చిత్తూరులో వైసీపీ చిత్తుకాగితం!?
Publish Date:Jul 27, 2024
Advertisement
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోతే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటే క్యాడర్ లో నమ్మకాన్ని పాదుకొల్పడానికి జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలు రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో ఏ మేరకు ప్రభావం చూపాయన్నది పక్కన పెడితే.. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాత్రం ఘోరంగా బెడిసికొట్టాయి. పుంగనూరు వినా మరెక్కడా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. భారీ తేడాతో పరాజయం మూటగట్టుకున్నారు. కుప్పంలో పాగా వేస్తామంటూ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పని చేసిన పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించినా.. పుంగనూరులోకి అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు. జిల్లాలోని వైసీపీ నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. తమ మాటలు నమ్మి పార్టీ కోసం పని చేసిన క్యాడర్ ను గాలికొదిలేసి.. బతుకు జీవుడా అంటూ జిల్లా దాటి పారిపోతున్నారు. అందుకే జిల్లాలో పుంగనూరు వినా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అది పక్కన పెడితే ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో వైసీపీ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. ఫలితాలు వెల్లడయ్యే వరకూ క్యాడర్ ను రెచ్చగొడుతూ, వారిలో గెలుపు ధీమాను నింపుతూ మాట్లాడిన నేతలంతా ఫలితాల తరువాత క్యాడర్ మానాన క్యాడర్ ను వదిలేసి అజ్ణాతంలోకో లేక జిల్లా దాటి హైదరాబాద్ వంటి ప్రాంతాలకో వెళ్లిపోయారు. జిల్లా కేసి ముఖం తిప్పి కూడా చూడటం లేదు. తమ మాట నమ్మి జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్ల అతీగతీ పట్టించుకోవడం లేదు. ఫలితం ఇప్పుడు ఆ వాలంటీర్లే వైసీపీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ అయితే ఫలితాలు వచ్చిన వారం రోజుల వరకూ స్థానికంగానే నివసించినా ఇప్పుడు మాత్రం కుప్పం వదిలేసి హైదరాబాద్ కు మకాం మార్చేశారు. కనీసం వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. ఇక జిల్లాలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులైతే తెలుగుదేశం గూటికి చేరడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు మునిసిపల్ చైర్మన్ సుధీర్ అమరావతి వెళ్లి తెలుగుదేశం గూటికి చేరే ప్రయత్నాలు ప్రారంభించారు. తటస్థులకు పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటల మేరకు తాను తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సుధీర్ నేడో రేపో సైకిలెక్కేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పూతల పాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన డాక్టర్ సునీల్ కుమార్ అయితే ప్రస్తుతం రాజకీయాల ఊసెత్తకుండా పలమనేరులోని తన ఆసుపత్రిలో వైద్య వృత్తి సాగిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు జిల్లాలోని సొంత నియోజకవర్గంలోకే అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వైసీపీ సగం ఖాళీ అయిపోయింది. రానున్న రోజుల్లో పార్టీ మెత్తం ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు.
నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే చెన్నైకి మకాం మార్చేశారు. ఇక నగరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలూ సోదిలోకి కూడా కనిపించడం లేదు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తెలుగుదేశం తలుపు తట్టారు. అయితే వారికి ఆ పార్టీలో ప్రవేశం లేదని తేలిపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలన్న మూడ్ లోకి వెళ్లిపోయారు.
మాజీ ఉపముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం నాయకులు, మీడియా అధినేతలపై అమవానకరంగా వ్యాఖ్యలు చేయడం తప్ప మరో పేనే లేదన్నట్లుగా విర్రవీగిన నారాయణ స్వామి ఇప్పుడు పూర్తిగా మౌనం వహించారు. ప్రస్తుతం ఆయన పుత్తూరులో కొన్ని రోజులూ, చెన్నైలో కొన్ని రోజులూ గడుపుతూ కాలం వెళ్ల దీస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-empty-in-chittoor-39-181634.html