"అంతేకాదు కోడలా! లక్ష్మి కొడుకుని కన్నాక నువ్వు కూతుర్ని కనాలి." అంది అమ్మ అరుణ నుద్దేశించి.
ఇంటిలో నిండుదనం ఆవరించుకొందని పించింది. ఇది ఇల్లని చెప్పుకోటానికి ఇప్పటికి ఆధారం చిక్కింది.
మేడల్లో తిరిగిన అరుణకి ఈ ఇంట్లో వుండటం కష్టంగా వుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది-"ఈ ప్రాంతాల్లో నీకు కావలసిన సౌకర్యాలేమీ వుండవు. ఏ సిటీకైనా ట్రాన్స్ ఫర్ చేయించుకుందామా? మేడ తీసుకోవచ్చు. సర్దాగా షికార్లు తిరగొచ్చు. ఏం అరుణా?" అన్నాను.
"నాకిక్కడే బావుంది. సిటీలైఫ్ విసుగెత్తిపోయింది. ఈ ప్రాంతాల్లోనే హాయిగా ప్రకృతి సౌందర్యాలని చూస్తూ కాలంగడపొచ్చు.' అంది అరుణ జట్టునిమురుతూ. అరుణకి నిన్ను గురించి అంతా చెప్పాను కృష్ణవేణి! నిన్ను చూడాలని ఉందిట. నాకూ శ్యామసుందర్ ని చూడాలని వుంది. నీకు వుత్తరం రాస్తే జవాబు రాశావు కాదు. ఏపార్క్ లోనో తిరుగుతున్నప్పుడు శ్యామసుందర్ ని చూసి వచ్చేస్తాను. ఇప్పుడు అతను ఎక్కడవున్నదీ, ఎప్పుడు వచ్చేదీ తెలియజేస్తే వస్తాను-నువ్వు క్షేమమని తలుస్తాను.
మాధవ!
మాధవ్ వుత్తరం పూర్తిచేసి ఆకాయితాల కేసే తదేకంగా చూస్తూ వుండిపోయింది కృష్ణ వేణి-"అరుణ వచ్చింది. పరిపూర్ణమైన స్త్రీత్వం నింపుకొని వచ్చింది-అరుణ వచ్చేసింది." పదేపదే అనుకొంది. కాని ఆ పరిస్థితిలో తను వుంటే ఏం జరిగేది? అరుణ రావటం మానేదా? మాధవ్ అరుణని పొమ్మనేవాడా? అరుణ మారుమాట్లాడకుండా వెళ్ళిపోయేదా? ఆ ఇంటి కోడలుగా అరుణ మసలుతున్నట్టు తను మసలగలిగేదా? అరుణకున్న విలువా, అధికారం తనకైతే వుండేవా?-ఎప్పుడేది జరిగినా మన మంచికే అంటారు. ఇదేనా? అంత విషమ పరిస్థితిలో తను చిక్కుకోవటం నిజంగా ఎంత అదృష్టం! అలా జరిగితే తనూ, మాధవ్, అరుణా అంతా జీవితాంతాలవరకూ బాధ పడాల్సివచ్చేది. అవును కదూ?
మహావుపద్రవం లోంచి తప్పిపోయినట్టు ఫీలయ్యింది కృష్ణవేణి-"మాధవ్ బ్రతుకు బాగుపడింది. మూడు పువ్వులుగా ఆరుకాయలుగా గడిచిపోతుంది. చిరకాలంగా మాధవ్ కోరుకునే శాంతిసౌఖ్యాలు లభించాయి. మాధవ్ సుఖపడతాడు. అవును. మాధవ్ సుఖపడాలి. ఎప్పుడూ మాధవ్ సంతోషంగా వుండాలి." అనుకొంటూంటే కృష్ణవేణి కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లాయి. ఆ సంతోషవార్త రేణుకు చెప్పాలనిపించింది. కూర్చున్నదల్లా చటుక్కునలేచి క్రిందికెళ్ళింది. ఫోన్ లో రేణు పలికింది.
