Top Stories

dummy

political-news-img

శాంతి యత్నాలకు మోకాలడ్డుతున్న పాకిస్ధాన్!?

మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ మోకాలడ్డుతోందా? అంటే అంతర్జాతీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. మధ్య ప్రయత్నంలో శాంతి యత్నాలకు పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యలు గొడ్డలి పెట్టులా మారాయంటున్నారు. పాక్ రక్షణ మంత్రి తాజాగా ఇజ్రాయెల్ దేశంపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఆ దేశాన్ని మానవాళికి శాపంగా మారిన దేశంగా అభివర్ణించారు. ఇప్పుడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ పెను దుమారం రేపుతున్నాయి. ఇవిఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూనే ఇజ్రాయెల్ పాక్ నమ్మదగిన దేశం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ పై తన దాడులను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలవి. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఒకింత అతిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ తో పోల్చారు. పాలస్తీనా గడ్డపై ఈ దేశాన్ని సృష్టించిన వారు నరకయాతన అనుభవించాలని శాపనార్ధాలు పెట్టారు. గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తోందని, జాతి నిర్మూలనకు పాల్పడు తోందంటూ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఇజ్రాయెల్ ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకునేలా పాకిస్థాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలను తాము సహించబోమనీ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఘాటుగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశం నుంచి ఇలాంటి ద్వేషపూరిత మాటలు దారుణమని పేర్కొంది. అదలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన తరుణంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశాన్ని దౌత్యపరంగా ఇబ్బందుల్లో పడేశాయి. దీనిని పాకిస్థాన్ ఎలా అధిగమిస్తుంది, తమ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటుందన్నది వేచి చూడాలి.

Publish Date: Apr 10, 2026 11:30AM

political-news-img

పాకిస్తాన్ వైఖరి.. ప్రాంతీయ ఉద్రిక్తతలు.. పెళుసైన కాల్పుల విరమణ

సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్‌కు సంబంధించిన వరుస పరిణామాలు ప్రాంతీయ భద్రతా వాతావరణం యొక్క సంక్లిష్టత పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనంగా ఉండగా, మాటల యుద్ధం మరియు సైనిక చర్యలు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై సందేహాలుకొనసాగుతున్న సంఘర్షణలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం అంతర్జాతీయ పరిశీలకుల నుండి విమర్శనాత్మక వ్యాఖ్యలను ఎదుర్కొంది. అమెరికా యుద్ధ నిపుణుడు డగ్లస్ మాక్‌గ్రెగర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను "మంటల్లో కాలిపోతున్న భవనంలో ఉన్న వ్యక్తి మీకు ఖాళీ గదిని ఇస్తానని చెప్పడం"తో పోలుస్తూ వర్ణించారు. ఇది అత్యంత అస్థిరమైన వాతావరణంలో ఫలితాలను ప్రభావితం చేయడంలో దాని విశ్వసనీయత మరియు సామర్థ్యం పరిమితంగా ఉన్నాయని సూచిస్తుంది. పాకిస్తాన్ వ్యూహాత్మక సందేశం మరియు ప్రాంతీయ వైఖరి.. అదే సమయంలో, ఖవాజా ఆసిఫ్ బహిరంగ ప్రకటనలలో మరింత దృఢమైన వైఖరిని తీసుకున్నారు. విశాల ముస్లిం ప్రపంచం తమ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాలని ఆయన కోరారు. భారత్, ఇజ్రాయెల్‌లను దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రత్యర్థులుగా గుర్తించారు. ముస్లిం ప్రపంచంలో నాయకత్వ పాత్ర పోషించడానికి పాకిస్తాన్ సుముఖతను సూచించారు. ఈ ప్రకటనలు పాకిస్తాన్ ప్రాంతీయ కథనాన్ని పునర్నిర్వచించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, అవి పెరిగిన భౌగోళిక రాజకీయ ధ్రువీకరణకు కూడా దోహదపడవచ్చు. ఇజ్రాయెల్-లెబనాన్ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితి మరింత దిగజారింది. తిరిగి చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్‌పై కొత్తగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో 180 మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి, ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశంపై ఆందోళనలను పెంచుతోంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాలపై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై ఒత్తిడి.. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న పెళుసైన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే అస్థిరత సంకేతాలను చూపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనల ఉల్లంఘనలను పాకిస్తాన్ ప్రధానమంత్రి బహిరంగంగా ఎత్తి చూపారు. ఈ ఒప్పందం విఫలమవడానికి ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఇరాన్ ఆరోపించడంతో, దౌత్య ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. పరిస్థితి వేగంగా క్షీణించడం అనేది కీలక భాగస్వాముల మధ్య నమ్మకం, సమన్వయం కొరవడటాన్ని స్పష్టం చేస్తోంది. విస్తృత, వ్యూహాత్మక పరిణామాలు.. ఈ పరిణామాలు సమిష్టిగా ఒక బహుముఖ ప్రాంతీయ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ముస్లిం ప్రపంచంలో పరస్పర విరుద్ధమైన కథనాలు మరియు నాయకత్వ వాదనలు. బహుళ రంగాలలో తీవ్రమవుతున్న సైనిక ఘర్షణలు. నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న బలహీనమైన మరియు పెళుసైన దౌత్య చట్రాలు. పాకిస్తాన్ తన ప్రభావాన్ని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలు, మరియు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కలిసి, ప్రపంచవ్యాప్త పరిణామాలకు దారితీయగల అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముగింపు.. ప్రస్తుత పరిణామాలు ఈ ప్రాంతం మరింత అస్థిరత వైపు పయనిస్తోందని, తక్షణ ఉద్రిక్తతల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. సైనిక ఉద్రిక్తతలు, రాజకీయ వాక్చాతుర్యం, మరియు పెళుసైన దౌత్యం యొక్క పరస్పర చర్య ఈ సంఘర్షణ యొక్క తదుపరి దశను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Publish Date: Apr 10, 2026 11:07AM

