political-news-img

వేసవిలో కరెంట్ పోయినా చల్లగా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా, కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత గురించి చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు, తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల చాపను వేయాలి. ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి సహాయపడతాయి. చన్నీటి స్నానం.. ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. వేడిగా అనిపించకుండా ఉండటానికి చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు.. మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది , శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు. వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు. అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది. *రూపశ్రీ.

Publish Date: Apr 4, 2026 1:25PM

political-news-img

మావిగన్.. జగన్ ప్రతిపాదనకు అంబటి భజన.. పెరుగుతోందట ప్రజాదరణ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మావిగన్' ప్రతిపాదనను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ, ఈ ప్రతిపాదన చేసిన జగన్ నెట్టింట ఓ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయినప్పటకీ.. వైసీపీ సీనియర్ నాయకుడు, కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు మాత్రం మావిగన్ ను భుజాలకెత్తుకున్నారు. వీరిలో అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకు వేసి మావిగన్ కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం అనేది ఎప్పటికీ పూర్తికాని ప్రక్రియ అని, అది ఒక కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా అంబటి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ఏమౌతుంది.. , భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేస్తుందంటూ తన వాచాలత్వాన్ని అంబటి ప్రదర్శించారు. అంబటి వ్యాఖ్యలపై ఒక రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది. అమరావతి రాజధానిగా స్థిరపడిందని మెజారిటీ ప్రజలు భావిస్తుంటే, వైసీపీ మాత్రం రోజుకో మాట, పూటకో ప్రతిపాదనతో ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అమరావతికి వ్యతిరేకంగా ప్రజల వద్ద మాట్లాడడానికే ఇబ్బందిగా ఉందని క్యాడర్ ఓ వైపు నెత్తీనోరూ బాబుకుంటుంటే.. ఆ పార్టీ కోఆర్డినేటర్, జగన్ ప్రభుత్వ హయాంలో ముఖ్యసలహాదారు, సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదన ప్రతి పల్లెకూ చేరేలా ప్రచారం చేయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే జనం నుంచి వ్యక్తమౌతున్నఆగ్రహం, క్యాడర్ వ్యతిరేకత వైసీపీయులు చూడకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నచందంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

Publish Date: Apr 4, 2026 11:49AM

political-news-img

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మండుగురు మరణించారు. నాసిక్ జిల్లా దిండోరి తాలూకాకు చెందిన దర్గోడే కుటుంబం శివాజీనగర్‌ ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం శుక్రవారం (ఏప్రిల్ 3) శుక్రవారం రాత్రి మారుతి ఎక్స్‌ఎల్ కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన నీటితో బావిలోకి దూసుకెళ్లింది. రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో చిన్నపిల్లలే ఎక్కువమంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.

Publish Date: Apr 4, 2026 11:09AM

political-news-img

ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్

ఇరాన్ గగనతలంలో ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామన్న ఆయన యుద్ధంలో యుద్ధ విమానాలకు నష్టం జరగడం అన్నది సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఈ విమానాలు కూలిపోయిన సంఘటనలు శాంతి చర్చలకు ఎలాంటి ఆటంకం కాబోవని ట్రంప్ అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. ఇరాన్‌తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. మధ్యప్రాచ్యంలో శుక్రవారం (ఏప్రిల్ 3) ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది. పదే పదే శాంతి చర్చల జపం చేస్తున్నది. ఇరాన్ నిర్ద్వంద్వంగా నో అంటున్నప్పటికీ బాబ్బాబు కాల్పుల విరమణ ఒప్పందానికి రండి అంటూ బతిమలాడుకుంటున్నట్లుగా అమెరికా తీరు ఉందని యుద్ధ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. తొలుత అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ అనే అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విమానంలో ని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని సహాయక బృందాలు కాపాడాయి. రెండో పైలట్ కోసం గాలింపు జరుగుతోంది. అతడిని ప్రాణాలతో పట్టుకుని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఇరాన్ మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది. అయితే అమెరికా మాత్రం రెండో యుద్ధ విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమంటున్నది. రెండో విమానం కూలిపోయిన ఘటనలో ఆ విమాన సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరాలేదు. కాగా ఒకే రోజు రెండు అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగినట్లైంది. ఈ విమానాల కూల్చివేతకు ప్రతిగా అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుంది, అమెరికా దుడులకు ఇరాన్ ఎలా బదులిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఘ నెలకొంది.

Publish Date: Apr 4, 2026 10:55AM

political-news-img

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాన్ని తమ గగనతలంలో కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలో విమానం నుంచి పారాచూట్ ద్వారా బయటపడిన అమెరికా పైలట్‌ను పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఏకంగా భారీ రివార్డును ప్రకటించింది. శత్రు దేశ పైలట్‌ను సజీవంగా బందీగా పట్టుకుని భద్రతా దళాలకు అప్పగిస్తే భారీ మొత్తంలో నగదు బహుమతి ఇస్తామని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. ఇక ఈ కూల్చివేత ఘటనలో ప్రాణాలతో బయటపడిన అమెరికన్ పైలట్లను సజీవంగా బంధించేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. పైలట్ ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. సుమారు 60,000 డాలర్లు, భారత కరెన్సీలో 50 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు, ఈ ఘటనపై అమెరికా వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విమానం కూలిపోయిన మాట వాస్తవమేనని, తమ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఒక పైలట్‌ను క్షేమంగా రక్షించాయనీ పేర్కొంది. రెండో పైలట్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదనీ గాలింపు సాగుతోందనీ తెలిపింది.

Publish Date: Apr 4, 2026 10:35AM

political-news-img

ఏపీలో చండ్ర నిప్పులు.. వడగాల్పులు

ఆంధ్రప్రదేశ్లో భానుడు చండ్రప్రచండుడిగా మారి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది. ముఖ్యంగా శనివారం (ఏప్రిల్ 4) రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది. ఉత్తర కోస్తా, మన్యం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. విజయనగరంలో 24, శ్రీకాకుళంలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే పోలవరం పరిధిలో 9, అల్లూరి జిల్లాలో 3, కాకినాడలో 3, అనకాపల్లిలో 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలంలో కూడా ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం సాధారణానికి మించి ఉంటుందని రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది. ఇక ఆదివారం ( ఏప్రిల్ 5) పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇకపోతే శుక్రవారం (ఏప్రిల్ 3) పార్వతీపురం జిల్లాలోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యింది. అలాగే.. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Publish Date: Apr 4, 2026 10:18AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img