రైతన్నకు ఎంతకష్టం.. ఎంతకష్టం!?
అన్నదాత సుఖీభవ అంటారు. కానీ పరిస్థితి చూస్తుంటే.. అన్నదాతా దుఖీభవలా మారిపోయింది. తెలంగాణలో వ్యవసాయ పరంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు రేవంత్ సర్కార్ కి సవాలుగా మారాయి. ఒకవైపు అసాధారణమైన ఎండలు.. మరోవైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ఎదురవుతున్న సాంకేతిక, రాజకీయ అడ్డంకులు రైతులను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల అవస్థలను చూడాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. మే 4 లోపు కొనుగోలు వేగవంతం కాకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొక్కజొన్న పండించిన రైతులు ఈసారి తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ. 2,400 కాగా.. మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.1,600 - రూ.1,800 కే కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా మొక్కజొన్న ఉత్పత్తి పెరగడం, దిగుమతుల వల్ల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని క్వింటాల్కు తగిన మద్ధతు ధర అందించాలని రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తెలంగాణను ప్రస్తుతం హీట్ వేవ్ వణికిస్తోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి ఎకరాల కొద్దీ మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటనలు వెలుగుచూశాయి. ధాన్యం ఆరబోయడానికి టార్పాలిన్ పట్టాలు లేకపోవడం.. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస మంచినీటి సౌకర్యం, నీడ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గత వారం జరిగిన ఆర్టీసీ సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కొంత స్తంభించింది. సమ్మె విరమించినప్పటికీ, దాని ప్రభావం వల్ల ధాన్యం తరలింపులో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం 6,500 లారీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ధాన్యం మిల్లులకు చేరడంలో ఇంకా ఇబ్బందులున్నాయి. సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. మొక్కజొన్న కొనుగోలు కోసం కేంద్రం నుంచి రూ.4 వేల కోట్ల సహాయం కోరినట్టుగానూ చెబుతున్నారు ప్రభుత్వ ప్రతినిథులు. మే 4న తమిళనాడు, కేరళ ఫలితాల తర్వాత రాజకీయంగా మార్పులు జరిగే అవకాశం ఉంది, అంతలోపే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఎప్పటికి ఒక కొలిక్కి వస్తాయో చూడాలి.
Publish Date: May 1, 2026 11:38AM