political-news-img

ఏపీ విద్యారంగంలో లోకేష్ ముద్ర.. టెన్త్ ఫలితాలతో తేలిన వాస్తవం

తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తాను దృష్టిపెట్టిన, చేపట్టిన అన్ని అంశాలలోనూ అద్భుత ఫలితాలు రాబడుతున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే తనకంటూ ఓ బెంచ్ మార్క్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లోకేష్.. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా అద్భుత విజయాన్ని సాధించారు. గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాలలో సక్సెస్ శాతం లోకేష్ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సాధించిన విజయానికి అద్దం పట్టింది. 2024లోతెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతలు చేపట్టారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఐటీ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి శాఖలనూ పర్యవేక్షిస్తూ.. ఆ దిశగా అనితరసాధ్యమన్న విజయాలను సాధిస్తూనే.. విద్యా శాఖపై కూడా లోకేస్ తనదైన ముద్ర వేశారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి ఉత్తీర్ణత గణనీయంగా పెరగడం విశేషం. విద్యాశాఖలో లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన అడుగులు ఈ విజయానికి ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,18,131 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 5,26,954 మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా బాలికలు 87.90 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఈ అద్భుత ఫలితాలు రావడం వెనుక మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి ఉంది. మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం.. తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరులో కూడా గణనీయమైన మార్పు తీసుకువచ్చారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం లోకేష్ పర్యవేక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. మిగిలిన చోట్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర ప్రగతికి పెట్టుబడుల సాధన ఎంత ముఖ్యమో, విద్యార్థుల విజయం అంతకంటే ముఖ్యమని లోకేష్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ టీమ్‌ను అభినందించారు. విద్యాశాఖలో సాంకేతికతను జోడించడం.. ఎప్పటికప్పుడు డేటా ఆధారిత పర్యవేక్షణ చేయడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. టెన్త్ ఫలితాలు ఏపీ విద్యారంగంలో లోకేష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపించేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: May 1, 2026 12:46PM

political-news-img

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం (మే1) ఉదమం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో పరిమితికి మించిన ప్రయాణీకులు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీ సులు దర్యాప్తు చేపట్టారు.

Publish Date: May 1, 2026 12:22PM

political-news-img

చాట్ జీపీటీ ద్వారా ట్రాన్సఫర్ ఆర్డర్.. ఉద్యోగినిని మోసం చేసిన కేటుగాళ్లు

సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దానిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య అంతకు మించిన వేగంతో పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది.ఏఐ సాధనమైన చాట్ జీపీటీని ఉపయోగించి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను సృష్టించి, ఒక ఉద్యోగిని మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ కడప జిల్లా గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇంటికి దూరంగా పని చేయడం ఇబ్బందిగా మారడంతో.. ఆమె తన స్వగ్రామానికి సమీపంలోని తనకల్లుకు బదిలీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర తనకు తెలిసిన పలక వేణు అనే వ్యక్తిని సంప్రదించారు. దీనిని అవకాశంగా తీసుకున్న వేణు.. తన కుమారుడు గంగాద్రితో కలిసి రమణమ్మను మోసం చేసేందుకు భారీ స్కెచ్ వేశారు. నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు. చూడటానికి అసలైన ప్రభుత్వ ఆర్డర్ లాగే ఉన్న ఆ నకిలీ కాపీని జయచంద్రకు అందజేసి.. అతడి నుంచి భారీగా సొమ్ములాగేందుకు ప్రయత్నించారు. ఒక ఆ నకిలీ ఉత్తర్వులను పట్టుకుని రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. అక్కడ ఉన్న వైద్యాధికారులు ఆ ఉత్తర్వులను పరిశీలించి, అవి శాఖాపరంగా జారీ చేసినవి కావని తేల్చారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, చాట్ జీపీటీ ద్వారా ఈ నకిలీ కాపీని సృష్టించినట్లు నిర్ధారించి నిందితులు వేణు, గంగాద్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. బదిలీలు లేదా ఇతర అధికారిక పనుల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దనీ.. కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా ఉన్నతాధికారుల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Publish Date: May 1, 2026 12:04PM

political-news-img

రైత‌న్న‌కు ఎంతకష్టం.. ఎంతకష్టం!?

