కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!
Publish Date:Jul 30, 2026
Advertisement
రాష్ట్రంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే 2019 - 24 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం.. కుప్పం నియోజకవర్గంలో పాగా వేసి 2024 ఎన్నికలలో విజయం కోసం వ్యూహాలు రచించింది. ఆ క్రమంలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేం పార్టీ పరాజయం పాలయ్యేలా చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు అప్పట్లో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిస్థితిని చక్కదిద్దారు. 2024 ఎన్నికలలో కుప్పం నుంచే విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు. కుప్పం తన తాజా పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు సమావేశాల్లో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, ప్రాజెక్టుల పురోగతిని దెబ్బతీసిన విధానాలను ఆమె కుప్పం ప్రజల కళ్లకుకట్టినట్లు వివరించారు. జగన్ పాలనలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధిస్తున్న అభివృద్ధిని స్పష్టంగా గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు ముఖ్యమంత్రి సతీమణి స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి నియోజకవర్గ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం స్థానిక ప్రజలలో, నాయకులలో జోష్ ను నింపింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగకుండా శ్రమిస్తూ.. నియోజకవర్గానికి క్రమం తప్పకుండా రాలేకపోయినప్పటికీ, కుప్పం ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారనే భావన భువనేశ్వరి పర్యటనలతో స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతోంది. భువనేశ్వరి చొరవతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొనడమే కాకుండా, స్థానిక సమస్యలను నేరుగా సీఎం దృష్టికి నేరుగా తీసుకెడుతున్నారని జనం భావిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్న తీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలలో సానుకూలత ఏర్పడేందుకు దోహదపడుతోంది. మొత్తానికి, కుప్పం నియోజకవర్గానికి తన భర్త అందిస్తున్న సుదీర్ఘ సేవలకు మద్దతుగా నారా భువనేశ్వరి తీసుకుంటున్న శ్రద్ధ, చూపిస్తున్న చొరవ రాబోయే రోజుల్లో కుప్పం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందనడంలో సందేహం లేదు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయడం ద్వారా కుప్పం ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామనే స్పష్టమైన సంకేతాన్ని నారా కుటుంబం అందించింది. Bhuvaneswari assures the people of Kuppam, Chandrababu Naidu Kuppam Constituency, TDP Kuppam, Andhra Pradesh, TeluguOne News
http://www.teluguone.com/news/content/bhuvaneswari-assures-the-people-of-kuppam-45-227546.html




