తెలంగాణ అప్పులపై భట్టి విక్రమార్కవి పచ్చి అబద్ధాలు.. : హరీశ్ రావు
Publish Date:Jul 4, 2026
Advertisement
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఈ విధమైన అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త డ్రామాలకు తెరలేపారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు లేని అప్పులను కూడా ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పాలక పక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎంత కోపంతో ఊగిపోయినా వాస్తవాలను దాచలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన రూ.15 వేల కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ఖాతాలో చూపారని హరీశ్ రావు విమర్శించారు . రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారిపోవంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.4.14 లక్షల కోట్లు మాత్రమే. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను మాజీ సీఎం కేసీఆర్ అమలు చేశారని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందు ప్రజల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా గ్యారంటీ కార్డులను పంచారని హరీశ్ రావు గుర్తు చేశారు. తీరా అధికార పీఠం దక్కిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేసే సత్తా లేక ఇలాంటి కుంటిసాకులు వెతుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పించుకోవడానికే రోజుకో అబద్ధం, పూటకో సాకు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, ఇచ్చిన గ్యారంటీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర అసంతృప్తిని, డ్యామేజ్ను కవర్ చేసుకునేందుకే భట్టి విక్రమార్క ఇలాంటి గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ విధమైన రాజకీయ ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోలేరని హరీశ్ రావు పేర్కొన్నారు. తాము చేసిన వ్యూహాత్మక అప్పుల వల్ల రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందే తప్ప నష్టం జరగలేదని గులాబీ శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్పుల సాకుతో కాలం గడపడంపై ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని పక్కనబెట్టి, అసెంబ్లీ ఎన్నికల వేళ తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా ఎలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో హామీల అమలుపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ తాము ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్పుల సాకుతో రోజులు నెట్టుకొస్తున్న సర్కార్పై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/telangana-debts-36-225074.html





