కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ
Publish Date:Oct 3, 2025
Advertisement
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ లో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ సొంత పార్టీలో కాక రేగుతోంది. జమ్మలమడుగులో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల వ్యవహారం రచ్చ రచ్చగా మారడం జమ్మలమడుగులోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా రాజకీయ చర్చలకు దారితీశాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపడుతున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఇటీవల దాడులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం కమలం పార్టీలో వర్గపోరు ను తలపిస్తోంది. సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ గండికోటలో ఏ.పి టూరిజం శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా రూ.55 కోట్లు విలువైన అభివృద్ధి పనులను టెండర్లు దక్కించుకుని పనులు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత నెల 22 న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ గ్రామ సమస్యల పరిష్కారం అయిన తర్వాత, అధికారులు చూసిన వెళ్ళిన తర్వాత పనులు చేపట్టాలని హెచ్చరించారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డి వర్గీయులు వాహనాల్లో దాదాపు 50 మంది జమ్మలమడుగు నుండి బయలు దేరి గండికోటలోని రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ పైన, కంటైనర్ దాడి చేసి ధ్వంసం చేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని దుర్భషలాడి బయటకు పంపారు. కంప్యూటర్లు, చైర్లు పగలగొట్టారు. గండికోటలోని గుర్రపుశాల వద్ద జెసిబితో చేపడుతున్న పనులను నిలిపివేశారు. గండికోటలో జరుగుతున్న పనులను అర్ధంతంగా నిలిచిపోయ్యాయి. జమ్మలమడుగులో గత కొంత కాలంగా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు కావడంతో పోలీసులకు సైతం పాలుపోని పరిస్తితి గా మారింది. టిడిపిలో కొనసాగే సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధం ప్రస్తుతం బిజెపిలో కొనసాగింపు అన్న చందంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కావస్తున్నా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య మరింతగా అధిపత్య పోరు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. జమ్మలమడుగు స్థానిక ప్రజాప్రతినిదిగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఎంపి రమేష్ నాయుడు అధిపత్యం ఏంటి అన్నది ఆది వర్గీయు లు చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు దక్కించుకొని చేపట్టడంలో తప్పేముందని సీఎం రమేష్ వర్గీయులు చెప్పకు వస్తున్నారు. గండికోట అభివృద్ధి పనులను రమేష్ నాయుడు కు చెందిన కన్స్ట్రక్షన్ కంపెని సొంతం చేసుకోవడంతో మరో మారు లోకల్ గా బడా నేతల మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు . తాజాగా జరిగిన గండికోట గొడవలో ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరుల మద్య ఉద్రిక్తత పరిస్థితులు దారి తీశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య దాడికి పాల్పడిన కొందరిని అదుపులో తీసుకున్నారు. రిత్విక్ కన్ స్ట్రక్షన్ మేనేజర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జమ్మలమడుగు అభివృద్ధిలో ఇద్దరు కమలం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న అధిపత్యం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కూటమి నేతలకు పొలిటికల్ టెన్షన్ తప్పడం లేదు.
http://www.teluguone.com/news/content/cm-ramesh-39-207302.html





