తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల మరో విజయసాయేనా?

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని, రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు.అయితే, సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే, వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన చాలా వరకు వైఎస్ కుటుంబంతో కలిసే ప్రయాణం చేశారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి తోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగింది. జగన్ తో ఆయన రాజకీయ సంబంధాలు, మధ్య మధ్యన కొంత ఒడి దుడుకులు, ఎత్తు పల్లాలు ఎదుర్కున్నా, ఎదురైన అవరోధాలను అధిగమించిన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి చేరుకున్నారు. అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని పక్కకు నెట్టి ఆ స్థానాన్ని సజ్జల సొంత చేసుకున్నారు. ఆ  విధంగా ఆయన రాజకీయాల్లో మొదటి గమ్యాన్నిచేరుకున్నారు. నిజానికి ఆయన పేరుకు ముఖ్యమంత్రి సలహాదారే కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలా చాలా ఎక్కువని వైసీపీ శ్రేణులే చెబుతుంటాయి.  అలాగే సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత  ముఖ్య నేతగా చక్రం తిప్పుతున్నారని, ఇంకా స్పష్టంగా చెప్పలంటే డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని అంటారు.  అదలా ఉంటే   ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపధ్యంలో  సజ్జల తిరుగులేని పెత్తనానికి దాదాపుగా చెక్ పడిందన్న వాదన గట్టిగా వినిపించింది. అప్పటి వరకూ సజ్జలపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని బయటకు చెప్పేందుకు జంకిన నేతలు ఇప్పుడు ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.  సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంటలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు  అంటున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలే, ఇదే స్థాయి అసంతృప్తే   జగన్   మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా వెల్లువెత్తింది.   ముఖ్యంగా బాలినేని వంటి వారు నేరుగా సజ్జలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో బాలినేనిని బుజ్జగించడానికి స్వయంగా రంగంలోకి దిగిన సజ్జల ఆ విషయంలో విఫలమై వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ జోక్యంతో బాలినేని కొంత మొత్త పడినా.. సజ్జలపై అప్పట్లో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి మాత్రం నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నివురు తొలగిపోతోందన్న సంకేతాలు బలంగా కనిపించాయి. అయితే  ఆ ఫలితాల అనంతరం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హతలో అసమ్మతి గళం బహిర్గతం కాకుండా ఒకింత నెమ్మదించడానికి కారణమైంది. అయితే ఆ సమయంలో  ఇంకా చాలా మందిలో అసమ్మతి గూడు కట్టుకుని ఉందన్న వార్తలు వెల్లువెత్తిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.  ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే,తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్  గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే  ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. చేశారు. అలాగే, సస్పెన్షన్ వెతుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి కూడా సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తల దాచుకుంటున్న ఆమె ఏపీకి వెళ్ళాలంటే, సజ్జల ఏమి చేస్తారో అనే భయమేస్తోందని, అన్నారు.  నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని, అయితే ఎందుకనో వాటిని అంతగా పట్టించుకోలేదని అంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తునం సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. జగన్ నేరుగా దిగి బుజ్జగించకుండా ఉన్నట్లైతే ఇప్పటికే పార్టీలో సజ్జలపై భారీ స్థాయిలో తిరుగుబాటు జరిగి ఉండేదని కూడా పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.   జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు,  వైఎస్ రాజశేఖర రెడ్డి ‘ఆత్మ’మిత్రులు,  వైఎస్’కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా  వైసీపీలో సజ్జలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులకు దన్నుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల హవా ఒకింత తగ్గిందని కూడా పరిశీలకులు అంటున్నారు.  జగన్ రెడ్డి కూడా  సజ్జలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనీ, త్వరలోనే సజ్జల పాత్ర కూడా పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి పాత్రలా నామమాత్రం అయిపోయినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి, 
Publish Date: Jun 5, 2023 5:50PM

మల్లారెడ్డికి టికెట్ కట్? 

బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ అవినీతిపరులకు టికెట్ కట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ కట్ అయ్యే వారి జాబితాలో మల్లారెడ్డి ముందువరసలో ఉన్నట్లు సమాచారం.  పాలమ్మినా నీళ్లమ్మినా అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మంత్రి మల్లారెడ్డికి  వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు పెద్ద సార్ కు ఉప్పందడం మల్లారెడ్డికి టికెట్ రాకపోవచ్చని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మల్లారెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కనుందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మేడ్చెల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కల్సి ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్థానిక ప్రజలు సైతం మంత్రి మల్లారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ తెప్పించుకున్న రిపోర్టులో మల్లా రెడ్డిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. మల్లారెడ్డి అనుచరులకే కార్పోరేషన్ చైర్మన్ పదవులు దక్కుతున్నాయని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మేడ్చెల్ జిల్లా క్యాడర్ బిఆర్ఎస్ కు దూరం కావడం బిఆర్ ఎస్ అధినేతకు కోపం తెప్పించినట్లు సమాచారం. మరో వైపు ప్రజల నుంచి ఫిర్యాదులను కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మల్లారెడ్డి నాయకత్వాన్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి అనుచరురాలు ఏకంగా స్విమ్మింగ్ ఫూల్ కట్టుకోవడం కేసీఆర్ కు రుచించలేదు. చెత్త కుండి స్థలాన్ని సైతం మల్లారెడ్డి వర్గీయులు  కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలె కేసీఆర్ బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ అని ప్రకటించిన కొద్ది రోజుల్లో మల్లారెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. . 
Publish Date: Jun 5, 2023 5:37PM

కమలంతో కలిసినందుకే మజ్లిస్ దూరమైంది

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పని తీరు మీద చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్ర పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారాయి.  అసదుద్దీన్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. షాదీ ముబారక్ వంటి స్కీములను పరిచయం చేసిన బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై  లోతుగా అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయం నుంచి బిజెపి బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు పూర్తిగా సమసిపోవడమే అసద్ కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. టీఎస్ పిసిసి పేపర్ లీకేజి వ్యవహారంలో మంత్రి కెటీఆర్ హస్తముందని బిజెపి ఆరోపించగా పదో తరగతి పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తముందని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇక్కడితో ఆగకుండా బండి సంజయ్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల  కవిత పాత్ర ఉందని సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటులో పేర్కొంది.అప్పట్లో  రేపో, మాపో కవిత అరెస్ట్ అనే ఊహాగానాల  ప్రచారం జరిగింది. . తీరా చూస్తే కవిత కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అరెస్ట్ వార్త అటకెక్కడంతో మజ్లిస్ పార్టీ అదినేత అసద్ కు కీడుశంకించింది. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అని ప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ తో ముందుకెళితే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు దూరమవుతారని మజ్లిస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైంది. దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గల్లంతవుతుందని మజ్లిస్ ముందే పసిగట్టింది.ఈ కారణంగా మజ్లిస్ బిఆర్ఎస్ ను విమర్శించింది. 
Publish Date: Jun 5, 2023 4:27PM

తెలంగాణలో కాంగ్రెస్ ‘ఎత్తర జెండా!’

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ తన పూర్వ వైభవం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది. మొన్నమొన్నటి  వరకూ తమదే గెలుపు అని చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని మరో సారి ప్రదర్శించే పనిలో ఉంది.  కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలు ఇంత వరకూ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జూన్ 2వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటనతో తెలంగాణ సహా రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టమైంది.  ఇటీవల ముగిసిన కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అధికార పార్టీ అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఫలితాలను ఇవ్వడంతో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాన్నే అవలంబిచాలని భావిస్తోంది.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తోంది.  కర్నాటక, తెలంగాణలో ఉన్న సారూప్యతలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ఇక్కడి ముస్లిం ఓట్లపై గురిపెట్టింది. హిజాబ్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలు ఇక్కడ లేకపోవడంతో రాజకీయ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. మరో వైపు ముఖ్యమంత్రి పదవి అల్ప సంఖ్యాక వర్గాలకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.   బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను తొమ్మిదేళ్లుగా చూస్తున్న తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా కనిపించబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, అమరుల స్థూపం వంటి నిర్మాణాలు, దళిత బంధు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గ్రాఫ్ ని మరీ పతనం కాకుండా కాపాడినా కాంగ్రెస్ గెలుపును ఆపలేవని తాజా సర్వేలు చేబుతున్నాయి.  మే నెలలో ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.   కాంగ్రెస్ వర్గ విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే రానున్న ఎన్నికలలో 41శాతం ఓటు షేరును సాధించి 68 సీట్లు గెలవగలదని ఆ సర్వే తేల్చింది.  37శాతం ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ 35 సీ్టలు, పది శాతం ఓట్లతో  బీజేపీ 8 సీట్లు, 3శాతం ఓట్లతో ఎంఐఎం 6 సీట్లను తమ ఖాతాలో వేసుకోనుండగా, ఒకరిద్దరు ఇతరులు విజయం సాధిస్తారని ఈ సర్వే తేటతెల్లం చేసింది.  తొమ్మదిన్నరేళ్లు అధికారంలో ఉండడం, కింది స్థాయి నాయకులపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటి కారణాలు కేసీఆర్ కు సమస్యగా మారగా, వరుస తప్పిదాలు, నాయకత్వ లోపం, స్పష్టమైన అభివృద్ధి అజెండా లేకపోవడం, కేసుల విషయంలో కప్పదాట్లు బీజేపీ పాలిట శాపంగా మారాయి.  అభ్యుదయ వాదులు, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు బీజేపీ మాటలపై, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలపై నమ్మకం పోయింది.  ఈ రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.  ప్రస్తుతం తెలంగాణలోని తటస్థ నాయకులకు కాంగ్రెస్ ఏకైక ఎంపికగా మారిందనడంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు. 
Publish Date: Jun 5, 2023 3:56PM

