తెలంగాణలో ఎండలు ప్రచండం.. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం
Publish Date:Apr 26, 2026
Advertisement
తెలంగాణ లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఈ వారంలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గ 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయి చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. నీరు ఎక్కువగా తాగాలనీ, అలాగే ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలనీ సూచించింది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా గొడుగు ఉండాలనీ, లేదా కనీసం టోపీ ధరించాలని పేర్కొంది. ఇక నూనె వస్తువులు, మసాలా ఆహారానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. పని ప్రదేశాల్లో మంచినీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/heat-wave-in-telangana-36-218326.html





