కిరణ్ కు అధిష్టానం బాసట?
Publish Date:Apr 3, 2012
Advertisement
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఏర్పడిన వివాదంలో అధిష్టానం కిరణ్ కు బాసటగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఇటువంటి పరిణామాలను ఊహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఎంపిలను పార్టీలో నెంబర్ టూ లాంటి ప్రణబ్ ముఖర్జీ వద్దకు రాయబారం పంపారు. వీరు చెప్పినదంతా విన్న ప్రణబ్ కిరణ్ కుమార్ కు సానుకూలంగా మాట్లాడారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు. కిరణ్ బలహీనుడని ఆయనకు మద్దరు ఇచ్చేవారు ఎవరూ లేరని బొత్స మొదటినుంచి భావిస్తూ వచ్చారు. దీనికి తోడు తన బలాన్ని కూడా బొత్స ఎక్కువగా అంచనావేసుకున్నారు. అంతేకాక పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి కిరణ్ కు వ్యతిరేకంగా తన వర్గాన్ని కూడగట్టడానికి బొత్స ప్రయత్నించారు. సమయం దొరికినప్పుడల్లా కిరణ్ ను ఇరుకున పెట్టాలని భావించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే బాధ్యత తీసుకోవాలంటూ బొత్స తన వర్గంతో ప్రకటనలు చేయించడం కిరణ్ కుమార్ కు సహజంగానే ఆగ్రహం కలిగించింది. దీంతో ఆయన బొత్స పై ఏసిబి అస్త్రాన్ని ప్రయోజించి ఆయనకు దిమ్మతిరిగిపోయేలా చేశారు. ఈ దెబ్బతో విలవిలాడిన బొత్స అధిష్టానాన్ని శరణువేడటానికి ప్రయత్నించారు. ఇక్కడ కూడా ఆయనకు పెద్దగా మద్దతు లభించదని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగిన వైనాన్ని ఒకసారి పరిశీలిస్తే వారంతా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతారని అర్థమవుతుంది. ఇదే జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగలికారు. అలాగే పెద్దగా ప్రజాదరణ లేని కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కాగలిగారు. ఆ తరువాత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని పొందారు. ఆయన పదవిని పొందినవైనం కాకలు తీరిన కాంగ్రెస్ యోధులకు కూడా షాక్ నిచ్చింది. ఆ తరువాత సకలజనుల సమ్మె సమయంలో కూడా ఆయన నిగ్రహంతో వ్యవహరించి సమ్మెవిరమణకు ప్రయత్నించారు. దీనిలో సఫలమైన తరువాత రాజీవ్ యువకిరణాల పేరిట లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ కొత్త కథకాన్ని ప్రారంభించారు. అదే సమయంలో తాను గట్టి సిఎంనని, తప్పు ఏ పార్టీవారు చేసినా సహించబోనని నిరూపించేందుకు మద్యం సిండికేట్లపై ఏసిబి దాడులు చేయించారు. ఏసిబి దాడులవల్ల అనేక మంది రాజకీయ నాయకుల భాగోతం వెలుగుచూసింది. అలా వెలుగుచూసిన బాగోతాల్లో బొత్స మద్యం సిండికేట్ ఒకటి. బొత్స మద్యం సిండికేట్ ద్వారా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జించారనడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయి. ఈ సాక్ష్యాలనే ఆయన హస్తినలో అధిష్టానానికి అందజేశారు. అధిష్టానం కూడా తప్పుచేసిన వారిని వదిలివేస్తే తమకు రాష్ట్రంలో పరువుపోతుందన్న భయంతో ఉంది. అధిష్టానం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో బొత్సను పక్కనపెట్టి అవసరమైతే డి. శ్రీనివాస్ కు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-kiran-kumar-reddy-24-13128.html