మన రైళ్లలో భద్రత డొల్లేనా?

భారత రైల్వే ప్రయాణీకుల భద్రతను గాలిలో దీపంగా మార్చేసిందనడానికి ఒడిశాలోని బాలాసూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాద సంఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల మంది మృత్యువాత పడిన ఆ సంఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఒక వైపు సాగుతుండగానే అదే ఒడిశాలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం (జూన్ 5) ఉదయం ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో   గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినపపటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం పెను ప్రమాదం తరువాత కూడా ఇసుమంతైనా తగ్గకుండా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తోంది.   అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న రాత్రి మచిలీపట్నం, తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లో  మంటలు చెలరేగాయి. ప్రయాణీకుల అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటన గుంటూరు స్టేషన్ కు సమీపంలో జరిగింది. చక్రాల రాపిడి కారణంగా మంటలు చెలరేగాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు  లూబ్రికెంట్లు అయిపోవడమే కారణమంటున్నారు. ప్రయాణీకులు అప్రమత్తమై వెంటనే చైను లాగి రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు రెండు గంటల తరువాత రైలు అక్కడ నుంచి తిరుపతికి బయలుదేరింది.   వరుస ప్రమాదాలతో రైలు ప్రయాణమంటేనే జనం భయపడే పరిస్థితి తలెత్తింది. ఒక బాలాసూర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ సెట్టింగ్ లను ఎవరో మార్చివేయడమే కారణమని స్వయంగా రైల్వే మంత్రి చెప్పడంతో అసలు రైళ్లలో ప్రయాణం ఏ మాత్రం సేఫ్ కాదని పలువురు విమర్శస్తున్నారు. కవచ్ రక్షణ ఉన్నా ఆ ప్రమాదాన్ని నిలువరించే పరిస్థితి లేదన్న రైల్వే మంత్రి ప్రకటన ప్రజలలో ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు సెట్టింగ్ లను మార్చేస్తే ఇక రైల్వే శాఖ భద్రతకు ఏం పూచిపడగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు, దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ వంటి ఊకదంపుడు ప్రకటనలతో సరిపుచ్చడం కాకుండా.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనకు కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   అన్నిటికీ మించి రైల్వే శాఖలో నిర్లక్ష్యం ఏ మేరకు పేరుకు పోయిందనడానికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల గురించి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల కిందటే హెచ్చరించినా.. ఆ లోపాల సవరణ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడమే నిదర్శనం.  ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే  కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రాథమికంగా వెల్లడించిన  నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశంగా మారింది. నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు.   ఫిబ్రవరి 8న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. నాడు వాస్తవానికి అప్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్‌ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకో పైలట్‌ అప్రమత్తమయ్యారు. రైలును వెంటనే నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్‌ ఉన్న ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నది ఆ లేఖ  సారాంశం.   కొన్నిసార్లు సిగ్నల్‌ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక.. అది వెళ్లాల్సిన ట్రాక్‌ మారిపోతోందని పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను నివారించేలా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఆయనా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.న అలా చేయని పక్షంలో  ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని లేఖలో హెచ్చరించారు. అయినా రైల్వే శాఖ ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఫలితమే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం.
Publish Date: Jun 5, 2023 3:05PM

ఏపీలో క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ డౌన్!

