జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంలో షాక్
Publish Date:Apr 28, 2026
Advertisement
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలు పూడి శ్రీహరిపై ఉన్నాయి. చంద్రబాబు చేతిలో కత్తి పట్టుకుని ఉన్నట్లు యానిమేషన్ చిత్రాలను సృష్టించి, వాటిని వైరల్ చేశాడని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీన తాడేపల్లిలోని శ్రీహరిని తన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో పలు మలుపులు తిరిగింది. పోలీసులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత శ్రీహరి రిమాండ్ను ట్రయల్ కోర్టు నిరాకరించగా, పోలీసులు దీనిని హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఈ రిమాండ్ నిరాకరణపై స్టే విధించింది. దాంతో తనపై జరుగుతున్నది రాజకీయ కక్షసాధింపు అని, తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని పేర్కొంటూ పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై బుధవారం(29-4-26న) హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున, పూడి శ్రీహరి, మరో నిందితుడు గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, తదుపరి విచారణను వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకపోవడంతో పూడి శ్రీహరి భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. సోషల్ మీడియాలో పోస్టుల విషయమై జరుగుతున్న ఈ న్యాయపోరాటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/ys-jagan-36-218479.html





