Top Stories

political-news-img

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు, ఐఏఎస్ ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.

Publish Date: Jun 30, 2026 3:45PM

political-news-img

లోకం చూడకముందే బిడ్డ మృతి... దుఃఖంలో గోల్ చేసిన స్టార్ ప్లేయర్!

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఆటగాళ్ల జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కల. కోట్ల మంది అభిమానుల మధ్య, మైదానంలో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కానీ కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే వ్యక్తిగత విషాదాలు ఆట కంటే జీవితమే పెద్దదని నిరూపిస్తాయి. నెదర్లాండ్స్ జట్టు స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు కోడి గ్యాక్‌పో జీవితంలో సరిగ్గా అలాంటి ఘటనే ఎదురైంది. తన పుట్టబోయే బిడ్డ మరణించిన కొద్ది రోజులకే మైదానంలోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల లివర్‌పూల్ స్టార్, మొరాకోతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఒక అద్భుతమైన భావోద్వేగ గోల్ సాధించాడు. గతేడాది స్వీడన్‌పై 2 గోల్స్ చేసి జట్టును గెలిపించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌కు సరిగ్గా 72 గంటల ముందు అతని జీవితంలో ఒక తీరని శోకం ముంచుకొచ్చింది. కోడి గ్యాక్‌పో మరియు అతని భాగస్వామి నోవా వాన్ డెర్ బిజ్ తమ రెండవ కుమారుడి రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా గర్భధారణ సమయంలోనే ఆ చిన్నారి మరణించాడు. ఈ విషాద వార్తను నోవా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ గుండెలు పగిలిపోయాయని, తమ చిన్నారి ఎలిజా రాఫెల్ గ్యాక్‌పో ఎప్పటికీ తమ గుండెల్లోనే ఉంటాడని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ కఠిన సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని గ్యాక్‌పో కూడా కోరాడు. నెదర్లాండ్స్ కోచ్ రొనాల్డ్ కోమన్ మాట్లాడుతూ, గ్యాక్‌పో ఈ విషాదాన్ని ఎంతో పరిణతితో ఎదుర్కొన్నాడని, జట్టును విడిచి వెళ్లకుండా మైదానంలోనే పోరాడాలని నిర్ణయించుకోవడం అతని నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు. మొరాకోతో జరిగిన ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 72వ నిమిషంలో క్రిసెన్సియో సమ్మర్‌విల్లే అందించిన పాస్‌ను అందుకుని కోడి గ్యాక్‌పో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. గోల్ కొట్టిన వెంటనే అతనిలోని భావోద్వేగాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. గ్యాక్‌పో మైదానంలో మోకాళ్లపై కూలిపోయి, తలను పచ్చటి గడ్డిపై ఉంచి వెక్కివెక్కి ఏడ్చాడు. తన పుట్టబోయే కొడుకు జ్ఞాపకార్థం ఆకాశం వైపు చేతులు చూపిస్తూ నివాళులర్పించాడు. ఆ సమయంలో అతని సహచర ఆటగాడు మిక్కీ వాన్ డి వెన్ అతని తలపై ముద్దు పెట్టుకోగా, కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్ గ్యాక్‌పోను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చారు. స్టేడియంలో ఉన్న అతని తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. చివరకు ఈ మ్యాచ్ 1-1 తో డ్రా అయి, పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్ 2-3 తో ఓడిపోయినప్పటికీ, గ్యాక్‌పో సాధించిన ఆ భావోద్వేగ గోల్ మరియు అతని కన్నీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను కదిలించాయి. ఆట కంటే జీవితంలో కొన్ని బంధాలు ఎంత ముఖ్యమో ఈ ఘటన అందరికీ గుర్తుచేసింది.

Publish Date: Jun 30, 2026 3:31PM

political-news-img

జిమ్ లేదా యోగా..  గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే!

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు. కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా.. ఈ రెండింటిలో గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది? తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా కార్డియో వ్యాయామాలు చేస్తే గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది. అయితే యోగా గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక విధాలుగా కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని గుండె ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్ ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్, కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని , మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 30, 2026 3:21PM

political-news-img

భారత రాజ్యాంగ పునాదులపై సరికొత్త చర్చ.. డిస్కవరీ అండ్ భారత్ గ్రంథం!