గత మూడేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తన సేవలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపసంహరించుకోవడంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) డౌనైపోయింది. సీసీటీఎన్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 15,000 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌ల డేటాను ఏకీకృతం చేయడంలో పోలీసు విభాగాలకు ప్రధాన సాంకేతిక సాధనంగా ఉద్భవించింది.  సీసీటీఎన్ఎస్ కేవలం మౌస్ క్లిక్‌తో సమాచారాన్ని సేకరించడం  నిల్వ చేయడం, విశ్లేషించడం, తిరిగి పొందడం లాంటి సమాచారాన్ని బదిలీ చేయడంలో పోలీసులకు సహాయ పడుతుంది. 2012లో ఏపీలో తమ సేవలను ప్రారంభించినప్పటి నుంచి నేరాలను గుర్తించడంలో, కోర్టుల్లో కేసుల పురోగతిని గుర్తించడంలో పోలీసులు సీసీటీఎన్‌ఎస్‌పై ఆధారపడుతున్నారు. సీసీటీఎనగెస్ అమలు కోసం టీసీఎస్ 2012లో ఆంధ్ర పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఇది ఇటీవలి వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే, గత మూడేళ్లుగా ప్రభుత్వం టీసీఎస్‌కు బిల్లును క్లియర్ చేయడంలో  చూపిస్తున్న అలసత్వం కారణంగా నిర్వహణ సేవలను ఉపసంహరించుకుంది. అనేక మంది పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్ నిర్వహణలో శిక్షణ పొందినప్పటికీ, వారు సర్వర్‌లు, వివిధ డేటాబేస్‌లు, సిస్టమ్‌లను అనుసంధానించేటప్పుడు  కోర్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు. టీసీఎస్ నిష్క్రమణ తర్వాత  సీసీటీఎన్ఎస్ సిస్టమ్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి సమస్యలు తలెత్తినట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పడిన సమస్యను కొంత మేర సరిదిద్దినా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీసు స్టేషన్లలో ఈ సేవ ఇప్పటికీ అందుబాటులో లేదు.  సిసిటిఎన్ఎస్ సమస్యపై సిబ్బందికి అవగాహన లేదని, అయితే జిల్లా యూనిట్లతో తనిఖీలు చేస్తున్నట్టు టెక్నికల్ సర్వీసెస్ డిఐజి ఎస్ వి రాజశేఖర్ బాబు అంటున్నారు. టీసీఎస్ కు పెండింగ్‌లో ఉన్నబిల్లుల కారణంగా  సేవ ఉపసంహరణ అంశంపై మాత్రం ఆయన  మాట్లాడలేదు.  ఇప్పటికే  కొనసాగుతున్న పరిశోధనలను ట్రాక్ చేయడం,  కొత్త నేరాలు, డేటాలను  నవీకరించడం రెండింటిలోనూ ఎస్ హెచ్ఓఎస్,  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీఎన్ఎస్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను అదే రోజున సీసీటీఎన్ఎస్ లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీసీఎస్ సేవలు లేని కారణంగా  పోలీసులు ఆ విధంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం నుంచి ఏపీ పోలీస్ సేవా మొబైల్ అప్లికేషన్, ఏపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ సేవలు నిలిచిపోయాయి.  ఇక ఇలాంటి పరిస్థితి.. రాష్ట్రంలోని పలు పుర, నగరపాలక సంస్థలలో కూడా నలకొని ఉంది.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. పూర్తయిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)లో అప్ లోడ్ చేయడానికే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు. బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రూ.15 లక్షల అంచనాలతో 12 పనులకు అధికారులు 15 సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పుర, నగర పాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి.  రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో చేసిన పనులకు రూ.750 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలో రూ.750 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కొత్త పనులకు గుత్తెదారులు ముందుకు రావడం లేదు. పనులు పూర్తి అయినా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రెవెన్యూ జనరేషన్ లేదు.. రాబడి వస్తుందనే భరోసా లేదు.. తాజాగా టీసీఎస్.. ఏపీ ప్రభుత్వం బాధితురాలైంది.   నేరాలు, వాటి సంబంధిత డేటాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. అప్ డేట్ చేసే ప్రక్రియ ఆగిపోవడంతో..  పౌర భద్రతా డొల్లగా మారింది. దాంతో ఏపీ పోలీసు శాఖ  అధికారులు ఏం చేయాలో పాలు పోక..  ఆందోళనలో ఉన్నారు. మూడేళ్ల బిల్లులు చెల్లిస్తేనే.. సేవలు తిరిగి ప్రారంభిస్తామని టీసీఎస్ కుండ బద్దలు కొట్టేసింది.  
Publish Date: Jun 5, 2023 2:52PM

మంత్రులు, ఎమ్మెల్యేలు బొమ్మల కొలువులో బొమ్మలే !

