ఉద్యోగిగా ఉంటూ రాజకీయం...వెంకట్రామిరెడ్డి డిస్మిస్
Publish Date:Apr 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, ఉద్యోగి హోదాలో ఉంటూ రాజకీయ కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, ఆయనను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘం నాయకుడిగా వ్యవహరిస్తూనే, ఒక రాజకీయ పార్టీకి అనధికార ప్రతినిధిగా పనిచేశారనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాల్సిన తటస్థతను విస్మరించి, అధికార పార్టీ అజెండాను అమలు చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేశారని విచారణలో తేలింది. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై అనేక ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి, రాజకీయ ప్రచారంలో పాల్గొనడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించిన అధికారులు, గతంలోనే ఆయనను సస్పెండ్ చేశారు. అయితే, సస్పెన్షన్ కాలంలో కూడా ఆయన తీరు మారలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని తాజా విచారణలో వెల్లడైంది. కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా, ఉద్యోగులను ప్రలోభపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మద్యపాన విందులు ఏర్పాటు చేయడం వంటివి కూడా ఆయనపై ఉన్న ఇతర అభియోగాలు. ఉద్యోగ సంఘం ఎన్నికల ముసుగులో పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తొలగింపు నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయాలకు, ప్రభుత్వ సర్వీసులకు మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖను దాటిన వారికి ఇది ఒక గట్టి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారు రాజకీయాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా బలంగా పంపింది. ప్రస్తుతానికి వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుండి తొలగించినప్పటికీ, ఆయనపై ఉన్న మరిన్ని ఆర్థిక పరమైన ఆరోపణలు, ఇతర అభియోగాలపై లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/-ap-secretariat-36-217825.html





