లయన్ ను భయపెడుతున్న సెంటిమెంట్?
on Apr 24, 2015
టాలీవుడ్ లో సెంటిమెంట్ రాజ్యమేలుతుందనే సంగతి అందరకీ తెలిసిందే. ముఖ్యంగా పాత్ర విషయంలో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉన్నా లేకున్నా....సినిమా విజయంలో హీరోయిన్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతారు. ప్రస్తుతం బాలయ్య లయన్ కు సంబంధించి ఇలాంటి సెంటిమెంట్ ఒకటి హల్ చల్ చేస్తోంది.
బాబాయ్-అబ్బాయ్ కి ఒకే హీరోయిన్ కలసిరాదనే సెంటిమెంట్ ఒకటుంది. ఎవరి హీరోయిన్ తో ఎవరు నటించినా సినిమా ఫ్లాప్ అవుతుందంటారు. బాలయ్య-ఎన్టీఆర్ హీరోయిన్స్ ని గమనిస్తే ఇది నిజమే అంటున్నారు కూడా.గతంలో బాలయ్యతో చెన్నకేశవరెడ్డిలో నటించిన శ్రియ....నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్ తో స్టెప్పులేసింది. చెన్నకేశవరెడ్డి పోస్టర్ చూసేందుకు జనాలు వణికితే....నా అల్లుడు వద్దుబాబోయ్ అన్నారు.ఆ తర్వాత యమదొంగలో రబ్బరు గాజులు అంటూ చిందేసిన ప్రియమణి కూడా నందమూరి నటసింహానికి నిరాశే మిగిల్చింది. భారీగా ఉన్న ప్రియమణి యంగ్ టైగర్ సరసన అస్సలుబాగోదు అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ నటనతో పాటూ డాన్స్ లోనూ జూనియర్ తో పోటీపడింది. యమదొంగ విజయంలో తనపాత్రా ఉందనిపించుకుంది. ఆ సినిమాలో చూసి ముచ్చటపడ్డ బాలయ్య మిత్రుడులో ప్రియా కావాలన్నాడు. కానీ అబ్బాయ్ కి కలిసొచ్చిన ప్రియమణి బాబాయ్ కి నిరాశే మిగిల్చింది.
బద్రీతో ఎంట్రీ ఇచ్చిన అమిషాపటేల్ విషయానికొస్తే.....నరసింహుడులో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. అప్పటికే రాఖీ, అశోక్ ప్లాపుల్లో ఉన్న యంగ్ టైగర్ కి మరో ఫ్లాప్ మూటగట్టింది. ఆ తర్వాత బాలయ్య హీరోగా దాసరి తెరకెక్కించిన పరమవీర చక్రలో నటించింది. దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. పరమవీర చక్ర దెబ్బకు అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు కూడా.
రాఖీ రాఖీ అంటూ యంగ్ టైగర్ ని రెచ్చగొట్టిన ఛార్మీ కౌర్.....ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఈ అల్లరి పిల్ల అల్లరి పిడుగులో బాలయ్యతో హడావుడి చేసింది. కానీ ఈ జంట ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నన్నేదో సేయమాకూ అని మెలికలు తిరిగిన అంకిత...విజయేంద్రవర్మతోనూ రొమాన్స్ చేసింది. సింహాద్రిలో రస్నాబేబీ అదిరింది అనుకున్నా...బాబాయ్ తో తేలిపోయింది. సింహాద్రి బ్లాక్ బస్టర్ అవగా..విజయేంద్రవర్మ వైపు విజయం తొంగిచూడలేదు. వెళ్లవయ్యావెళ్లు అని కుర్రాళ్లను పరిగెత్తించిన సదా సైతం ఇద్దరికీ పోటీపడి మరీ ఫ్లాపిచ్చింది. ఎన్టీఆర్ తో నాగ, బాలయ్యతో వీరభద్రలో నటించింది.ఆ రెండు సినిమాలూ దారుణంగా దెబ్బతిన్నాయి.
వీళ్లందరితో పోల్చుకుంటే నయనతార బాబాయ్-అబ్బాయ్ ఇద్దరకీ రిలీఫ్ ఇఛ్చిందనే చెప్పాలి. అబ్బాయితో అదుర్స్ అనిపించిన ఈ బ్యూటీ...బాబాయ్ తో భళా అనిపించింది. ముందొచ్చిన శ్రీరామరాజ్యంలో సీతారాములుగా మెప్పించి....సింహాతో హిట్ పెయిర్ గా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాపుల పరంపరలో కొట్టుకుపోతున్న బాలయ్యకు ఊహించని స్థాయిలో హిట్టిచ్చింది.
లేటెస్ట్ మూవీ లయన్ విషయానికొస్తే...సెంటిమెంట్ ప్రకారం త్రిష ఏం రిజల్ట్ ఇస్తుందో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయ్ తో దమ్ములో నటించిన త్రిష...హిట్టివ్వకపోవడం సరికదా....ఎన్టీఆర్ కు అక్కలా ఉందనే కామెంట్స్ మూటగట్టుకుంది. అయితే లయన్ లో హీరో సరసన త్రిష సరిపోయింది కానీ....విజయంపైనే కాస్త డౌటొస్తోంది. సత్యదేవ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న లయన్ సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అవుతుందేమే అనే భయం నందమూరి అభిమానులను వెంటాడుతోంది. హిట్టొస్తే హీరో ఖాతాలో వేసేసి...ప్లాప్ వస్తే హీరోయిన్ ఐరెన్ అనడం కామనే కదా అంటున్నారు ఇంకొందరు. ఈ వాదనల సంగతి పక్కనపెడితే కథలో మేటరుండాలి కానీ కథానాయిక ఏం చేస్తుందిలే అనేవాళ్లూ లేకపోలేదు.
ఇంతకీ లయన్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మే 1 వరకూ వెయిట్ చేయాల్సిందే.......