* ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు.

* ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా ఉంటుంది.

* గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తగ్గుతాయి.

* ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి.

* గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.

* రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి.

* రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి.

* ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.

* రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది.

* రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.

* రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి.

* గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి.

* గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది.