పెన్నాలో మునిగి ఇద్దరు మృతి.. ఒకరు గల్లంతు
Publish Date:Apr 5, 2026
Advertisement
వారంతా రేపటి తరం కళాకారులు.. కెమెరా కంటితో లోకాన్ని చూపాలనుకున్న సృజనశీలురు. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని, వెండితెరపై మెరవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, కాలం రాసిన విధి రాత వారి జీవిత కథను అర్ధాంతరంగా ముగించేసింది. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం వెళ్లిన ఆ యువకులు ప్రమాద వశాత్తూ పెన్నా నదిలో మునిగి మరణించారు. వివరాలిలా ఉన్నాయి. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం (ఏప్రిల్ 5) వెళ్లారు. వారిలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) చిత్రీకరణలో భాగంగా నదిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి ముగ్గురూ కొట్టుకుపోయారు. అప్పటి దాకా యాక్షన్, కట్.. అంటూ సందడిగా కనిపించిన ఆ పరిసరాల్లో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో హరిబాబు (23), హర్షవర్ధన్ (22) ప్రాణాలు కోల్పోగా, కృష్ణ చైతన్య (20) గల్లంతయ్యాడు. అతడి కోసం గజఈతగాళ్లతో గాలింపు కొనసాగుతోంది. చేతికి అందివచ్చిన కొడుకులు ప్రయోజకులవుతారని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా మారింది. రేపు వస్తానమ్మా అని వెళ్లిన బిడ్డలు, విగతజీవులుగా తిరిగి కనిపించడంతో శోక సంద్రంలో మునిగిపోయారు.
http://www.teluguone.com/news/content/two-drowned-in-penna-river-36-216735.html





