపాలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికేననే వాదన ఉంది. ఆర్థిక విధానాలలో కూడా ప్రొటెస్టంట్ వ్యక్తివాదాన్ని, ఫ్రెంచ్ సామ్యవాద సామూహికవాదాన్ని అస్థిరంగా కలపడం వల్ల 1990 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఏ ఆర్థిక విధానాన్ని రాజ్యాంగంలో శాశ్వతం చేయవద్దని అంబేద్కర్ హెచ్చరించినప్పటికీ, 1976 నాటి 42వ సవరణ ద్వారా ప్రవేశికలో బలవంతంగా సోషలిస్ట్ పదాన్ని చేర్చారు. నూతన ఆపరేటింగ్ సిస్టమ్ – భవిష్యత్ కాలపరిమితి భారతదేశాన్ని 1947లో ఒక ఫార్మాట్ చేయని హార్డ్ డిస్క్ లాగా భావించి, దాని సుదీర్ఘ చక్రీయ కాల చక్రాన్ని విస్మరించి,.. పాశ్చాత్య రేఖీయ కాలక్రమాన్ని స్వీకరించడం ద్వారా మనల్ని గతం నుండి వేరు చేశారు. తమిళనాడులోని వెయ్యి సంవత్సరాల నాటి ఉత్తరమేరూర్ శాసనాలు ప్రతిపాదించిన అత్యంత అధునాతన గ్రామ స్వయంపాలన, ఎన్నికల నియమావళి వంటి దేశీయ ప్రజాస్వామ్య నమూనాలను రాజ్యాంగ సభ పూర్తిగా విస్మరించింది. కేంబ్రిడ్జ్ ఎండ్యూరెన్స్ ప్రాజెక్ట్ పరిశోధనల ప్రకారం.. సాధారణంగా ఏ రాజ్యాంగమైనా గరిష్టంగా 19 సంవత్సరాలు మాత్రమే సమర్థవంతంగా మనుగడ సాగించగలదు. చనిపోయిన వారు బ్రతుకున్న వారిని పాలించకూడదు అనే జాన్ ఆడమ్స్ సూచన ప్రకారం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాలను పునఃసృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడు దశాబ్దాలు దాటిన ప్రస్తుత భారత రాజ్యాంగం తన కాలపరిమితిని మించిపోయిందని నాగరికతా పండితులు అభిప్రాయపడుతున్నారు. నూతన నాగరికతా రాజ్యాంగం దిశగా ప్రతిపాదనలు ఆధునిక ఆకాంక్షలతో దూసుకుపోతున్న నూతన భారతదేశం ఫెరారీ ఇంజిన్ ను, వలసరాజ్యాల కాలం నాటి పాత అంబాసిడర్ కారు చట్రంలో ఇరికించడానికి ప్రయత్నించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ నేపథ్యంలో, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేధావులు కొన్ని కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు: సంక్షిప్తత.. విస్తృతమైన చట్టాల సంకలనంగా కాకుండా, కేవలం 8,000 నుండి 10,000 పదాల పరిమితితో ముఖ్యమైన సూత్రాలపైనే దృష్టి పెట్టేలా రాజ్యాంగాన్ని సవరించాలి. నిజమైన వికేంద్రీకరణ.. పంచాయతీ రాజ్, స్థానిక సంస్థలను పరిపాలనలో మూడవ శ్రేణిగా అధికారికంగా గుర్తిస్తూ, రాష్ట్రం నుండి గ్రామ స్థాయికి స్పష్టమైన అధికారాల బదిలీ జరగాలి. ధర్మ ఆధారిత విధులు.. కేవలం హక్కులకే ప్రాధాన్యత ఇవ్వకుండా.. భారత సంస్కృతికి మూలమైన ధర్మం, విధులను రాజ్యాంగ కేంద్రంలోకి తీసుకురావాలి. న్యాయవ్యవస్థ పునర్వ్యవస్థీకరణ.. వలసకాలం నాటి నిరుపయోగమైన చట్టాలను రద్దు చేస్తూ, మరింత జవాబుదారీతనం, పారదర్శకత కలిగిన న్యాయ, పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించాలి. ప్రాంతీయ బాధ్యతలు.. భారతదేశపు విస్తృత నాగరికత పరిధిని విస్తరిస్తూ పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులకు రాజ్యసభలో స్థానాలు కల్పించే సృజనాత్మక వ్యూహాలను అన్వేషించాలి. సమకాలీన భారతదేశపు ఎదుగుతున్న ఆకాంక్షలను, నిజమైన స్వదేశీ మరియు భవిష్యత్-ఆధారిత రాజ్యాంగ వ్యవస్థతో సమన్వయం చేసినప్పుడే వికసిత భారత్ కల సాకారమవుతుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
Publish Date: Jun 30, 2026 3:16PM