political-news-img

విత్తనాల నుంచి పంట కొనుగోళ్ల వరకు ప్రత్యేక ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట సాగు ప్రారంభమైనప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల రికార్డుల నిర్వహణ, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశపై వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలు, రైతులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, రైతు కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిపుణులు ఇచ్చిన సూచనలను సమావేశంలో చర్చించారు. వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఉన్నతాధికారుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రణాళిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలను ఈ కమిటీ నిరంతరం పరిశీలిస్తుంది. ప్రతి గ్రామంలో రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలను క్షేత్రస్థాయి పరిశీలనతో ఖచ్చితంగా నమోదు చేయాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాల మేరకు పంటల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ అందిస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు వేదికల ద్వారానే ఈ విత్తనాల పంపిణీ జరగాలని పేర్కొన్నారు. సన్న వడ్లు సాగు చేసే రైతుల పూర్తి డేటాను సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సమగ్ర సమాచారం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రైతు వేదికలను రైతులకు ఉపయోగపడే సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని, వాటి పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతికతను అనుసంధానం చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి, రైతులకు ప్రయోజనకరంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని, ఈ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో అత్యధిక వాటా తెలంగాణకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరాలని సూచించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టాలను తగ్గించగలిగామని తెలిపారు. గతంలో టన్ను మొక్కజొన్నను రూ.13 వేలకే విక్రయించాల్సి వచ్చేదని, ఈసారి టెండర్లలో టన్నుకు రూ.21 వేలకుపైగా ధర లభించిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల బాటలో నడిపించాలని, ప్రభుత్వ డెయిరీ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలని సూచించారు. పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Publish Date: Jun 16, 2026 5:35PM

political-news-img

వైసీపీకి మెటా షాక్.. వెనుక నిజాలివే!

తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలను మెటా బ్లాక్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం, మెటా యాజమాన్యానికి ఆయన 'ఎక్స్' వేదికగా ట్యాగ్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులలో అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలపై తాము సాక్ష్యాలతో నిలదీస్తుంటే తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. అయితే.. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రంగా ఖండించారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు. ఈ పరీక్షల కోసం టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నలతో కూడిన భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ఆన్‌లైన్ విధానంలో ఉపయోగించారని, దీనివల్ల పేపర్ లీక్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా విపక్షం తప్పుడు ప్రచారం ఆపలేదన్నారు. అంతేకాకుండా.. మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య అనే వ్యక్తి ద్వారా ఒక నకిలీ ఆడియో క్లిప్‌ను సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని టీడీపీ ఆధారాలతో సహా మెటా సంస్థకు ఫిర్యాదు చేసింది. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తులను సైతం దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర వారిదని, అందుకే అప్పట్లో హైకోర్టు ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించిందని అప్పసాని రాజేష్ గుర్తుచేశారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రులపై మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకరంగా ప్రచారం చేస్తూ, దానిని భావప్రకటన స్వేచ్ఛగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ ఇదే ధోరణి సాగితే అబద్ధాలను ప్రచారం చేసే సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ను కూడా నియంత్రించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ బ్లాక్ అనేది ప్రజాస్వామ్య అణచివేత కాదని, ఫేక్ న్యూస్ నెట్‌వర్క్‌పై మెటా తీసుకున్న చట్టపరమైన చర్య మాత్రమేనని ఆయన చెప్పారు. అయినా మెటా ఫిర్యాదు చేయగానే బ్లాక్ చేయదనీ, నిజానిజాలను నిర్ధారించుకుని వైసీపీకి నోటీసులు పంపించిన తరువాత కూడా అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం వల్లే మెటా చర్య తీసుకుందన్నారు.

Publish Date: Jun 16, 2026 5:33PM

political-news-img

సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు షెడ్యూల్ ఖరారు

సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అందజేసి, జాతర నిర్వహణ ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రజల విశ్వాసం, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన జాతరలలో ఒకటిగా పరిగణించబడతాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తరలివస్తారు. 2026 షెడ్యూల్ ప్రకారం జూలై 19న అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని సంప్రదాయంగా ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు, శాంతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహిళా భక్తులు సంప్రదాయంగా బోనం (అమ్మవారికి నైవేద్యం) తీసుకుని ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఆలయం మొత్తం భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది. తరువాత ఆగస్టు 3న రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమం బోనాల జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావించబడుతుంది. ఇందులో భవిష్యవాణి చెప్పే ఆచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదే రోజు ఉదయం 10.30 గంటలకు అమ్మవారి గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆలయ వీధుల్లో ఘనంగా సాగే ఈ ఊరేగింపును చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రితో కలిసి అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రవాణా, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద 2026 సికింద్రాబాద్ మహంకాళి బోనాలు మరోసారి భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.