"రేణూ! అరుణ కాపురానికొచ్చేసిందట. ఎంతో యిదిగా మారిపోయిందట. మాధవ్ ఉత్తరం రాశాడు. ఇప్పుడే చదివాను."
రేణు మాటల్లో ఆశ్చర్యం - నమ్మలేనటువంటి అనుమానం ధ్వనించాయి. "అరుణ వచ్చిందా? ఎప్పుడు కృష్ణవేణి? ఎలా వచ్చింది? మాధవ్ ఏమీ అనలేదా?"
"నువ్వే ఉత్తరం చదువుదువుగాని. అరుణ విషయాలు చాలా రాశాడు, ఒక్కసారి రాకూడదూ! వస్తావుకదూ?"
"వస్తాను" అంది రేణు.
ఆ సంగతి వదినకి కూడా చెప్పింది కృష్ణవేణి. వదిన కూడా రేణు లానే ఆశ్చర్యపడింది. "పది వేలకీ భార్యా భర్తలనే వాళ్ళు సంతోషంగా వుండాల్సిందే కృష్ణవేణీ! పాపం అతని విషయం గుర్తు వచ్చినప్పుడల్లా ఎంతో బాధగా వుండేది" అంది. వదిన అన్న మాటలకి కృష్ణవేణి మనసు పరిపరివిధాలా పోయింది. "భార్యా భర్తలనే వాళ్ళు సంతోషంగా వుండాల్సిందే" అవును ఉండాల్సిందే. కాని ఆభాగ్యం ఎంత మందికి? దాంపత్యాలు చెడిపోవడం వంటి దౌర్భాగ్యం అదేగాని మరోటి లేదు. ఆ స్థితిలో చిక్కుకున్న వాళ్ళు బ్రతికి వుండడం కంటే చావటం ఎంత మేలు!
రేణు వచ్చింది. మాధవ్ ఉత్తరం చదివింది. "అవును కృష్ణవేణీ! ఎంతటి సమస్యనైనా కాలమే పరిష్కరిస్తుంది. చూశావా? అరుణలో ఎంత సహజంగా మార్పు కలిగిందో? మనసు అనేది కలకాలం ఒక్కలా వుండిపోదు. పరిస్థితులకు తదనుగుణంగా మారిపోతూ వుంటుంది. అది సహజమే కదూ.
అది నిజమే ననిపించింది కృష్ణవేణికి. తనకి పెళ్ళి కావటం, మాధవ్ ని పరాయి వ్యక్తిగా చూసుకోగలగటం, శ్యామసుందర్ కోసం ఆరాటపడటం, పరిస్థితులకు తదనుగుణంగా మనసు మారటం కాకపోతే ఏమిటి?
"కాని రేణూ! శ్యామసుందర్ కూడా నన్ను క్షమించ గలిగితే.....?" కృష్ణవేణి మనసులో అదే కోరిక!
"నువ్వు బాధపడకు వేణూ! ఫర్వాలేదు. అంతా చక్కబడుతుందని నాకనిపిస్తుంది."
రేణు మాటలతో ఓదార్పు చిక్కలేదు కృష్ణ వేణికి. మరి రెండు రోజుల వ్యవధి వుంది. శ్యామసుందర్ ఏదో నిర్ణయం తెలియజేయాలి. తన భాగ్యా భాగ్యాలు బైట పడాలి. తనకి చావంటే భయమని కాదు. బ్రతికి ఏదో బాముకోవాలని కాదు. కాని తన కుటుంబం అల్లరి పాలు కాకూడదని, యీ బ్రతుకేదో గుట్టుగా గడచి పోవాలనే గదా తన తాపత్రయం అంతా? పిచ్చిగాని ఎంత తాపత్రయం పడినా తను చేయగల్గిందేముంది? జరగాల్సిందేదో జరిగే తీరుతుంది.
