political-news-img

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్‌ జామ్..!

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి మేఘావృతంగా ఉన్న వాతావరణం రాత్రి వేళ ఒక్కసారిగా మారి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, కుకట్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, బేగంబజార్, గోషామహల్ ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. మరోవైపు మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, సికింద్రాబాద్ పరిసరాల్లో కూడా వర్షం ప్రారంభ మైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించగా, కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కార్యాలయాలు, వ్యాపార సంస్థల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని, వాహనదారులు నీరు నిలిచిన రహదారుల్లో జాగ్రత్తగా ప్రయాణించా లని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. Heavy rain in many places in Hyderabad, GHMC, Hydra, Traffic Police, Miyapur,

Publish Date: Jul 21, 2026 10:22AM

political-news-img

డెంగ్యూ పై భారత్ ఘన విజయం..వ్యాక్సిన్ వచ్చేసింది..!

డెంగ్యూ పై భారత్ ఘన విజయం.. వ్యాక్సిన్ వచ్చేసింది..! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది డెంగ్యూ గురించి భయపడతారు. జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్.. ఇప్పటివరకు డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు. నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట. గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు. భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కుడెంగా టీకా.. కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే.. శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట. భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం చాలా మేలైందని అంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి. టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట. *రూపశ్రీ.

Publish Date: Jul 21, 2026 9:20AM

political-news-img

రెండేళ్ల పాలనపై చంద్రబాబు సర్కార్ ప్రోగ్రస్ రిపోర్టులు.!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నరు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్ మరియు ఎక్సైజ్ విధానాలపై విడుదల చేసిన 7 కీలక శ్వేతపత్రాలకు కొనసాగింపుగా, ఇప్పుడు సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టడమే కాకుండా, సంస్కరణలు, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపించామో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఒకే చోట చేర్చి ప్రచురించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది. ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ, పాలనా నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. మిగిలిన నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు ప్రజా సమక్షంలో ఆవిష్కరిస్తారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రికార్డు స్థాయి నిధులను పంపిణీ చేసింది. ముఖ్యంగా పేదలు, వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ఏడాదికి సగటున రూ. 33,000 కోట్లకు పైగా కేవలం పెన్షన్ల కోసమే వెచ్చించడం దేశ సంక్షేమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అదే విధంగా, పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటివరకు రూ. 230 కోట్ల నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రతి నెలా వేలాది మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు, కూలీలు భోజన ఖర్చులలో రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు పొదుపు చేయగలుగుతున్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని విజయాన్ని సాధించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కోసం ప్రభుత్వం రూ. 2,565 కోట్ల సబ్సిడీ భార భారాన్ని భరించి మహిళల ఉపాధి, విద్య, ప్రయాణ స్వేచ్ఛకు ఊతమిచ్చింది. అమరావతి ప్రాజెక్టు పనులతో పాటు పోలవరం నిర్మాణం, రహదారుల అభివృద్ధి మరియు డ్రోన్ నిఘా ద్వారా నిర్మూలన వంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం నెలకొన్నాయి. ఈ నివేదికలు, డేటా పాయింట్లు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై పూర్తి అవగాహనను, భరోసాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. AP Govt White Papers, Chandrababu Naidu 2 Years Governance, AP Coalition Govt Progress Report, NTR Bharosa Pension Scheme

Publish Date: Jul 21, 2026 9:01AM

political-news-img

న్యాయం కోసం గొంతెత్తితే.. లాఠీలకు పని చెబుతారా.. కేంద్రంపై నెటిజనుల ఆగ్రహం

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని సోమవారం (జులై 20) శాంతియుతంగా నిర్వహిస్తున్న యువతపై పోలీసులు ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా.. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి తమ హక్కుల కోసం నినదించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు. తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలనీ, నీట్ లీకేజీపై జవాబుదారీ తనం ఉండాలనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్న విద్యార్థులను చర్చలకు పిలిచి మాట్లాడాల్సింది పోయి.. వారి గొంతు నొక్కాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ ప్రశ్రపత్రాల లీకేజీ కి వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యారంగ సంస్కరణల కోసం జూన్ 28 నుంచి వరుసగా 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలి నుంచి పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడం, మరోవైపు హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ఎన్ఎస్‌యుఐ, ఎస్‌ఎఫ్ఐ, ఐవైఎఫ్, పిడిఎస్‌యు వంటి అనేక విద్యార్థి సంఘాలు ముట్టడించడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. Delhi NEET protest crackdown, Dharmendra Pradhan resignation, Modi government, NEET criticism, Sonam Wangchuk, online anger

Publish Date: Jul 21, 2026 8:44AM

political-news-img

ఉక్రెయిన్ లో పౌర నౌకపై క్షిపణి దాడి.. నలుగురు ఇండియన్స్ సహా పలువురు మృతి.!

