మామిడి రైతులను దెబ్బతీసిన కార్బైడ్
Publish Date:Apr 26, 2012
Advertisement
రాష్ట్రంలోని మామిడి రైతులు ప్రతియేటా ఏదో రూపంలో నష్టాలకు గురవుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, అకాలవర్షాలు, ఈదురుగాలులు వంటి కారణాలు ప్రతియేటా మామిడి రైతును ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో మామిడికి మచ్చతెగులు సోకి పూట మాడిపోయింది. దీంతో మామిడి దిగుబడి 20 నుంచి 30 శాతం వరకూ పడిపోయింది. ఈ అవాంతరాన్ని దాటి మామిడికాయతో మార్కెట్లోకి వెళుతున్న రైతులకు కాల్షియం కార్బైడ్ రూపంలో కొత్త అవాంతరం ఎదురైంది. మన రాష్ట్రంలో పండే మామిడి దాదాపు 75 శాతం ఇతర రాష్ట్రాలకు దిగుమతి అవుతోంది. మామిడికాయలు త్వరగా పక్వానికి రావటానికి మన రైతులు కాల్షియం కార్బైడ్ ను వాడుతున్నారు. ఈ కాల్షియం కార్బైడ్ ను వాడటం వల్ల ప్రజారోగ్యానికి హాని కలుగుతుందన్న ఉద్దేశ్యంతో పలు రాష్ట్రాలు రాష్ట్రంలో పండే మామిడికాయల దిగుమతిని నిషేధించాయి. దీంతో రైతులు మరోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని సాకుగా తీసుకుని దళారులు, వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. గత ఏడాది 35వేల నుంచి 45వేల రూపాయల వరకూ పలికిన టన్ను బంగినపల్లి మామిడి ఈ ఏడాది 25వేలకు పడిపోయింది. కలెక్టర్ కాయ ధర 12వేల నుంచి 6వేలకు తగ్గింది. ధర దారుణంగా తగ్గిపోవటంతో సాగుఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించిన ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు సూచించటం లేదు. రాష్ట్రంలో మ్యాంగో వేపర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నూజివీడు, తిరుపతిల్లో మాత్రమే ఉన్నాయి. పక్వానికి రాని మామిడిని పండించటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాంట్లు కేవలం రెండే ఉండటం, దీనికి అయ్యే ఖర్చు కూడా అధికంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/mango-farmers-24-13644.html





