ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!

 

స్త్రీ....  అంటే ఓ చైతన్యం.
అతివ.. ..అంటే ఓ అపూర్వం. 
పడతి.... అంటే ఓ ప్రగతి. 
అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు.

1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి 

గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. 

సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది. 

భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).

  ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు. 

ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే.

భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. 

ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది. 

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు..

కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.

 ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు.

పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది 

మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది. 

 కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి. 
గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది.
అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది. 
జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.

 మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.

 శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.

 దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు.
భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.  

యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు.

పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు.
కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది. 
అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది.

మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ.
మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన 
ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా.

నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ.

ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి..

జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది.

1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు.

కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు.

1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ.

1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది.

1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ.

1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు.

1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ.

1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు.

1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్.

1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు 
(మొదటి భారతీయ) 

1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు) 

1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు.

1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ.

1966లో  కమలాదేవి చటోపాధ్యాయ 
వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు.

1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి.

1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ.

1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి.

1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు.

1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు.

1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు.

1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ.
వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