విద్యారంగంపై ప్రత్యేక దృష్టి.. బాధ్యతగా ఉపాధ్యాయ నియామకాలు.!
Publish Date:Aug 17, 2026
Advertisement
ఏపీలో విద్యా రంగం అభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నిర్వహణ, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై సభలో ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 148 రోజుల రికార్డు సమయంలోనే డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామన్న లోకేష్.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలనే లక్ష్యంతో సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల గురించి కూడా ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సభకు వివరించారు. ఈ నియామకాలపై వివిధ కోర్టుల్లో 336 కేసులు నమోదైనప్పటికీ, న్యాయస్థానాల ఉత్తర్వులకు ఏమాత్రం భంగం కలగకుండా చూశామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీ నియామకాలలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాలను నిర్దుష్టంగా అమలు చేసి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేశామని పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) గణాంకాలను మంత్రి అసెంబ్లీ ముందుంచారు. టెట్ కోసం మొత్తం 3.68 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 1.87 లక్షల మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాలు నిరుద్యోగ అభ్యర్థుల్లో పెరిగిన నైపుణ్యాన్ని, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ తీరును ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. నిరుద్యోగ యువత సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ.. ఇకపై రాష్ట్రంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ ప్రకటనలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. AP DSC News, Nara Lokesh Assembly Speech, AP Teacher Recruitment, AP Education Reforms, Annual DSC Notification AP
వైసీపీ హయాంలో ఉపాధ్యాయులకు జరిగిన అవమానాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్ హయాంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని దిగజార్చేలా వారిని మద్యం దుకాణాల వద్ద కాపలాదారులుగా నిలబెట్టారనీ, అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ప్రభుత్వంలో వ్యవస్థను ప్రశ్నించే స్వేచ్ఛతో పాటు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, గౌరవాన్ని అందిస్తున్నామని నారా లోకేశ్ సభా ముఖంగా చెప్పారు.
http://www.teluguone.com/news/content/ap-dsc-news-36-229079.html





