కేంద్రం వైఖరిపై సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి.. హైదరాబాద్కు రాగానే మాట్లాడతా..!
Publish Date:Aug 23, 2026
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) clearance నిరాకరించడంతో ఆయన బోస్టన్ షెడ్యూల్ రద్దయింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక పూర్తిగా రాజకీయ కోణమే దాగి ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేంద్రంలోని అధికార యంత్రాంగం కావాలనే ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. అమెరికా పర్యటన రద్దయినప్పటికీ, తన లండన్ పర్యటన అత్యంత విజయవంతంగా పూర్తయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బ్రిటన్లో పలు కీలక భేటీలు ప్రయోజనకరంగా సాగాయని చెప్పారు. మరో కొన్ని గంటల్లో తాను హైదరాబాద్ చేరుకోబోతున్నానని పేర్కొన్నారు. నగరానికి చేరుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి, పర్యటన అనుమతుల నిరాకరణ వెనుక ఉన్న కారణాలపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని సీఎం స్పష్టం చేశారు. ఈ వివాదంపై సమగ్రమైన వివరాలను త్వరలోనే మీడియా ముందుకు తెస్తానని సంకేతాలిచ్చారు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ శ్రేణులు, తెలంగాణ ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయమని కొనియాడారు. కాగా, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల విషయంలో కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ వంటి రాష్ట్రాల నేతలకు సత్వరమే అనుమతులు ఇస్తూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలకు ఆంక్షలు విధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరిన్ని రాజకీయ సెగలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చాక చేయబోయే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ సీఎం అమెరికా పర్యటనకు అనుమతించి.. తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ధి, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరింది. తెలంగాణ అభివృద్ధికి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని IOC పేర్కొంది. కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. Revanth Reddy US Visit, Revanth Reddy Centre Permission, Telangana CM, Ministry of External Affairs Revanth Reddy, Revanth Reddy London Tour,Telangana Investments, Central Government MEA, Telangana CM US Visit
http://www.teluguone.com/news/content/revanth-reddy-us-visit-24-229629.html