అలా అనుకొని మాత్రం నిశ్చింతగా వుండగలదా? ఏదో భయం, ఏదో బాధ, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు గంటలు గడుస్తున్నా కొద్దీ క్రమ క్రమంగా జీవితం తరిగిపోతూన్నట్టే వుంది. అకస్మాత్తుగా ఏ క్షణానో, ఏదో ఘోరం వినాల్సి వస్తుంది. "ప్రభూ! నీ దగ్గరికి చేరటం కన్నా సంతోషమేముంది? ఇంతలోనే ఆ అవకాశం లభించడం అదృష్టమే కదూ?" అనుకొంది కృష్ణవేణి.
"కృష్ణవేణీ! నీకు టెలిగ్రాం వచ్చిందట"
ఆశ్చర్యపడింది కృష్ణవేణి - "నాకా టెలిగ్రాం? ఎక్కడి నుంచి?"
"ఏమో నేను చూడలేదు నీకు చెప్పాలని వచ్చాను"
కృష్ణవేణి గబగబా వదినతో కలిసి వెళ్ళింది. సంతకం చేసి కవరు తీసుకుంది. వణుకుతూన్న వేళ్ళతో ఆతృతగా కవరు చూసింది. "ఎక్కన్నుంచి?" అంది వదిన.
జరాజర పైకి వెళ్ళిపోతూ అంది కృష్ణవేణి "మీ అన్నయ్య దగ్గర్నుంచి.............."
తనకి శ్యామసుందర్ దగ్గర్నుంచి టెలిగ్రాం! ఏముంటుంది అందులో? ఏదో వుంటుంది? శ్యామసుందర్ చేసిన నిర్ణయం వుంటుంది. తన చావు బ్రతుకులు సందేశం వుంటుంది. అది తను చూసుకోవాలి. చూసుకోకపోయినా అందులో విషయం మాసిపోదు. అలానే వుంటుంది.
ఆ క్షణం కృష్ణవేణి జీవితానికి నడిబొడ్డు వంటిది.
కృష్ణవేణి నిండు బ్రతుకును శాసించగలిగేది.
"నేను సాయంత్రం ట్రెయిన్ లో వస్తున్నాను. నువ్వు వేరే ఏమీ ఆలోచించకు...... ......
శ్యామసుందర్!
కృష్ణవేణి నిర్ఘాంత పోయింది. శిలలా స్థంభించిం పోయింది. చేష్టలు దక్కి నిలబడిపోయిన కృష్ణవేణి చేతిలో కాగితం రెపరెపలాడుతోంది. వెనకే వచ్చిన వదిన కృష్ణవేణి భుజం మీద చేయివేసి కాయితం అందుకుంది. ఒక్కసారి కృష్ణవేణి కదిలి వదిన్ని కావిలించుకుంది.
-"ఆయన వస్తున్నారు ఒదినా! ఆయన వస్తున్నారు. సాయంత్రమే వస్తున్నారు." అంటూ ఉక్కిరి బిక్కిరి చేసింది. "ఇదేమిటి కృష్ణవేణీ? వెళ్ళిన మనిషి రాకుండా వుండి పోతారా? ఎందుకిలా కంగారు పడతావ్?"
'కాదొదినా! మా యిద్దరి మధ్య ఎంత అవాంతరం వచ్చి పడిందో నీకు తెలీదొదినా! యీ విషయం దూది పింజెలా యింత తేలికై పోతుందనుకోలేదు ఒదినా!
ఆయన వస్తారనీ, ఆయన్ని చూస్తాననీ అనుకున్నానా? ఎంత మంచి మనసు వదినా! ఎంత మంచి మనసు వదినా!"
కృష్ణవేణి ధోరణి వదినకేమీ అంతు పట్టలేదు. "నువ్వనేదేమిటి కృష్ణవేణీ? అంటూంటే "రేణుకు చెప్పాలి. ఉండు. వస్తాను. రేణుకి చెప్పేసి వస్తాను" అంటూ ఫోన్ దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళింది.
