Top Stories

political-news-img

యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీన్

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. ఇప్పటికే పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లలో చిక్కుకుని జైలుపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచాల డిమాండ్‌ను ఆపడం లేదు. పని జరగాలంటే తప్పనిసరిగా లంచం ఇవ్వాలని బాధితులపై ఒత్తిడి తెస్తూ, ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని స్పష్టంగా చెప్పే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి అవినీతి పరులపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ ఏసీబీ ట్రాప్‌లో చిక్కి అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో విత్తన లైసెన్స్ మంజూరు చేయాలని ఓ బాధితుడు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ వద్దకు వచ్చాడు. లక్షన్నర రూపాయలు లంచంగా ఇస్తే కానీ పని జరగదని గోవర్ధన్ నిక్కచ్చిగా చెప్పాడు. అందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భాగంగా ముందుగా రూ.25 వేల లంచం ఇచ్చాడు. ఇంకా లక్ష రూపాయలు ఇచ్చేముందు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్–II యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈరోజు బాధితుడు దగ్గర్నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండ గా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. . ట్రాప్ అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో డాక్టర్ గోవర్ధన్ చేతివేళ్లు పాజిటివ్‌గా తేలినట్లు అధికా రులు వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా అవినీతి ఎదురైతే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.

Publish Date: Apr 7, 2026 9:51PM

political-news-img

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో నిందితులకు షాక్

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజేంద్రనగర్ కోర్టు తిరస్కరించింది. దీంతో నిందితులకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులను పోలీసులు రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. అయితే డ్రగ్స్ వ్యవహారం ఫామ్‌హౌస్ పార్టీలతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నిందితులను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. నిందితుల వద్ద నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. అలాగే విచారణలో నిందితులు పూర్తిగా సహకరించలేదని, దర్యాప్తును పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో మూడోసారి నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఐదు రోజులపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు తమ పిటిషన్‌లో అభ్యర్థించారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. కోర్టు నిర్ణయం ఈ కేసు దర్యాప్తు దిశను ప్రభావితం చేసే అవకాశముంది. రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ నిరాకరణతో నిందితులకు తాత్కాలిక ఉపశమనం లభించకపోవడంతో, మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. ఈ కేసు పురోగతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Publish Date: Apr 7, 2026 9:32PM

political-news-img

పశ్చిమాసియా యుద్ధ సెగ...10 వేల విమాన సర్వీసులు రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలల కారణంగా గగనతలం అభద్రతగా మారడంతో భారత్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వేలాది విమాన సర్వీసులు నిలిచిపోయాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా సర్వీసులు రద్దయినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను భారీగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే విమానాలు ఇప్పుడు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా వంటి సంస్థలు తమ ఇంధన సర్‌ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు సుదూర ప్రాంతాలకు విమానాలను నడిపే పైలట్ల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పైలట్లకు ఉండే 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్' (FDTL) నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. యుద్ధం కారణంగా విమాన మార్గాల్లో మార్పులు రావడం, ప్రయాణ సమయం అనూహ్యంగా పెరగడంతో పైలట్ల పనివేళల్లో ఈ మినహాయింపులు ఇవ్వక తప్పలేదని అధికారులు వివరిస్తున్నారు. యుద్ధం కారణంగా కేవలం విమానాల రద్దే కాకుండా, విమానయాన సంస్థల ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. గగనతల మార్గాల మూసివేత వల్ల విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఇది చివరకు సామాన్య ప్రయాణికులపై టికెట్ ధరల రూపంలో భారం మోపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విదేశీ సర్వీసులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితులపై విమానయాన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే అంతర్జాతీయ ప్రయాణాలు మరింత క్లిష్టంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు విమాన సంస్థల తాజా అప్‌డేట్లను గమనించాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప విమాన సర్వీసులు యథాస్థితికి వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ, భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తోంది.