political-news-img

ప్రపంచ వాణిజ్యానికి అమెరికా సెక్యూరిటీ కాదు.. హెర్మూజ్ రక్షణ నాటో దేశాలదేనన్న ట్రంప్

నాటో దేశాలపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హెర్మూజ్ జలసంధి రక్షణ విషయంలో నాటో దేశాల తీరును తప్పుబట్టారు. హెర్మూజ్ భద్రత కోసం అమెరికా భారీగా నిధులు వెచ్చిస్తోందనీ, అయితే.. ఆ జల సంధి వల్ల ప్రయోజనం పొందుతున్న నాటో దేశాలు మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా అమెరికా బాధ్యత మోస్తోందన్న అమెరికా అధ్యక్షుడు.. నాటో దేశాల తీరు సరికాదని అన్నారు. ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్‌ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు. గత కొంతకాలంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి భద్రత అంతర్జాతీయ సమస్యగా మారిందన్న ట్రంప్.. నాటో దేశాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. హెర్మూజ్ భద్రత అమెరికా కు కాదనీ, నాటో దేశాలకే ఎక్కువ అవసరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఐరోపా దేశాలు తమ చమురు అవసరాల కోసం ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయనీ.. కాబట్టి ఆయా దేశాలే తమ నౌకలకు రక్షణ కల్పించుకోవాలని అన్నారు. తమ సైన్యం ఉచితంగా ప్రపంచ వాణిజ్యానికి కాపలా కాయడం ఇంకానా ఇకపై ఉండదన్న సంకేతాన్ని ట్రంప్ ఇచ్చారు. ట్రంప్ మాటలను బట్టి ముందు ముందు హెర్మూజ్‌ జలసంధి రక్షణకు సంబంధించి అమెరికా తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ నాటో దేశాలు స్పందించకుండా హెర్మూజ్ ప్రాంతం నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

Publish Date: Apr 10, 2026 10:58AM

political-news-img

ఎవరిని ధ్వంసం చేస్తారు.. పొలిటికల్ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

పొలిటికల్ ఫ్లెక్సీల సంస్కృతి, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలను, వ్యవస్థలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తగదంటూ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు శ్రుతిమించుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ హైకోర్టు మండిపడింది. గతంలో న్యాయమూర్తులను సైతం లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ, అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఒకసారి అరెస్టయిన వారు మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరి కుటుంబ గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని హితవు పలికింది. కేవలం అధికారం కోసం లేదా రాజకీయ కక్ష సాధింపునకు ఇలాంటి అరాచక సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.

