రంగమ్మా మంగమ్మా... పది కోట్లమంది చూశారమ్మా!
on Sep 17, 2018
రామ్చరణ్ 'రంగస్థలం' ఖాతాలో మరో రికార్డు చేరింది. కంటెంట్ పరంగా... కలెక్షన్స్ పరంగా... సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. సినిమాయే కాదు... అందులోని పాటలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమాలో పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'రంగమ్మా మంగమ్మా...' పాట యువతతో పాటు పెద్దలనూ ఆకట్టుకుంది. ఇప్పుడీ పాట యూట్యూబ్లో కొత్త రికార్డులు సృష్టించింది. పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే... పది కోట్లమంది పాటను చూశారు. దేవిశ్రీ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, మనస్వి గాత్రం సినిమా విడుదలకు ముందే పాటను హిట్ చేశాయి. విడుదల తరవాత సుకుమార్ దర్శకత్వం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రేక్షకులకు పాట మరింత చేరువయ్యేలా దోహదం చేశాయి. 'రంగమ్మా మంగమ్మా' పాటకు ఈ అరుదైన ఘనత దక్కడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.