భారతదేశ సార్వభౌమత్వానికి, పరిపాలనా విధానానికి అత్యున్నత పీఠమైన భారత రాజ్యాంగంపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఒక సరికొత్త మేధోమథనం ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వెలువడిన డిస్కవరీ అండ్ భారత్.. క్రిస్టియన్ కాన్‌స్టిట్యూషన్ ఇన్ ఎ హిందూ నేషన్ అనే పరిశోధనాత్మక గ్రంథం దేశ వ్యవస్థాపక పత్రం యొక్క మూలాలను సరికొత్త కోణంలో విశ్లేషించింది. జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ప్రసిద్ధ రచన డిస్కవరీ ఆఫ్ ఇండియా కు భిన్నమైన ప్రతివాదంగా ఈ అధ్యయనం ముందుకు వచ్చింది. హిందూ సమాజం, భారత నాగరికత ప్రాథమిక తాత్విక పునాదులను విస్మరించి, వలసరాజ్యాల కాలం నాటి ఆలోచనలను, పాశ్చాత్య క్రైస్తవ రాజకీయ సిద్ధాంతాలను మన పాలనా చట్రంపై ఏ విధంగా రుద్దారో ఈ విశ్లేషణ బహిర్గతం చేస్తోంది. 1946, 1949 మధ్య కాలంలో రాజ్యాంగ సభ సాగించిన చర్చలు, తీర్మానాలు స్వదేశీ సంస్థాగత వనరుల నుండి ఉద్భవించలేదని, కేవలం విదేశీ నమూనాల అనుకరణగానే మిగిలిపోయాయని ఈ జాతీయవాద, నాగరికతా దృక్కోణం వాదిస్తోంది. రాజ్యాంగ రూపకల్పనలోని అతుకుల బొంత – వలసపాలన ముద్ర రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దేశ విభజన సంక్షోభం, మతపరమైన కల్లోలాలు, పౌర అశాంతి నెలకొన్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వీడి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆ హడావుడి వాతావరణంలో అప్పటి చట్టసభలలోని ఉన్నత వర్గాలు తక్షణమే అందుబాటులో ఉన్న ఒక ఆచరణాత్మక నమూనాను ఎంచుకోవడానికి మొగ్గు చూపాయి. దీని ఫలితంగానే.. బ్రిటిష్ పాలకులు వదిలివెళ్లిన అధికార యంత్రాంగాన్ని యథాతథంగా స్వీకరించడం జరిగింది. ఈ రాజ్యాంగ ప్రక్రియను విమర్శకులు ఒక రకమైన కట్-కాపీ-పేస్ట్ చర్యగా అభివర్ణిస్తున్నారు. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నుండి సుమారు 80 శాతం నిబంధనలను స్వల్ప మార్పులతో ప్రస్తుత రాజ్యాంగంలోకి దిగుమతి చేసుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఐర్లాండ్ వంటి వివిధ పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుండి అనేక అంశాలను అరువు తెచ్చుకుని, ఒక సమగ్రమైన సేంద్రీయ రూపకల్పన లేకుండా ఒక అతుకుల బొంతలా దీనిని తయారు చేశారనే విమర్శలు ఉన్నాయి. అడ్వకేట్ జనరల్ స్థానంలో అటార్నీ-జనరల్ వంటి పదజాల మార్పులు మినహా.. అంతర్లీనంగా ఉన్న అధికార నిర్మాణంలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు రాలేదని ఈ డిస్కవరి అండ్ భారత్ స్పష్టం చేస్తోంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ కారణంగానే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత భారీ గ్రంథంగా, సుమారు లక్షా 50 వేల పదాల నిడివితో రూపుదిద్దుకుంది. కేవలం 8ంూల పదాలతో అత్యంత సంక్షిప్తంగా ఉండే అమెరికా రాజ్యాంగంతో పోల్చితే.. ఈ గ్రంథ నిడివి కేవలం తాత్విక లోతు లేకపోవడాన్ని, వలసవాద పరిపాలనా పద్ధతులను పరిరక్షించాలనే తాపత్రయాన్ని మాత్రమే