యువ రైతుల అద్భుతం...ఏరోపోనిక్స్ టెక్నాలజీతో కుంకుమ పువ్వు సాగు
Publish Date:Apr 15, 2026
Advertisement
కుంకుమపువ్వు సాగుతో కోట్లు సంపాదిస్తున్న పంజాబ్ సోదరులు వ్యవసాయం అంటే కేవలం ఎండలో కష్టపడటం మాత్రమే కాదు, తెలివైన ఆలోచనతో సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని పంజాబ్ యువకులు నిరూపించారు. సాధారణంగా చల్లని వాతావరణం ఉండే కాశ్మీర్ లోయల్లో మాత్రమే పండే కుంకుమపువ్వును, ఇప్పుడు పంజాబ్లోని ఒక మూసి ఉన్న గదిలో పండించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 'ఏరోపోనిక్స్' (Aeroponics) అనే అత్యాధునిక విధానం ద్వారా వీరు సాగిస్తున్న ఈ సాగు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేవలం 630 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదిలో వీరు ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. కుంకుమపువ్వు పండటానికి కావాల్సిన గడ్డకట్టే చలిని, తేమను కృత్రిమంగా సృష్టించారు. ఎల్ఈడీ గ్రో లైట్లు, హ్యూమిడిఫైయర్లు మరియు కార్బన్ డయాక్సైడ్ నియంత్రణ యంత్రాలను ఉపయోగించి, గది ఉష్ణోగ్రతను 3 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మట్టి అవసరం లేకుండా కేవలం గాలిలోని తేమ, పోషకాలతో మొక్కలు పెరిగేలా ఈ ఏరోపోనిక్స్ టెక్నాలజీని రూపొందించారు. ప్రారంభంలో వీరికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కాశ్మీర్ నుంచి తెచ్చిన విత్తనాల్లో దాదాపు 20 శాతం వేడి కారణంగా పాడైపోయాయి. భారీ నష్టం వాటిల్లినప్పటికీ పట్టువదలని విక్రమార్థుల్లా శ్రమించి, చివరికి అత్యంత నాణ్యమైన దిగుబడిని సాధించారు. మొదటి ఏడాది వీరు సుమారు 1.3 కిలోల కుంకుమపువ్వును ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కుంకుమపువ్వు ధర గ్రాముకు రూ. 300-400 ఉంటే, వీరు పండించిన నాణ్యమైన పువ్వు ధర ఏకంగా రూ. 1300 నుంచి రూ. 1650 వరకు పలుకుతోంది. అంటే కిలో విలువ దాదాపు రూ. 13 లక్షలకు పైమాటే. ఈ రకమైన ఇండోర్ సాగు వల్ల వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పంటను పండించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, పురుగుల మందుల అవసరం లేకపోవడంతో ఇది పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో సాగువుతోంది. వీరి కృషిని గుర్తించిన పలువురు వ్యవసాయ నిపుణులు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప మార్గమని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వీరు పండించిన ఈ విలువైన పంటను ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కుంకుమపువ్వుకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఈ సాగును మరింత విస్తరించాలని ఈ యువ రైతులు యోచిస్తున్నారు. మన దేశంలో కుంకుమపువ్వు దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇలాంటి ప్రయోగాలు ఎంతో దోహదపడతాయని సామాన్యులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
http://www.teluguone.com/news/content/saffron-farming-36-217462.html