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఏమ్మేల్యేలున్నారు.. అందులో అధికార వైసీపీ ఎమ్మెల్యేలే 151 మంది ఉన్నారు ..మళ్ళీ అందులో ఓ పాతిక మంది వరకు మంత్రులు. వారిలో  మళ్ళీ ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరు గాక సలహాదారులు ఇలా పేరు గొప్ప పదవుల్లో ఎందరున్నా,  అందరూ జీరోలే. ఎవరికీ ఏ అధికారం లేదు. ఈ మాటన్నది, ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు, మాజీ మంత్రి, అదే అధికార పార్టీ  బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. అంతే కాదు అయన ఇంకోమాట కూడా అన్నారు. చివరికి గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేకు లేదని   అన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదొక్కటే అని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ కూడా  వైసీపీ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. నిజమే కావచ్చు ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడిన నేపధ్యంలో అసమ్మతి గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ నాయకుల చేస్తున్న ప్రత్యారోపణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చు. కానీ, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అంతా ఉత్సవ విగ్రహాలు మాత్రమే అనే అభిప్రాయమే వైసీపీ నేతలతో సహా అందరిలో ఉందనేది కాదన లేని  నిఖార్సైన నిజం.  అలాగే ఓ వంక తమ ప్రభుత్వం నాలుగేళ్ళలో ఏవో అద్భుతాలు చేశామని చెప్పుకుంటుంటే, మరో వంక అదే  పార్టీకి చెందిన బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి  వైసీపీ నాలుగేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆరోపిస్తున్నారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని విమర్శించారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించటానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.   వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని ఆనం రాంనారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టును నిలిపేసి.. చివరికి, కట్టలేమనే దుస్థితికి వచ్చారన్నారు. రాష్ట్రంలో పవర్‌ ప్రాజెక్టులను అమ్ముకునే పరిస్థితికి తీకొచ్చారని ఫైరయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రామనారాయణరెడ్డి అన్నారు. ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా తెస్తున్నారని.. ఆ లెక్కన రాష్ట్రానికి ఎంత అప్పు అయ్యుంటుందని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్ట్‌లు అమ్మేసే  స్ధితికి వచ్చారని.. పోలవరం నిర్మాణాన్ని పక్కనబెట్టారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారని..  ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని, జాలి పడుతున్నారని ఆనం రామ నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఇవాళ లే ఔట్లు లేవని.. తెలంగాణలో వ్యాపారాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అమరావతి పేరుతో ఏపీకి వచ్చిన వాళ్లంతా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఆనం రాం నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి నిర్వీర్యమైన పరిపాలనను ఎప్పుడూ చూడలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా స్థాయి సమావేశాలకు విలువే లేదని పేర్కొన్నారు.
Publish Date: Jun 5, 2023 2:26PM

తెలంగాణకు దళిత సీఎం

తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే.  కానీ ఆ మాటలు అందరూ మరచిపోయారు. పుష్కరకాలం తరువాత తిరిగి ఆ నినాదం ఊపందుకోబోతోంది. ఈ సారి కేసీఆర్ నోట కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.  కాంగ్రెస్ పరిస్థితి కర్నాటక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా మారిపోయింది.  ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కి ఉన్న సంబంధం అపురూపమైనది. దేశమంతా  కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమ యంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీని గెలిపించుకున్న ప్రాంతం తెలంగాణ. సహజంగానే కర్నాటక ఫలితాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పడింది. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గ రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉన్న తెలంగాణలో, అందులో కాంగ్రెస్ లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.   రెడ్లలో ఉన్న పోటీని నివారించాలంటే ఇతర సామాజిక వర్గాలకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదీకాక గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టాలని, దళిత మహిళను పార్లమెంటు ప్రారంభోత్సవానికి  పిలవని బీజేపీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో పోరు జగమెరిగిన సత్యమే.  రెడ్ల మధ్య పోరును ఆపడానికి దళిత కార్డును కాంగ్రెస్ వినియోగించబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో ఉన్న దళిత నేత ఎవరంటే, విప్లవ పంధా నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనే సమాధానం వస్తోంది. నిజాయితీగా పని చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్న సీతక్క పెట్ట కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కాలంలో తన నియోజకవర్గంలో కాలినడకన ప్రయాణిస్తూ ప్రజలను ఆదుకున్న అడవి బిడ్డ సీతక్క ఇప్పుడు కాంగ్రరెస్ కు ఆశాదీపంగా కనిపిస్తోంది.  ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బారత్ జోడో యాత్రలో పాల్గొన్న సీతక్క దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయం పెంచుకున్నారు.  రాహుల్ గాంధీ సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం చేయడం వెనుక ఆమెను తెలంగాణ సీఎం పీఠంలో కూర్చోపెట్టే వ్యూహమే ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు.  సీతక్కకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండడం, వివాదాలకు  అతీతంగా వ్యవహరించడం కూడా అమెకు ప్లస్ అనేది కాంగ్రెస్ వాదన. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తూ అధిష్ఠానం కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్లు, రెడ్లు పోరులో దళితులు ప్రయోజనం పొందడం ప్రస్తత తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్
Publish Date: Jun 5, 2023 2:01PM