Publish Date: Apr 7, 2026 8:37PM

political-news-img

రుతుక్రమం అంటరానితనం ఎలా అవుతుంది...శబరిమల కేసులో కీలక వ్యాఖ్యలు

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.వి. నాగరత్న అస్పృశ్యత అంశంపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రుతుక్రమం ఆధారంగా మహిళలను దేవాలయాల్లోకి అనుమతించకపోవడాన్ని రాజ్యాంగంలోని 'అంటరానితనం' (ఆర్టికల్ 17) పరిధిలోకి తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఒక మహిళగా ఆలోచిస్తే, కేవలం నెలలో మూడు రోజుల పాటు అస్పృశ్యతను పాటించి, నాలుగో రోజు నుంచి అది వర్తించదని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత తీర్పులను ప్రస్తావించారు. 2018 నాటి శబరిమల తీర్పులో, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయ ప్రవేశానికి నిరాకరించడం అంటరానితనం కిందకే వస్తుందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడినట్లు గుర్తు చేశారు. అయితే, ఈ వాదనతో జస్టిస్ నాగరత్న ఏకీభవించలేదు. శబరిమల కేసులో ఆర్టికల్ 17ని అన్వయించడం అంటే మహిళలను అంటరానివారిగా పరిగణించడమే అవుతుందని, దీనిపై తనకు తీవ్ర అభ్యంతరం ఉందని ఆమె స్పష్టం చేశారు. కేవలం శారీరక ధర్మాల ఆధారంగా ఒక వర్గాన్ని దూరం పెట్టడాన్ని సామాజిక అంటరానితనంతో పోల్చడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై సొలిసిటర్ జనరల్ వివరణ ఇస్తూ.. తాను కేవలం వయసు ఆధారిత నిబంధనల గురించి మాట్లాడుతున్నానని, అది ఒక నిర్దిష్ట వయసు కలిగిన మహిళల సమూహానికి సంబంధించిన అంశమే తప్ప కేవలం మూడు రోజుల రుతుక్రమ సమస్య కాదని స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయాలు మరియు రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న వైరుధ్యంపై సుదీర్ఘ చర్చ జరిగింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, దానిపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ప్రస్తుతం పెద్ద ధర్మాసనం పరిశీలిస్తోంది. భక్తుల మనోభావాలు, మతపరమైన ఆచారాలు మరియు మహిళా సమానత్వం వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం కోర్టుకు సవాలుగా మారింది. ఈ కేసులో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అస్పృశ్యత అనే పదాన్ని ఏ సందర్భాల్లో వాడాలి అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కీలక కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Apr 7, 2026 7:47PM

political-news-img

ఆన్‌లైన్ ఆర్డర్…షాక్ ఇచ్చిన బిర్యానీ...హోటల్ సీజ్

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తెరిచి చూసే సరికి దుర్వాసన రావడంతో వినియోగదారు షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంకటరమణ కాలనీలో నివసిస్తున్న కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కొద్దిసేపటికే “లక్కీ బిర్యానీ షవర్మ” నుంచి ప్యాకెట్ చేరింది. ఆకలితో వెంటనే బిర్యానీ పొట్లం తెరిచి చూడగానే తీవ్ర దుర్వాసన రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిశీలించగా బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్‌లో సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని నిల్వ ఉంచి, ఆర్డర్ వచ్చినప్పుడు మళ్లీ వేడి చేసి కస్టమర్లకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా హోటల్‌లో పరిశుభ్రత పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్‌లో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వెంటనే హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై వినియోగదారుల్లో భయం నెలకొంది. ఆహారం ఆర్డర్ చేసే ముందు రెస్టారెంట్ రేటింగ్స్, రివ్యూలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Publish Date: Apr 7, 2026 7:33PM

political-news-img

హైదరాబాద్‌లో బాంబు బెదరింపుల కలకలం ఆల్ ఇండియా రేడియో, జేఎన్‌టీయూలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

హైదరాబాద్‌లో బాంబు బెదరింపులు కలకలం రేపాయి. . నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన ఆల్ ఇండియా రేడియో కార్యాలయంతో పాటు, కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు. అదే సమయంలో కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకే రోజు రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపులు రావడంతో నగర పోలీసులు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. రేంపు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే రెండు చోట్లా కూడా ఎలాంటి బాబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బెదరింపులకు పాల్పడింది ఎవరు అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బెదిరింపుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Publish Date: Apr 7, 2026 7:04PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img