వైసీపీ తలుపులు తడుతున్న ‘కాపు’
Publish Date:Mar 19, 2025
Advertisement
వైసీపీలో నుంచి బయటకు వెళ్లిపోయే నాయకులు తప్పించి ఆ పార్టీలోకి కొత్తగా వచ్చే నేతలే కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల కోసం ఆ పార్టీ వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని వీడిన నేతలు తిరిగి రీ ఎంట్రీకి ప్రయత్నిస్తుండటం జగన్కు ఊరటగా మారిందంటున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ క్యాడర్ డీలా పడిపోయింది. మరోవైపు పార్టీకి కీలక నేతలంతా కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలంతా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఇటీవలే పార్టీతో పాటు, తన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నుంచి వెళ్లే వారు తప్పిస్తే..పార్టీలోకి వచ్చే నేతలెవ్వరూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత , తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు , తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి చేశారు. వైసీపీకి దూరమయ్యాక కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమాత్రం మెరుగు పడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. మెట్టు గోవిందరెడ్డి బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.జగన్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/kapuramachandrareddy-trying-to-join-ycp-39-194624.html