తెనాలి నుంనే పోటీ.. పొత్తు ఖాయం.. నాదెండ్ల!

సరిగ్గా హస్తినలో చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సమయంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్.. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని కుండ బద్దలు కొట్టేశారు. పొత్తు విషయంలో ఇప్పటికే దాదాను విధివిధానాలు ఖరారైపోయాయనీ, సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. సీట్ల సర్దు బాటు విషయంలో కూడా ఎటువంటి గందరగోళం లేదనీ, ఆ విషయంలో తుది నిర్ణయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేననీ, ఆయనే  సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. దీంతో  తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడం ఖాయమేననీ, సీట్ల సర్దుబాటు లాంఛనమేననీ తేలిపోయింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ ఉంటుందా? ఉండదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని కూడా తేటతెల్లమైపోయింది. బీజేపీ ఈ కూటమితో కలవాలని భావించినా సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీది నామమాత్రపు పాత్రేనని కూడా నాదెండ్ల ప్రకటనతో తేలిపోయింది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అన్ని విషయాలలోనూ అండదండగా ఉండి.. ఇప్పుడు వైసీపీ వ్యతిరేకత తమ పార్టీపై పడకూడదన్న ఉద్దేశంతో పొత్తుకు ముందుకు వచ్చినా.. గతంలోలా ఆ పార్టీకి ఈ కూటమిలో  సమాన హోదా ఉండే అవకాశం అంతంత మాత్రమేనని కూడా నాదెండ్ల మనోహర్ ప్రకటన తేటతెల్లం చేస్తోంది.  హస్తినలో చంద్రబాబు కేంద్ర హోమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరుపుతుంటే.. అదే సమయంలో నాదెండ్ల తెలుగుదేశంతో పొత్తు విషయంలో అనుమానాల్లేవ్ అని చెప్పడంతోనే బీజేపీ కలిసినా కలవకపోయినా పట్టించుకోబోమన్న అర్ధం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక సీట్ల సర్దు బాటు విషయానికి వస్తే ఇప్పటికే పలు సందర్భాలలో  భేటీ అయిన  చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి తెనాలి నియోజకవర్గం నుంచి  తాను రంగంలో ఉంటానని ప్రకటించడం ద్వారానే సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయ్యిందన్న సంకేతాన్ని నాదెండ్ల ఇచ్చారని అంటున్నారు.   
Publish Date: Jun 5, 2023 11:30AM

