కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో షాక్
Publish Date:Apr 15, 2026
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అస్సాంలోని గువాహటిలో నమోదైన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం నేపథ్యం పరిశీలిస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో పవన్ ఖేరాపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరు చేస్తూ హైకోర్టు గత శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ సమయంలోగా అస్సాంలోని సంబంధిత కోర్టును సంప్రదించాలని సూచించింది. అయితే, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేసు అస్సాంలో నమోదైతే, తెలంగాణ హైకోర్టులో బెయిల్ అడగడం చట్టబద్ధం కాదని వాదించారు. ఈ పిటిషన్ను విచారించే ప్రాదేశిక అధికార పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, స్థానిక అస్సాం న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా నేరుగా ఇక్కడకు ఎందుకు వచ్చారో ఖేరా తరఫు న్యాయవాదులు సరైన వివరణ ఇవ్వలేకపోయారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను తప్పుబడుతూ స్టే ఇచ్చింది. ఒకవేళ పవన్ ఖేరా నేరుగా అస్సాం పరిధిలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే, తాము ఆయన విన్నపాన్ని సానుకూలంగా పరిగణనలోకి తీసుకునేవాళ్లమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టపరమైన ప్రక్రియను సరైన మార్గంలో అనుసరించాలని సూచించింది. ప్రస్తుత పరిణామాలతో పవన్ ఖేరా ఇప్పుడు తప్పనిసరిగా అస్సాం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార బీజేపీ కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలక పక్షం స్పష్టం చేస్తోంది. మున్ముందు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/pawan-khera-36-217407.html