సూచిస్తోంది. దీనివల్ల కేవలం తెల్ల దొరల నుండి గోధుమ రంగు దొరలకు అధికారం బదిలీ అయిందే తప్ప.. రాజ్యం యొక్క ఆలోచనా విధానంలో ఎటువంటి వలస విముక్తి జరగలేదు. చట్టపరమైన కోణంలో చూస్తే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 395 ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని, 1947 భారత స్వాతంత్ర్య చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ, బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలను రద్దు చేసే సార్వభౌమ అధికారం భారత రాజ్యాంగ సభకు ఏ విధంగా సంక్రమిస్తుందనే చట్టపరమైన వైరుధ్యం ఇప్పటికీ మిగిలే ఉంది. ఈ సాంకేతిక లోపాలు 1970ల వరకు బ్రిటన్‌లో జరిగిన కొన్ని శాసన సవరణల ద్వారానే చట్టబద్ధంగా సర్దుబాటు చేయబడ్డాయి. సిద్ధాంతాల మూలాలు: క్రైస్తవ త్రిత్వం, లౌకకవాదం ఆధునిక ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన సిద్ధాంతానికి కేవలం హేతుబద్ధమైన పునాది మాత్రమే కాకుండా, క్రైస్తవ దైవశాస్త్ర మూలాలు ఉన్నాయనే వాదన ఈ గ్రంథం ద్వారా వెలుగులోకి వచ్చింది. మాంటెస్క్యూ ప్రతిపాదించిన ఈ విభజన క్రైస్తవ మతంలోని పవిత్ర తండ్రి, పవిత్ర కుమారుడు, పవిత్రాత్మ అనే త్రిత్వ (Trinity) భావన నుండి లౌకీకీకరించబడిన రూపమేనని రాజ్యాంగ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇండియాలో దీనిని ఒక సార్వత్రిక లౌకిక సూత్రంగా బోధిస్తున్నప్పటికీ.. ఇదే తరహా త్రివిధ నమూనాను బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి హిందూ తత్వాలతో ముడిపెట్టి ఉంటే మతపాలన అనే ఆరోపణలు వచ్చేవి. ప్రస్తుత లౌకికవాద చర్చలలో చాలా భాగం పాశ్చాత్య క్రైస్తవ నాగరికతా విలువల ప్రపంచీకరణేననడంలో ఎలాంటి సందేహం లేదు. ధర్మం వర్సెస్ హక్కులు.. గాంధీజీ విస్మరించబడిన సంప్రదాయం భారతీయ తాత్విక ఐక్యత అంతటా ద్వైత, అద్వైత వంటి భిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే పరమ సత్యాన్ని వివిధ రూపాల్లో అంగీకరిస్తాయి. భారత మూలాల ధార్మిక సంప్రదాయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు సూత్రాలు. - ధర్మం: సమాజం పట్ల వ్యక్తి నిర్వహించాల్సిన కర్తవ్యం లేదా నియమావళి. - కర్మ: మానవుడు చేసే ప్రతి చర్య మరియు దాని ఫలితం. - సంసారం: జనన మరణాల అస్తిత్వ చక్రం. - మోక్షం: భౌతిక బంధాల నుండి లభించే అంతిమ విముక్తి. ఈ నాలుగు స్తంభాలలో ధర్మం అనేది విధి ఆధారిత ప్రవర్తనను నిర్దేశిస్తుంది. కానీ రాజ్యాంగం ఈ విధి కేంద్రీకృత సంస్కృతిని పక్కన పెట్టి.. పూర్తిగా పాశ్చాత్య హక్కుల-కేంద్రీకృత' చట్టపరమైన పత్రం చుట్టూ తిరగడం ఒక పెద్ద నాగరికతా వైరుధ్యం. 