షా నడ్డాలతో చంద్రబాబు భేటీ.. సంకేతం ఏంటి?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తినకేగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వడం ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. గత నాలుగేళ్లుగా తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండ అందించిన ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జగన్ సర్కార్ కు.. ఇక ఈ చివరి సంవత్సరం అంటే ఎన్నికల ఏడాదిలో అలాంటి వెసులుబాటు ఉండదన్న సంకేతాలను ఈ భేటీ ఇచ్చిందనడంలో సందేహం లేదు. అయితే మీడియాలో, సామాజిక మాధ్యమంలో వస్తున్నట్లుగా పొత్తుల చర్చలు కాదు కానీ.. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న విషయాన్ని విపక్ష నేత, దార్శనికుడు అయిన చంద్రబాబు ద్వారా నేరుగా తెలుసుకునే ఉద్దేశంతోనే  బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాచును హస్తినకు ఆహ్వానించి భేటీ అయ్యిందని ఏపీ బీజేపీ శ్రేణుల్లోని ఒక వర్గం బలంగా చెబుతోంది. జగన్ సర్కార్ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆ వర్గం చెబుతోంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి జగన్ సర్కార్ పై వాడవాడలా చార్జిషీట్ లు రూపొందించమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా.. పార్టీ హై కమాండ్  పూనుకునేవరకూ ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చని విషయాన్ని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ నాయకుల మీద అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడినా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి నేరుగా విపక్ష నేత నుంచి వివరాలు తెలుసుకోవాలని భావించిందని అంటున్నారు. అందుకే ముందుగా అమిత్ షా తో మాత్రమే బాబు భేటీ అని చెప్పినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చి కలవడంతో వారి మధ్య బేటీ రాజకీయపొత్తుల గురించి కాకుండా.. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకత్వాలపైనే సాగిందని అంటున్నారు.  దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ నిధులను విడుదల చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్ల రాష్ట్రంలో ఇసుమంతైనా సానుకూలత రాకపోవడం.. అలాగే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ సొమ్ముల విడుదల ద్వారా గట్టెక్కుతుందని మోడీ సర్కార్ భావించినా.. మళ్లీ యధావిథిగా అప్పుల కోసం జగన్ సర్కార్ తిప్పలు పడటం.. కనీసం ఉద్యోగులకు  జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కొనసాగుతుండటంతో... ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుతో భేటీలో అందుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jun 5, 2023 11:09AM

తప్పేముంది?.. బాబు హస్తిన పర్యటనపై బండి

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీని పురస్కరించుకుని తెలుగుదేశం, బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలను తోసి పుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో కూడా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని, హోంమంత్రితో భేటీ అయిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.  కేంద్రంలో మోడీ సర్కార్  తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెలాఖరు వరకూ నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్  కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చేందుకు బండి సంజయ్ తెలంగాణలోని వివిధ జిల్లాల పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.   గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగానే తెలుగుదేశం  అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా, నడ్డాలతో భేటీ నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం పొత్తులపై మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.  ఊహాజనిత వార్తలను పట్టించుకోనవసరం లేదన్న బండి సంజయ్  దేశ సమగ్రాభివ్రుద్దే  లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. మమతా బెనర్జీ, స్టాలిన్ ఆఖరకి కేసీఆర్ తో కూడా గతంలో మోడీ, షా భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరో వైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు అమిత్, షా నడ్డాలతో భేటీని భూతద్దంలో చూస్తూ ఖంగారు పడుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం పిలుపుపై చంద్రబాబు హస్తిన వెళ్లిన సంగతిని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ.. బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ కథనాలను వండి వారుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం మాత్రం ఈ భేటీపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు హస్తినలో అమిత్ షాతో మాట్లాడారని అంటోంది.  మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటన ఇటు ఏపీలోనే కాకుండా, అటు తెలంగాణలో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
Publish Date: Jun 5, 2023 10:50AM

తెలుగుదేశంలోకి ట్రిపులార్?

ట్రిపులార్  అంటే ఎవరో తెపుసు కదా... అవును.. ఎప్పుడూ వార్తల్లో ఉండే, రచ్చబండలో అధికార వైసీపీ సర్కార్ ను  ఉతికేసే  నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచిన ఆయన ఆది నుంచీ  అసమ్మతి ఎంపీగా ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు.నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది.  అదలా వుంచి ప్రస్తుతంలోకి వస్తే,  ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే  కారాణాలు ఏవైనా  ఆయన బీజేపీలో చేరలేదు. అయితే  బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  టీడీపీలో చేరి రాజకీయాలలో కంటిన్యూ అయ్యే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమితో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అందుకే  రెండురోజుల్ పర్యటనకు ఢిల్లీ వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు.  అంటే కాదు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. నేరుగా ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ఆసక్తిగా ఉన్నానని చంద్రబాబు నాయుడుకు  చెప్పినట్లు తెలుస్తోంది. నర్సాపురం లేదా మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలనే  ప్రతిపాదన పెట్టారనీ. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారనీ సమాచారం.అదలా ఉంటే , రఘురామ కృష్ణం  రాజు అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన కుడా చేస్తున్నారని, అందుకే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో ఆయన ముందుగానే, తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అయన సన్నిహితులు చెపుతున్నారు.
Publish Date: Jun 5, 2023 8:08AM

కలిశారు సరే.. ఏం మాట్లాడారు?

