కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క
Publish Date:May 6, 2026
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ దురంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టిఆర్ఎస్ పాలనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మడికట్లలో, నాగేటి సాళ్లలో బీఆర్ఎస్ పాలనను రైతులు పాతరేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ టిఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గకపోవడం దురదృష్టకరమన్నారు. దొర ధోరణితో కేటీఆర్ అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పటికీ, బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, వడ్డీలకే సరిపోని విధంగా నాలుగు విడతల పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేసారని ఆమె తెలిపారు. నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారిని పూర్తిగా రుణ విముక్తులను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంతో, బాధిత కుటుంబాలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిన దుస్థితి ఏర్పడిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మానవత్వంతో ముందుకు వచ్చి, గతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా పరిహారం అందించి వారికి భరోసా కల్పించిందని తెలిపారు. పంటకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని 10 సంవత్సరాల పాటు నెరవేర్చలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు కష్టానికి గౌరవం ఇస్తూ పంటలకు బోనస్ అందిస్తున్నదని మంత్రి వివరించారు. రైతు బంధు నిధుల విడుదలలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కొన్ని సీజన్లలో 5 నుంచి 6 నెలల వరకు ఆలస్యం జరిగిందని, 2018 యాసంగిలో 161 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత వానాకాలంలో కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి తన నిబద్ధతను చాటుకుందని తెలిపారు. ఫామ్హౌస్ పాలనలో భూస్వాములు, వ్యాపారుల ప్రయోజనాలకే బీఆర్ఎస్ పనిచేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కర్షకుల కోసం, పొలాల్లో కష్టపడే రైతుల కోసం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లో, ఫారన్ టూర్లలో తాము కాలయాపన చేయడం లేదని, తాము నాడు నేడు రైతుల వెంటే ఉన్నామని, నిత్యం ప్రజల్లో తిరుగుతున్నామని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిని ఓర్వలేక కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన సొంత నియోజకవర్గంలోని సిరిసిల్ల అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ పావని.. కమిషన్లు లేనిది పనులు కావడం లేదని చేసిన ఆరోపణలు ప్రజలకు తెలిసిందేనని గుర్తుచేశారు. ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి సీతక్క హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/-ktr-36-219089.html





