మీరే తలకొరివి పెట్టాలి.. ఢీ స్టేజ్‌పై చైతన్య మాస్టర్ తల్లి కన్నీళ్లు


బుల్లితెర మీద  ఢీ షో ఎంతలా పేరు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఈ షోతో ఎంతో మంది డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్‌ సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 స్టార్ట్ అయ్యింది. దీనికి శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. గతంలో సదా,పూర్ణ ఈ షోలో జడ్జెస్ గా అలరించి వెళ్లారు.

 ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హన్సిక హోస్ట్ గా చేస్తోంది. శ్రీ సత్య, ఆది కంటెస్టెంట్ల తరుఫున కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి  ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో హన్సిక కన్నీళ్లు పెట్టేసుకుంది. ఈ ప్రోమోలో చైతన్య మాస్టర్ తల్లితండ్రులు రావడంతో ఒక్కసారిగా స్టేజి మీద అంత ఎమోషనల్ ఐపోయారు. చైతన్య పేరెంట్స్ వెంకట సుబ్బారావు, లక్ష్మీ రాజ్యం వచ్చి తన కుమారుడు గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. చైతన్య ఫేమస్ గెటప్ బబ్లీ గెటప్ వేసుకుని చైతన్య  తండ్రి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూడగానే.. శేఖర్ మాస్టర్.. ‘చైతన్య వచ్చాడన్నట్టు అనిపించింది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. అందరూ  చైతన్యను గుర్తు చేసుకున్నారు.  చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాజ్యం కూడా ఎంతో బాధపడింది. ‘వీళ్లంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా..? నన్ను మోస్తారా..? మీరే నన్ను మోయాలి. మీరే తలకొరివి పెట్టాలి. ఇదే నా కోరిక.. ఎందుకంటే నాకు నా కొడుకు లేడు కాబట్టి’ అంటూ ఏడ్చేసారికి పండు ఆమెను ఓదార్చాడు. ఇది చూసి హన్సిక కూడా కన్నీరు పెట్టుకుంది. ఢీ షోతో పాపులర్ ఐన చైతన్య మాస్టర్  గత ఏడాది మేలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అతన్ని మరోసారి తలుచుకున్నారంతా.