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో నల్ల సముద్ర జలాల్లో ధాన్యపు నిల్వలతో ప్రయాణిస్తున్న ఒక పౌర, వాణిజ్య కార్గో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారత నావికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఇండియన్ తీవ్రంగా గాయపడ్డారు. పౌర రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఘాతకం వెనుక రష్యా బలగాల ప్రమేయం ఉందంటూ ఉక్రెయిన్ ఆరోపించింది. టర్కీకి చెందిన షిప్పింగ్ సంస్థ నిర్వహణలోని గోల్డెన్ లియో అనే బల్క్ క్యారియర్ నౌక, గినియా, బిస్సావ్ దేశ పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తోంది. జూలై 19 న ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ఒడెస్సా పోర్టు నుండి భారీగా ఆహార ధాన్యాల లోడుతో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక క్షిపణి దాడికి ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకన్న వెంటనే స్థానిక సహాయక బృందాలు, తీర రక్షణ బలగాలు రెస్క్యూ చర్యలు చేపట్టాయి. అయితే, దెబ్బతిన్న నౌక భాగాల మధ్య చిక్కుకుని నలుగురు ఇండియన్స్ తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన లోకల్ నెవిగేషన్ పైలట్, మరికొందరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిని ఒడెస్సాలోని క ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉ మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియపై దృష్టి సారించినట్లు పేర్కొంది. పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంటూ.. మృతి చెందిన నావికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. Russia Ukraine war, Golden Leo vessel, Indian sailors death , missile attack on Odesa port

Publish Date: Jul 21, 2026 7:53AM

political-news-img

ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. సిట్ అధికారులు సమర్పించిన విచారణ నివేదికలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ప్రత్యేక భద్రత నడుమ విజయవాడకు తరలించారు. విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, స్థానిక ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు అధికారి తమకు సమర్పించిన వివరాల ఆధారంగా నిందితులకు రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. కోర్టు విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. నిందితులు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారని, కాబట్టి వారికి 41ఏ నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. నిందితుల కుటుంబ సభ్యులు కలవడానికి అనువుగా వారిని అమరావతి లేదా విజయవాడ జైళ్లకు మార్చకుండా, తిరిగి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులోనే ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి ప్రతిగా ప్రాసిక్యూటర్లు సిట్ సేకరించిన కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. వైసీపీ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వాసుదేవ రెడ్డి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సవరించారని వివరించారు. అర్హత కలిగిన సంస్థలను పక్కనబెట్టి, నిర్దిష్ట సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చడం ద్వారా మద్యం రవాణా చార్జీలను భారీగా పెంచారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కుమారుడైన కారుమూరి సునీల్ పాత్ర క్రియాశీలంగా ఉందని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. తన తండ్రికి ఉన్న రాజకీయ ప్రాభవాన్ని, ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టర్ల ఎంపికలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ అక్రమ కేటాయింపుల ప్రక్రియలో సునీల్ సుమారు 16 కోట్ల రూపాయల మేర ముడుపులు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులు, సందేశాలు, వాట్సాప్ చాటింగ్‌లతో కూడిన డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు అందజేశారు. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం సరఫరా, రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో వ్యవస్థాగతమైన అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మద్యం బాట్లింగ్ యూనిట్ల నుంచి డిపోలకు, డిపోల నుంచి విక్రయ కేంద్రాలకు సరుకును చేరవేసే రవాణా కాంట్రాక్టుల్లో అసలైన రేట్ల కంటే అధిక ధరలను ఆమోదించడం ద్వారా సుమారు రూ. 192 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి గురైందని సిట్ ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉభయ పక్షాల వాదనలను విన్న విజయవాడ ఏసీబీ కోర్టు.. కేసు తీవ్రతను బట్టి నిందితులకు ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు పేర్కొంటూ.. వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకే తరలించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం సిట్ అధికారులు నిందితులను తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. Vasudeva Reddy, Karumuri Sunil, Vijayawada ACB Court, APSBCL Tender Scam

Publish Date: Jul 21, 2026 7:36AM

MOVIE NEWS