1940లలో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనపై చర్చలు జరుగుతున్నప్పుడు.. మహాత్మా గాంధీజీ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. సమాజంలో హక్కుల కంటే విధులే ప్రాధాన్యమైనవని, ఒక వ్యక్తి తన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఇతరుల హక్కులు వాటంతట అవే రక్షించబడతాయని గాంధీజీ స్పష్టం చేశారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల సాంప్రదాయాలతో ఏకీభవించిన ఈ గాంధీ దృక్పథాన్ని పక్కన పెట్టి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు ప్రమోట్ చేసిన ప్రొటెస్టంట్ హక్కుల నమూనాకే భారతదేశం లొంగిపోయింది. ఉన్నత వర్గాల మేధోపరమైన దాస్యం.. జాతీయ చిహ్నాల మార్పు 1947, 48 కాలంలో అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధులు ప్రదర్శించిన ఆత్మన్యూనతా భావం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. పారిస్‌లో విజయలక్ష్మి పండిట్ ప్రసంగిస్తూ.. భారతదేశం ఫ్రాన్స్, అమెరికా, ఐర్లాండ్ వంటి దేశాల నుండి రాజ్యాంగ ఆలోచనలను అరువు తెచ్చుకుంటోందని గర్వంగా ప్రకటించడం.. ఐదు వేల సంవత్సరాల పురాతన నాగరికతకు ప్రపంచానికి ఇవ్వడానికి ఏమీ లేదనే సంకుచిత భావనను ప్రతిబింబించింది. లోకమాన్య తిలక్ జీవిత చరిత్రకారుడు థియొడోర్ షాయర్ అన్నట్లు, ఈ రాజ్యాంగం భారతదేశం చేయగలిగిన అత్యంత భారతీయేతర రాజ్యాంగం. స్వాతంత్ర్య సమరంలో సర్వస్వం త్యాగం చేసిన తిలక్, అరబిందో, గాంధీజీ వంటి అగ్రనాయకులు ఎవరూ ఈ ముసాయిదా రచనలో భాగస్వాములు కాలేదు. స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనని ఉన్నత ఎలైట్ వర్గాల చేతుల్లో ఈ పత్రం రూపుదిద్దుకుంది. స్వయంగా బి.ఆర్. అంబేద్కర్ ఈ రాజ్యాంగంలోని అరువు తెచ్చుకున్న స్వభావాన్ని అంగీకరించారు. గణతంత్ర దేశం ఎంచుకున్న ప్రతీకలలో కూడా ఈ నాగరికతా సంకోచం స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతాన్ని 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వేడుకల్లో కేవలం మొదటి చరణానికే పరిమితం చేసి, సీనియర్ నాయకులు లేని ఖాళీ సభలో పాడించడం దీనికి ఒక ఉదాహరణ. అలాగే.. జాతీయ పతాకం విషయంలో మొదట ప్రతిపాదించిన చరఖాతో కూడిన కాషాయ జెండాను పక్కన పెట్టి, అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎంపిక చేశారు. మొదట రంగులను మతపరమైన వర్గాలకు (హిందూ, ముస్లిం, క్రైస్తవ) ప్రతీకలుగా గాంధీజీ భావించినప్పటికీ, తరువాతి కాలంలో పాఠ్యపుస్తకాల ద్వారా వాటికి త్యాగం, శాంతి, శ్రేయస్సు అనే లౌకిక అర్థాలను పునర్నిర్మించారు. గాంధీజీ ముద్రను చెరిపివేయడానికే చరఖా స్థానంలో అశోకచక్రాన్ని తెచ్చారనే విమర్శ ఉంది. లౌకికవాదం, సామాజిక విధానాల పరంగా చూస్తే, భారతదేశంలో ఇది ఒక విపరీతమైన ద్వంద్వ విధానాన్ని సంతరించుకుంది. మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రక్షణలు, రాయితీలను కల్పించడానికి ఇది ఒక సాధనంగా మారింది. మెజారిటీ హిందూ నాగరికత యొక్క ఆకాంక్షలను, గుర్తింపును నైతికంగా అణచివేయడానికి దీనిని ఉపయోగించారు. ఆర్టికల్ 25 కింద మత ప్రచార హక్కును ప్రత్యేకంగా చేర్చడం మిషనరీ కార్యకలాపాలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికేననే వాదన ఉంది. ఆర్థిక విధానాలలో కూడా ప్రొటెస్టంట్ వ్యక్తివాదాన్ని, ఫ్రెంచ్ సామ్యవాద సామూహికవాదాన్ని అస్థిరంగా కలపడం వల్ల 1990 