Publish Date: Apr 10, 2026 10:41AM

political-news-img

మీడియా సమావేశంలో బొత్స కన్నీరుమున్నీరు

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. మీడియా సమావేశంలోనే వెక్కివెక్కి ఏడ్చారు. తెలుగుదేశం నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు తానే స్వయంగా జగన్ పక్కన ఉండి, ఆయనను ఓదార్చానని చెబుతూ బొత్స కన్నీరుమున్నీరయ్యారు. అచ్చెన్నాయుడు తనపై చేసిన అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న సంతకాల వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని బొత్స ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంగతి రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు తెలుసన్నారు. అచ్చెన్నాయుడు కేవలం తన పదవిని కాపాడుకోవడానికే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్ గురించి అనుచితంగా మాట్లాడటం వల్లే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

Publish Date: Apr 10, 2026 10:27AM

political-news-img

గెలుపు దోబూచులాట.. లక్నో జయింట్స్ దే విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం (ఏప్రిల్ 9) రాత్రి జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ లో విజయం చివరి వరకూ ఇరు జట్లతోనూ దోబూచులాట ఆడింది. అయితే చివరకు లక్నో బ్యాటర్ అద్భుత బ్యాటింగ్ పుణ్యమా అని ఓటమి అంచుల నుంచి గెలుపు బావుటా ఎగుర వేసింది లక్నో జయంట్స్. ఓటమి ఖాయమని పరిస్థితిలో యువ ఆటగాడు ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చి మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ హోరాహోరీ పోరులో లక్నో 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. స్కిప్పర్ అజింక్యా రహానే 41 పరుగులు, రఘువంశి 45 పరుగులతో రాణించారు. చివరిలో రోవ్మన్ పావెల్ 39 పరుగులు సాధించడంతో కోల్ కతా 181 పరుగులు చేయగలిగింది. ఇక 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జయింట్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మార్ష్ 15 పరుగులు, మార్కరమ్ 22 పరుగులు, రిషబ్ పంత్ డకౌట్ తో త్వరగానే ఔటు కావడంతో లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీ సాధించి లక్నోకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే 54 పరుగులు చేసిన బదోనీ కీలక సమయంలో అవుట్ కావడంతో లక్నో జయింట్స్ మళ్లీ కష్టాల్లో పడింది. ఇక గెలుపు అసాధ్యమన్న పరిస్థితిలో పడింది. సరిగ్గా ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చాడు ముకుల్ చౌదరి. ఓటమి అంచుల్లో ఉన్న లక్నో జయింట్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించాడు. చివరి ఓవర్ లో విజయానికి 14 పరుగులు అవసరం అయిన దశలో వైభవ్ ఆరోరా వేసిన ఆ ఓవర్లో ముకుల్ చౌదరి రెండు సిక్సర్లు బాది లక్నోకు విజయాన్ని అందించాడు. ఈ విజయం లక్నో శిబిరంలో ఆనందాన్ని నింపింది. మ్యాచ్ ముగిసిన తరువాత లక్నో జయంట్స్ యజమాని సంజీవ్ గోయెంకా స్వయంగా మైదానంలోకి వచ్చి ముకుల్ చౌదరిని అభినందించాడు. అతని బ్యాటింగ్ ను వేనోళ్ల పొగుడుతూ చాలా సేపు అతడితో ముచ్చటించారు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ముకుల్ చౌదరి క్రికెటర్ అవ్వాలన్నది తన తండ్రి కల అని చెప్పాడు

Publish Date: Apr 10, 2026 10:13AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img