అన్న‌దాత సుఖీభ‌వ అంటారు. కానీ పరిస్థితి చూస్తుంటే.. అన్నదాతా దుఖీభ‌వ‌లా మారిపోయింది. తెలంగాణలో వ్య‌వ‌సాయ ప‌రంగా నెలకొన్న ప్ర‌స్తుత‌ పరిస్థితులు రేవంత్ స‌ర్కార్ కి సవాలుగా మారాయి. ఒకవైపు అసాధారణమైన ఎండలు.. మరోవైపు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ఎదురవుతున్న సాంకేతిక, రాజకీయ అడ్డంకులు రైతులను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల‌ ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల అవస్థలను చూడాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హరీష్ రావు. మే 4 లోపు కొనుగోలు వేగవంతం కాకపోతే ఆందోళనలు తీవ్ర‌త‌రం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొక్కజొన్న పండించిన రైతులు ఈసారి తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ. 2,400 కాగా.. మార్కెట్‌లో వ్యాపారులు కేవలం రూ.1,600 - రూ.1,800 కే కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా మొక్కజొన్న ఉత్పత్తి పెరగడం, దిగుమతుల వల్ల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని క్వింటాల్‌కు త‌గిన మ‌ద్ధ‌తు ధ‌ర‌ అందించాలని రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తెలంగాణను ప్రస్తుతం హీట్ వేవ్ వణికిస్తోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి ఎకరాల కొద్దీ మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటనలు వెలుగుచూశాయి. ధాన్యం ఆరబోయడానికి టార్పాలిన్ పట్టాలు లేకపోవడం.. కొనుగోలు కేంద్రాల ద‌గ్గ‌ర‌ కనీస మంచినీటి సౌకర్యం, నీడ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గత వారం జరిగిన ఆర్టీసీ సమ్మె వల్ల రవాణా వ్యవస్థ కొంత స్తంభించింది. సమ్మె విరమించినప్పటికీ, దాని ప్రభావం వల్ల ధాన్యం తరలింపులో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం 6,500 లారీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ధాన్యం మిల్లులకు చేరడంలో ఇంకా ఇబ్బందులున్నాయి. సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. మొక్కజొన్న కొనుగోలు కోసం కేంద్రం నుంచి రూ.4 వేల‌ కోట్ల సహాయం కోరిన‌ట్టుగానూ చెబుతున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. మే 4న తమిళనాడు, కేరళ ఫలితాల తర్వాత రాజకీయంగా మార్పులు జరిగే అవకాశం ఉంది, అంతలోపే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఎప్పటికి ఒక కొలిక్కి వస్తాయో చూడాలి.

Publish Date: May 1, 2026 11:38AM

political-news-img

విశాఖ ఉక్కుకు రూ. 8,097 కోట్ల ఊతం!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు, ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ ప్యాకేజీలో భాగంగా 3,500 కోట్ల రూపాయలు తక్షణ వర్కింగ్ క్యాపిటల్ కింద కేటాయించనున్నారు. దీనివల్ల ప్లాంట్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు కొనుగోలు, ఇతర రోజువారీ ఖర్చులకు మార్గం సుగమం అవుతుంది. మిగిలిన నిధులను ప్లాంట్ ఆధునీకరణ, పాత బకాయిల చెల్లింపుల కోసం వినియోగించే అవకాశం ఉంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ప్రాథమిక అనుమతులు మంజూరు చేశాయి. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సరైన పెట్టుబడి లేకపోవడం, ముడి సరుకు వ్యయం పెరగడం, అప్పుల భారం వల్ల ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్‌లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌ను కాపాడాలని కేంద్రాన్ని పదేపదే కోరుతూ వస్తున్నాయి. తాజా ఆర్థిక ప్యాకేజీ ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక మద్దతు కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా, ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధుల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, మార్కెట్లో ఉక్కు అమ్మకాలను మెరుగుపరచడం ద్వారా ప్లాంట్ స్వయంశక్తితో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Publish Date: May 1, 2026 11:27AM

political-news-img

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మేడే విషెస్

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని పేర్కొన్నారు. కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులే దేశానికి అన్నదాతలని, వారి శ్రేయస్సు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మెరుగైన ధరలు, సాగుకు అవసరమైన మద్దతు, ఆధునిక సాంకేతికత అందించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతి కార్మికుడి జీవన ప్రమాణం మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Publish Date: May 1, 2026 11:12AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img