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఏ ఆర్థిక విధానాన్ని రాజ్యాంగంలో శాశ్వతం చేయవద్దని అంబేద్కర్ హెచ్చరించినప్పటికీ, 1976 నాటి 42వ సవరణ ద్వారా ప్రవేశికలో బలవంతంగా సోషలిస్ట్ పదాన్ని చేర్చారు. నూతన ఆపరేటింగ్ సిస్టమ్ – భవిష్యత్ కాలపరిమితి భారతదేశాన్ని 1947లో ఒక ఫార్మాట్ చేయని హార్డ్ డిస్క్ లాగా భావించి, దాని సుదీర్ఘ చక్రీయ కాల చక్రాన్ని విస్మరించి,.. పాశ్చాత్య రేఖీయ కాలక్రమాన్ని స్వీకరించడం ద్వారా మనల్ని గతం నుండి వేరు చేశారు. తమిళనాడులోని వెయ్యి సంవత్సరాల నాటి ఉత్తరమేరూర్ శాసనాలు ప్రతిపాదించిన అత్యంత అధునాతన గ్రామ స్వయంపాలన, ఎన్నికల నియమావళి వంటి దేశీయ ప్రజాస్వామ్య నమూనాలను రాజ్యాంగ సభ పూర్తిగా విస్మరించింది. కేంబ్రిడ్జ్ ఎండ్యూరెన్స్ ప్రాజెక్ట్ పరిశోధనల ప్రకారం.. సాధారణంగా ఏ రాజ్యాంగమైనా గరిష్టంగా 19 సంవత్సరాలు మాత్రమే సమర్థవంతంగా మనుగడ సాగించగలదు. చనిపోయిన వారు బ్రతుకున్న వారిని పాలించకూడదు అనే జాన్ ఆడమ్స్ సూచన ప్రకారం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాలను పునఃసృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడు దశాబ్దాలు దాటిన ప్రస్తుత భారత రాజ్యాంగం తన కాలపరిమితిని మించిపోయిందని నాగరికతా పండితులు అభిప్రాయపడుతున్నారు. నూతన నాగరికతా రాజ్యాంగం దిశగా ప్రతిపాదనలు ఆధునిక ఆకాంక్షలతో దూసుకుపోతున్న నూతన భారతదేశం ఫెరారీ ఇంజిన్ ను, వలసరాజ్యాల కాలం నాటి పాత అంబాసిడర్ కారు చట్రంలో ఇరికించడానికి ప్రయత్నించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ నేపథ్యంలో, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేధావులు కొన్ని కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు: సంక్షిప్తత.. విస్తృతమైన చట్టాల సంకలనంగా కాకుండా, కేవలం 8,000 నుండి 10,000 పదాల పరిమితితో ముఖ్యమైన సూత్రాలపైనే దృష్టి పెట్టేలా రాజ్యాంగాన్ని సవరించాలి. నిజమైన వికేంద్రీకరణ.. పంచాయతీ రాజ్, స్థానిక సంస్థలను పరిపాలనలో మూడవ శ్రేణిగా అధికారికంగా గుర్తిస్తూ, రాష్ట్రం నుండి గ్రామ స్థాయికి స్పష్టమైన అధికారాల బదిలీ జరగాలి. ధర్మ ఆధారిత విధులు.. కేవలం హక్కులకే ప్రాధాన్యత ఇవ్వకుండా.. భారత సంస్కృతికి మూలమైన ధర్మం, విధులను రాజ్యాంగ కేంద్రంలోకి తీసుకురావాలి. న్యాయవ్యవస్థ పునర్వ్యవస్థీకరణ.. వలసకాలం నాటి నిరుపయోగమైన చట్టాలను రద్దు చేస్తూ, మరింత జవాబుదారీతనం, పారదర్శకత కలిగిన న్యాయ, పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించాలి. ప్రాంతీయ బాధ్యతలు.. భారతదేశపు విస్తృత నాగరికత పరిధిని విస్తరిస్తూ పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులకు రాజ్యసభలో స్థానాలు కల్పించే సృజనాత్మక వ్యూహాలను అన్వేషించాలి. సమకాలీన భారతదేశపు ఎదుగుతున్న ఆకాంక్షలను, నిజమైన స్వదేశీ మరియు భవిష్యత్-ఆధారిత రాజ్యాంగ వ్యవస్థతో సమన్వయం చేసినప్పుడే వికసిత భారత్ కల సాకారమవుతుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 30, 2026 3:16PM

