ఇక్కడ ఇలా.. అక్కడ అలా..!..
Publish Date:Jun 4, 2022
Advertisement
ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. పర్యవశానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో అయితే అది మరింత ఎక్కువ కావాలి. ఘనంగా ప్రకటనలు చేసేయడం.. ఆచరణలోకి వచ్చే సరికి జావగారిపోవడం వల్ల ప్రజలలో పలుచన అవుతారు. అలా కాకుండా నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి చెప్పింది చెప్పనట్లు చేయగలితే ప్రజలలో గౌరవం పెరుగుతుంది. వారి నాయకత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పింది చేయను.. చేసేది చెప్పను అన్నట్లు వ్యవహరించే వారు కొందరైతే.. చెప్పింది చెప్పినట్లు చేసి జనం మన్ననలు పొందేవారు మరి కొందరు. ఇందులో మొదటి రకం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే.. రెండో రకం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ముందుగా జగన్ విషయమే తీసుకుంటే.. 2019లో అధికారం చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్ రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను పూర్తిగా మార్చేస్తాననీ, కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించేశారు. అంటే తొలి రెండున్నరేళ్లు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారెవరూ రెండున్నరేళ్ల తరువాత ఉండరనీ, వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రులుగా కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించారు. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ శ్లాఘించారు. సాహసోపేత నిర్ణయంగా కీర్తించారు. అలా చేయడం వల్ల మంత్రుల పనితీరే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారని భావించారు. రెండున్నరేళ్లు కాదు.. మూడేళ్లు గడిచిన తరువాత జగన్ చేసింది మంత్రివర్గ మార్పు కాదు.. పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మరికొందరికి స్థానం కల్పించారు. మొత్తం కేబినెట్ ను మారుస్తానంటూ నాడు చేసిన ప్రకటనను పూర్తిగా మర్చిపోయారు. ఆ మార్పులు కూడా భయం భయంగా ఎవరిని తొలగిస్తే ఏం సమస్య వస్తుందో అన్నట్లు కసరత్తుల మీద కసరత్తులు, ఒకసారి ఒకరిని అనుకుని కాదు కాదు అంటూ మరొకరి పేరు...ఇలా అంతా గందరగోళం. చివరికి పునర్వ్యవస్థీకరణ చేసినా.. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి. నిరసన ప్రదర్శనలు మొత్తం మీద కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పూర్తయిన నెలల తరువాత కూడా ఇప్పటికీ పార్టీలో అసమ్మతి చల్లారలేదు. మూడేళ్ల ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా తడబాటు. అన్ ప్రిపేర్డ్ నెస్.. ఎవరిని కదిపితే ఏమౌతుందోనన్న భయం. దీంతో జగన్ కేబినెట్ రీషఫుల్ తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసమ్మతి రాగాలు శ్రుతి మించాయి. నిరసనలు పరిధి దాటాయి. నెలలు గడుస్తున్నా కొత్త మంత్రులు పూర్తిగా కుదురుకోలేదు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతోనే ఆ పార్టీ బలహీనతలూ బయటపడ్డాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురై మాజీ లైన వారు సైలెంటైపోయారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన దాఖలాలూ కనిపించడం లేదు. మంత్రులుగా నిత్యం విపక్షంపై విమర్శలతో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలలోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే ఆయన 2004 నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీని విజయ పథంలో నడిపించారు. 2014 ఎన్నికలలో విజయం తరువాత మూడేళ్ల వరకూ కేబినెట్ లో ఎటువంటి మార్పూలూ చేర్పులూ లేవు. ఇప్పడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఉపక్రమించారు. అంతే సీఎంకు సంఘీభావంగా, పునర్వ్యవస్థీకరణకు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనువుగా స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. ఈ రోజు అంటే ఆదివారం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సీఎం కొత్త కేబినెట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేశారు. అదీ పార్టీపై పట్టు ఉండటమంటే. ఆయనేం మూడేళ్ల తరువాత మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానని 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో చెప్పలేదు. కానీ ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని తలపెట్టగానే మంత్రులందా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. స్పీకర్ సహా మంతులంతా తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్కు సమర్పించారు. ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు. పార్టీలో కానీ, మంత్రులలో కానీ ఎక్కడా, ఎవరిలోనూ అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం అయిన దాఖలాలు లేవు. అదీ ఒడిశా సీఎం పట్నాయక్ కు, ఏపీ సీఎం జగన్ కూ తేడా. స్ఫష్టత, విశ్వాసం, విశ్వసనీయతా నవీన్ పట్నాయక్ బ్రాండ్ అయితే.. అస్పష్టత, అయోమయం జగన్ బ్రాండ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/difference-between-jagan-and-naveen-patnaik-25-137060.html