Publish Date: Jun 16, 2026 5:15PM

political-news-img

జులై మూడో వారంలో తల్లికి వందనం : మంత్రి లోకేష్

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైనా సమావేశంలో చర్చించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష రాష్ట్రంలో ఎప్ సెట్, పాలిసెట్, ఆర్ సెట్ వంటి 12రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను కూడా గమనంలోకి తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్ ల తేదీలను ఖరారు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88లక్షల సీట్ల భర్తీకి గాను ఎప్ సెట్ నోటిఫికేషన్ కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్ బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి సమీక్షించారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ను వేగవంతం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలు, శిక్షణ, క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్‌సీసీ (NCC) స్టేట్ డైరెక్టరేట్‌'ను మంజూరు చేసిన కేంద్రప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్‌సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జే.శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్య కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Publish Date: Jun 16, 2026 5:00PM

political-news-img

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. గోవా కేంద్రంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మాదకద్రవ్యాల ముఠాపై చేపట్టిన మెగా ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారులు అరెస్ట్ అయ్యారు. వీరిలో 14 మందికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ నెట్‌వర్క్ బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ పిల్స్, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తు పదార్థాలను గోవాకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఒడిశా నుంచి హాష్ ఆయిల్‌ను తెప్పించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాలోని వాగటర్ బీచ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌ను లీజుకు తీసుకుని దాన్ని డ్రగ్స్ నిల్వ కేంద్రంగా మరియు పంపిణీ హబ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు చక్రి హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు కొకైన్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అతనితో పాటు హర్షిత్ రెడ్డి మరియు సుశీల్ కృష్ణ ఈ మొత్తం నెట్‌వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. టెక్నికల్ విశ్లేషణ ఆధారంగా సుమారు 44 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించగా, వారిపై ఏకకాలంలో 15 ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 19 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. డ్రగ్ పరీక్షల్లో 14 మందికి THC, METH ప్రభావం ఉన్నట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో తన్నీరు వెంకట్రావు, గంటి భరత్, మురళీకృష్ణ సుశీల్, యశ్వంత్ సాయి, కొప్పుల నాగరాజు, కె. వంశీధర్ రెడ్డి, సిగుర్ల అరుణ్ కుమార్, గింజుపల్లి సందీప్, టి. సాత్విక్ రెడ్డి, కె. సందీప్ రెడ్డి, మ్యాకల ప్రవీణ్, చితమడక అభిలాష్, పడాల క్రాంతి సాగర్, పరిటాల రోహిత్ ఉన్నారు. విచారణలో వీరంతా చక్రాపాణి, హర్షిత్ రెడ్డిల వద్ద నుంచే గంజాయి సహా ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా చక్రాపాణి ఖాతాకు రూ. 1,46,950, హర్షిత్ రెడ్డి ఖాతాకు రూ. 1,66,150 బదిలీ చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Publish Date: Jun 16, 2026 4:45PM

political-news-img

డీలిమిటేషన్ సెగ: చంద్రబాబుకు తలనొప్పేనా?

తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్ )బిల్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో 543 స్థానాలను మరో 9 శాతం పెంచాలని చేసిన సిఫారసులే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో 2009లో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియలో కేవలం నియోజక వర్గాల సరిహద్దులను మాత్రమే మార్చారు.. సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈసారి సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. విచిత్రం ఏంటంటే, ఈ విభజన అంతా జనాభా ప్రాతిపదికన సమపాళ్లలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాకెట్లను మాత్రమే టార్గెట్ చేస్తూ పునర్విభజన చేసేలా ఆర్థిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా సీట్లు పెరగవు. ఇదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. ఈ సిఫారసుల వల్ల కోస్తా తీర ప్రాంతాలైన విజయవాడ, ఏలూరు వంటి బలమైన కేంద్రాల్లో స్థానాలు పెరగడం లేదు. కానీ వైసీపీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఏకంగా 10 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, అనంతపురం వంటి ఐదు కీలక పార్లమెంట్ నియోజక వర్గాలను ఒక్కొక్కదానిని మూడు మూడు నియోజక వర్గాలుగా విస్తరించాలని చూస్తున్నారు. కేవలం హిందూపూర్‌ను మాత్రమే ఇందులో వదిలేశారు. వైసిపి బలహీనపడిందని భావిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి పట్టున్న ప్రాంతంలో ఇలా సీట్లు పెరగడం భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డికి కలిసివచ్చే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యక్రమమేనని సీనియర్ జర్నలిస్టులు వీవీ రావు, గోపి విశ్లేషించారు. ఇటు తెలంగాణలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో అత్యంత ధనిక ప్రాంతాలైన చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాలను రెండు లేదా మూడుగా విభజించే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ( ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విభజన ద్వారా భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు అవసరం లేకుండా, ఒంటరిగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనేది బిజెపి అసలు వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో మహిళా బిల్లు సమయంలో నియోజక వర్గాల పెంపు కోసం విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ స్వరాష్ట్రంలో ఇలాంటి అసమానతలతో కూడిన విభజన ప్రతిపాదన వస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సరిహద్దుల మార్పు రాజకీయం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.

Publish Date: Jun 16, 2026 4:42PM

MOVIE NEWS