సాయంత్రమైంది. అన్నయ్య స్వయంగా స్టేషన్ కెళ్ళి శ్యామసుందర్ ని ఇంటికి తీసుకొచ్చాడు. హాల్లో చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వదిన అన్నగార్ని పలకరించింది. శ్యామసుందర్ ఎప్పటిలా నవ్వుతూ సహజంగా మాట్లాడుతూ కూర్చున్నాడు. కృష్ణవేణి దడదడలాడుతూన్న గుండెలతో పైనే వుండిపోయింది. శ్యామసుందర్ స్నానం, భోజనం అన్నీ ముగించుకు పైకి వచ్చేసరికి చాల రాత్రయింది. శ్యామసుందర్ గదిలో అడుగుపెట్టిన సంగతి గ్రహించిన కృష్ణవేణి కిటికీలోంచి బైటకు దృష్టి సారించి అక్కడే అతుక్కుపోయింది.
శ్యామసుందర్ కృష్ణవేణి దగ్గరకు నడిచాడు.
మొదటి రాత్రి జరిగిన అదే అనుభవం గుర్తువచ్చింది శ్యామసుందర్ కి.
"ఉదయం టెలిగ్రాం అందిందా?"
ఔనన్నట్టు తలవూపింది కృష్ణవేణి.
"ఏం మాటలు మర్చిపోయావా?"
కృష్ణవేణి మవునంగా తలదించుకొంది.
శ్యామసుందర్ కృష్ణవేణి బుజాలు పట్టుకొని తనవైపు తిప్పుకున్నాడు. గడ్డం ఎత్తిపట్టి మొహంలోకి చూస్తూ అన్నాడు-" ఎందుకు మాట్లాడవ్? భయంగా వుందా?"
"లేదు." అనబోయింది. మాట పెగల్లేదు. పెదాలు వణికాయి. కళ్ళత్తి చూడబోతే కళ్ళలో నీరు నిండుకుంది. శ్యామసుందర్ హృదయానికి తల ఆనుకొంది. ఏదో మాట్లాడాలనీ, ఎంతో కృతజ్ఞత వెల్లడించుకోవాలని, మనసు తహతహ లాడుతూన్నా ఏమీ మాట్లాడలేకపోతూంది. ఎంతో ప్రయత్నం మీద ఆమాత్రం అనగల్గింది -" నన్ను క్షమిస్తారనుకోలేదు. మిమ్మల్ని మళ్ళా చూస్తాననుకోలేదు. భగవంతుడు మీకెంత మంచి మనసిచ్చాడు!"
శ్యామసుందర్ కృష్ణవేణి తల నిమురుతూ మృదువుగా నవ్వాడు-"నీవంటి భార్యనిచ్చీ- ఇటువంటి సమస్య తెచ్చిపెట్టీ -ఆ మంచి మనసేదో కూడా యివ్వకపోతే ఎలా మరి?"
కృష్ణవేణి తల ఎత్తి శ్యామసుందర్ కళ్ళలోకి చూస్తూ అడిగింది -" నన్నెలా క్షమించారు? నేనేం తప్పుచెయ్య లేదా?"
"ఎందుకు చెయ్యలేదు? క్షమించలేని తప్పు చేశావు. నేనే మాధవ్ నైతే నువ్వు వేరే పెళ్లెలా చేసుకొనేదానివో చూసేవాడిని. నువ్వు రాసిన వుత్తరం పెళ్ళికి ముందే శ్యామసుందర్ కి పంపేవాడిని."
కృష్ణవేణి తెల్లబోయింది - "మీరు మాధవ్ ని సమర్ధిస్తున్నారా?" "అవును కృష్ణ వేణీ! నువ్వు మాధవ్ ని నమ్మించి ద్రోహం చేశావు. క్షమించకూడని నిన్ను మాధవ్ క్షమించాడు."