political-news-img

జన్వాడ కేసులో సంచలన ట్విస్ట్.. బంగారు నిధి పేరుతో మోసం

రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఐదు నెలల క్రితమే ఓ బాబు జన్మించాడు. ఆనందంగా సాగాల్సిన వారి దాంపత్య జీవితం చివరకు విషాదాంతమైంది. ఈ కేసులో పద్మ తల్లిదండ్రులు, మేనమరిదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పద్మ తండ్రి చంద్రయ్య తన ఇంట్లో బంగారు నిధి ఉందని కూతురు, అల్లుడు సాయిని నమ్మించాడు. ఆ నిధిని వెలికితీయడానికి రూ.10 లక్షలు అవసరమని చెప్పడంతో సాయి ఆ మొత్తాన్ని ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే తవ్వకాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి నిధి లభించలేదు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సాయి పలుమార్లు కోరినా, చంద్రయ్య వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మానసిక ఒత్తిడి ఒకవైపు.. కన్న తల్లిదండ్రులే నమ్మించి మోసం చేశారన్న బాధ మరోవైపు వెంటాడడంతో సాయి–పద్మ దంపతులు తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. చివరకు తమ ఐదు నెలల పసిబిడ్డను అనాథగా చేసి, వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పద్మ తండ్రి చంద్రయ్యతో పాటు, తల్లి శాంతమ్మ, మేనమరిది వెంకటేష్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోయిన ఐదు నెలల చిన్నారి పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది. ఈ కేసులో మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Publish Date: Jun 30, 2026 3:10PM

political-news-img

ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్: నారా లోకేష్ ఎవరి సినిమా మొదట చూస్తారు?

ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల; ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి! ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని పంక్తులు.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొన్నారు. నారా లోకేష్.. యువతలో, అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే లోకేష్ తాజాగా.. టీనేజర్లు, యువతతో ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తమదైన శైలిలో లోకేష్‌ను సరదా ప్రశ్నలతో టీజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే యువత ప్రశ్నలకు లోకేష్ వారి కంటే సరదాగా.. ఎదురు వారినే టీజ్ చేసేలా ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే లోకేష్ అత్యంత క్లిష్టమైన, అంతకు మించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదుర్కొన్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్.. అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు. పైకి సరదాగా కనిపించినా.. ఈ ప్రశ్న రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్.. నందమూరి వంశానికి చెందిన స్టార్ హీరో. ఈ ఇరువురిలో ఏ ఒకరి సినిమా ముందుగా చూస్తానని లోకేష్ చెప్పినా దానికి రాజకీయ రంగు పులమడానికి ఆయన ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. అయితే వారికి అటువంటి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకుండా లోకేష్ సమయస్ఫూర్తితో లౌక్యంగా ఇద్దరి సినిమాలూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. యూత్ సరదా ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఇది ఒక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారా, రాష్ట్రపతిగా చూడాలని ఉందా అన్న ప్రశ్నకు లోకేష్ అనితర సాధ్యమైన రీతిలో.. ఆ రెండు పదవులు కాకుండా, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటూ, తాను ఎల్లప్పు డూ చేసే విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించడమే తనకు ఇష్టమని బదులిచ్చారు. ఇక ఆహారంలో తనకు రాగి సంకటి అత్యంత ఇష్టమని లోకేష్ చెప్పారు. పొలిటికల్ గా 2029 ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

Publish Date: Jun 30, 2026 3:07PM

MOVIE NEWS