కాపు ఓటుపై కమలం కన్ను.. ఇదీ అంతేనా ?
Publish Date:Jan 8, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతో ఇంతో స్పేస్ సంపాదించుకునేందుకు బీజేపీ ఎంతో కాలంగా వ్యూహాలు రచిస్తూనే వుంది. ప్రయత్నాలు చేస్తూనే వుంది. అయితే, ఇంతవరకు కమల దళం ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత, తెలుగు దేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసిన తొలి ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు మంత్రి పదవులు కూడ దక్కించుకుంది. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీ విషయంలో కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంతో టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఈ నేపధ్యంలో, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఒంటిరి పోరాటంలో కమల దళం సొంత బలం ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేక, నోటా క్రింది స్థాయికి పడిపోయిది. ఇక అక్కడి నుంచి కిందా మీదా అవుతున్నా, ఏపీలో బీజేపీ ఆటలో అరటి పండుగానే మిగిలిపోయింది. బీజేపీ మొదటి నుంచి కూడా కాపు ఓటుపై కన్నేసింది. ఏదో విధంగా కాపుల్లో పట్టు సాదిస్తే, రాష్ట్రంలో నిలతొక్కుకోవచ్చనే ఆలోచనతో పావులు కదుపుతోంది. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చేరదీసి, పొత్తు పెట్టుకుంది. సరే, రెండు పార్టీల మధ్య పొట్టు కుదిరి రెండు సంవత్సరాల పైనే అయినా, ఇంతవరకు రెండు పార్టీల మధ్య సంబంధాలు పెద్దగా బలపడలేదు. ఎవరి దారి వారిదే అన్న విధంగానే కథ నడుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణకు, ఆ తర్వాత మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయినా, ఇంత వరకు జరిగిన తిరుపతి లోక్ సభ,బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సహా ఏ ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. తిరుపతిలో జనసేనతో పొత్తున్నా ఫలితం లేక పోయింది. బద్వేల్’లో ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోయినా అక్కడా, అదే అవమానం ఎదురైంది. కమల దళానికి డిపాజిట్ దక్కలేదు. అదెలా ఉన్నప్పటికీ, బీజేపీ ఆశలన్నీ కాపు ఓటుపైనే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆఫ్కోర్స్, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన పార్టీలు, అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా కాపు ఓటును తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కూడా పావులు కదుపుతోందని పరిశీలకులు అంటున్నారు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ఇటీవల చేసిన ప్రకటన ఆ సామాజిక వర్గాన్ని దువ్వే ప్రయత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్’తో దూరం పెంచుకుంటూ కాపులకు దగ్గరవ్వాలనుకుంటే మాత్రం అది అయ్యేపని కాదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు దేశం, వైకాపాలు కూడా పావులు కదుపుతున్నాయి. తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పార్టీ ఆవిర్భావం నుంచి కాపులు, ఇతర బీసీలు తెలుగు దేశంతోనే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే, గత ఎన్నికల్లో తాము అధికారానికి దూరం కావడానికి కాపులు, బీసీలు దూరం కావడం కూడా కారణమని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. అందుకే, తెలుగు దేశం పార్టీ మళ్ళీ ఆ వర్గాలను తమ వైపుకు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి,కాపులే కాదు, ఇతర బీసీ కులాల ప్రజలు కూడా జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనే నిజాన్ని గ్రహించి, టీడీపీ వైపు మొగ్గుచుపుతున్నారు. ఈ ఓటును కన్సాల్డేట్ చేసుకునేందుకే పవన్ కళ్యాణ్’తో పొత్తుకు కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరోక్షంగానే అయినా సుముఖత వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో అయన చేసిన వన్ సైడ్ లవ్ ప్రస్తావనే అందుకు సంకేతమని అంటున్నారు.అదే సమయంలో కాపులు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు విషయమై చర్చించడంపై కూడా టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు విషయమై చర్చించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బీసీ, దళిత, కాపులు రాజ్యాధికారం కోసం బ్లూ ప్రింట్ తయారు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన కాపు నాయకులకు బహిరంగ లేఖ రాశారు. అయితే, ప్రత్యామ్నాయ వేదిక వెనక అధికార పార్టీ హస్తముందని,అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి ఇంతకాలం మౌనంగా ఉన్న ముద్రగడ తెరమీదకు వచ్చారని చేగోండి హరిరామజోగయ్య కాపు నేతలే అనుమానిస్తున్నారు. అంతే కాకుండా జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో కాపులకు జరిగిన ప్రయోజనం ఏమీలేదని, ఇలాంటి పరిస్థితిలో కాపులు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
బీజేపీ సంగతి అలా ఉంటే, రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న కాపు ఓటు ఎటు వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగవుతాయని, అధికారం అంతగా దగ్గరవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ సూత్రం బీజేపీకి వర్తించదు. ఇప్పటికీ ఇతర సామాజిక వర్గాలపై పట్టున్న టీడీపీ, వైసీపీలకు తులాభారంలో తులసీదళంలా కాపు ఓటు కాపు కాస్తుంది, అంతేకానీ, కేవలం కాపు ఓటుతోనే ఉట్టి కొట్టడం కుదరదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-focus-on-kapu-voters-in-ap-39-129851.html