కృష్ణవేణి-అంది. "మాధవ్ కి ప్రేమించటం తప్ప మగ సాధించటం తెలీదు?" శ్యామసుందర్ సోఫాకేసి నడిచాడు. కృష్ణవేణి డెస్క్ లోంచి వుత్తరం తెచ్చి శ్యామసుందర్ కిస్తూ - "చూడండి. మొన్న మాధవ్ దగ్గిర్నుంచి వచ్చింది." అంది, శ్యామసుందర్ వుత్తరం చదువుతోంటే కృష్ణవేణీ పక్కన కూర్చుంది - వుత్తరం పూర్తిచేసి కాయితాలు మడత పెడుతూ - "గుడ్! సుఖాంతం. అవునా?" అన్నాడు.
"అవును. మీవంటిమంచివాళ్ల కథలెప్పుడూ సుఖంతోనే అంతమవుతాయి." అంది కృష్ణవేణి.
"సరే! కాయితం కలం తీసుకురా."
"దేనికి?"
"మాధవ్ కి వుత్తరం రాద్దాం."
కృష్ణవేణి క్షణం చూసి, లేచివెళ్ళి కాయితం కలం తెచ్చింది. శ్యామసుందర్ వుత్తరం రాసి కృష్ణవేణి చేతికిచ్చాడు. కృష్ణవేణి చదువు కొంది -
శ్రీ శ్రీ మాధవరావ్!
నమస్తే!
నా భార్య కృష్ణవేణి ద్వారా మీరు నాకు పరిచితులే. పదిరోజుల క్రిందట మీ వుత్తరం చూసిన కారణంగా మాలో కలహం రేగి దైవ కృపవల్ల సర్దుకుపోయింది. మీ సంసారం చక్క బడిన సంగతి నాకూ ఎంతో సంతోషం కల్గించింది. మీరు మమ్మల్ని చూస్తానని రాశారు. ఏ పార్కు లోనో చాటుగా చూడాల్సిన అగత్యమేమీలేదు.మిమ్మల్ని నా ఫ్రెండుగా ఈ ఇంట్లో పరిచయం చేస్తాను. మీ భార్యా భర్తల నిద్ధరినీ కృష్ణవేణి నేనూ స్వయంగా ఆహ్వానిస్తున్నాము. త్వరలో మీ రాకకై ఎదురు చూస్తాము.
శ్యామసుందర్!"
ఆ వుత్తరం చదివిన కృష్ణవేణి శ్యామసుందర్ సహృదయతకు మరొకసారి ఆశ్చర్యపోయింది. శ్యామసుందర్ కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది.
"ఏమిటలా చూస్తావ్?"
"మీవంటి భర్త - నిజంగా నేను అదృష్టవంతురాలిని."
భర్త ఒడిలో మొహం దాచుకొంది.
కృష్ణవేణి శాంతకి కూడా వుత్తరం రాసింది. ప్రియమై శాంతకు!
ఇక్కడంతా క్షేమం. మీరు క్షేమమని తలుస్తారు. మాధవ్ వుత్తరం ఒకటి అనుకోకుండా మా దాంపత్యంలో కలవరం కలిగించింది. భగవంతుడి దయవల్లే అంతా నెమ్మదించింది. ఇప్పుడు శ్యామసుందర్ ఇక్కడే వున్నారు. ఆయనే స్వయంగా మాధవ్ కి వుత్తరం రాశారు. అరుణ కాపురానికి వచ్చేసింది. వాళ్ళిద్దర్నీ రమ్మని రాశాము. అంతా ఒక్కసారి కల్సుకుందాము. చి. సరూతో సహా మీరిద్దరూ రావాలి. అరుణా, మాధవ్ వస్తారు. మీరిద్దరూ తప్పక రావాలి. కబుర్లన్నీ కలిసినప్పుడే చెప్పుకుందాం.
కృష్ణవేణి!
ఉత్తరాలు టేబుల్ మీద పడేసి - లైటు ఆర్పేసి శ్యామసుందర్ చేయి పట్టుకు మంచం కేసి తీసికెళ్ళింది కృష్ణవేణి.
* * *