తెలుగుదేశం   అధినేత చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లారు. అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు.  అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వేరే చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు అమిత్షా తో బేటీ కావడం ఇదే తొలిసారి.   అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమంయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు చర్చలు పూర్తిగా రాజకీయపరమైనవేనని అనడంలో సందేహం లేదు.  అయితే అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారన్న విషయంలో రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కోరేందుకే బీజేపీ హై కమాండ్ చంద్రబాబును హస్తినకు పిలిచిందన్న వాదన రాజకీయవర్గాలలో గట్టిగా సాగుతోంది.   అదే సమయంలో గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన బలంగా జనంలోకి వెళ్లిపోయిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ సమయంలో ఏపీలో బీజేపీ పొత్తు, ఎన్డీయేలో చేరిక అంటే ప్రజలలో పలుచన అయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడితే అది పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అటుంచి నష్టం చేకూర్చే అవకాశాలే అధికంగా ఉంటాయని చంబ్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం,  రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నా.. ఇంత కాలం కేంద్రం వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలవడం, ఆర్థిక అరాచకత్వానికి మద్దతు ఇవ్వడాన్ని చంద్రబాబు ఆ సందర్భంగా వారి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ తీరు వెనుక కూడా కేంద్రం ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెద్దగా ఉపయోగం ఉండదనీ, ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ వైసీపీకి వ్యతిరేకం అన్న భావన కలిగేలా వ్యవహరించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో క్షేత్ర స్థాయిలో కలిసి ఉద్యమాలలో పాల్గొంటే.. ఆ తరువాత పొత్తుల విషయం మాట్లాడుకోవచ్చని చంద్రబాబు అమిత్ షా నడ్డాలకు వివరించారని అంటున్నారు. అన్నిటికీ మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీకి దూరం పాటించడం అవసరమనీ, అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తెలుగుదేశం లోక్ సభలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అరాచకాలు, అక్రమాలకు పాల్పడకుండా   గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ వ్యతిరేకమన్న విషయాన్ని గట్టిగా చాటితే బీజేపీకి అవసరమైతే  తెలంగాణలో టీడీపీ నుంచి సహకారంఅందుతుందని కూడా చంద్రబాబు  అమిత్ షా నడ్డాలకు హామీ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితో అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీపై ఏపీ సర్కార్ లో కలవరం విస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రులు ఈ భేటీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ చూస్తుంటే  తమకు గతంలోలా కేంద్రం మద్దదు లభించదేమోన్న భయం వారిలో ప్రస్ఫుటమౌతోంది. 
Publish Date: Jun 5, 2023 7:57AM

నోటితో వెక్కిరింపు.. నొసటితో పలకరింపు!

ఏపీలో బీజేపీ విచిత్ర విన్యాసాలు చేస్తోంది. అన్ని విధాలుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అధికార వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతూనే.. చార్జిషీట్ల పేరుతో నామ్ కే వాస్తేగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఆ మాత్రమైనా చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ఒక్క శాతం ఓట్లు కూడా గాయబ్ అవుతాయన్న భయమే అందుకు కారణం. జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం.. అంటే హస్తినలో ఉన్న కమలం పార్టీ అధిష్ఠానం మీరు జగన్ సర్కార్ ను కనీసం తిట్టినట్లైనా చేయకపోతే ఎలా అని రాష్ట్ర నాయకత్వాన్ని  మందలించడమే   కారణం. అధిష్ఠానం కన్నెర్ర చేయడంతోనే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి వీసమెత్తు కూడా స్పందన రాకపోవడంతో వ్రతమూ చెడి.. ఫలమూ దక్కలేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైంది.   ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో  పర్యటించనున్నారు. వీరిలో హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో మోడీ తొమ్మిదేళ్ల  పాలన విజయాలపై ప్రసంగించనున్నారు.   అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో   బహిరంగసభలో ప్రసంగిస్తారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ పై దృష్టి పెట్టినట్లుగా ఏపీని పట్టించుకోవడం లేదు.  వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలు అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు కొనసాగించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉంటే ఉంటుంది.. లేకుంటే ఊడుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే బీజేపీ  నాయకత్వం జగన్ సర్కార్ విషయంలో తిట్టినట్లు చేస్తూ.. వెనుక నుంచి  సహకారం అందిస్తోంది. 
Publish Date: Jun 3, 2023 5:27PM