తిరుమలలో భక్తుల వద్దకు కదిలివస్తున్న అన్నప్రసాదం.!
Publish Date:Aug 7, 2026
Advertisement
దేవుడి ప్రసాదాన్ని అందుకోవడానికి ఎక్కడైనా సరే భక్తులు వెళ్లాల్సి వస్తుంది. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం మాత్రం భక్తుల వద్దకే కదిలి వస్తున్నది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వినూత్న విధానాన్ని సాంకేతిక హంగులతో అమలులోకి తీసుకువచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలో స్వామి వారి దర్శన భాగ్యం కోసం భక్తులు గంటల తరబడి కంపార్ట్ మెంట్లలోనూ, క్యూలైన్ లోనూ వేచి ఉంటారు. ఒక్కోసారి స్వామి వారి దర్శనానికి పట్టే సమయం 24 గంటలకు పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వారాంతం, పండుగలు పర్వదినాలలో అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడిపోతాయి. భక్త జన సంద్రాన్ని తలపిస్తాయి. ఎంతటి భక్తజన ప్రవాహం వచ్చినా వారి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించి టీటీడీ, భక్తులకు అన్నప్రసాదాలను ఎలాంటి జాగు లేకుండా సులభంగా అందించడానికి మరియు సులభతరంగా చేయడానికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇంజినీరింగ్, క్యాటరింగ్ విభాగాల అధికారులతో సమగ్రంగా చర్చించి ఈ వినూత్న ప్రాజెక్టుకు రూపునిచ్చారు. క్యూలైన్లలో శ్రీవారి సేవకులు నడుస్తూ ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా రద్దీ సమయంలో తరచూ తోపులాటలు జరగడం, భక్తులకు సమయానికి ప్రసాదం అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండేవి. వీటిని నివారించడానికి ఇంజినీరింగ్ విభాగం దాదాపు పది లక్షల వ్యయంతో ఏడు మీటర్ల పొడవు కలిగిన ఒక మూవింగ్ టేబుల్ను రూపొందించింది. ఈ టేబుల్ ఒక కన్వేయర్ బెల్టు తరహాలో చుట్టూ నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ సాంకేతిక వ్యవస్థ పనిచేసే విధానం చాలా సరళంగా, సమర్థవంతంగా ఉంటుంది. కదిలే ఈ బెల్టుపై శ్రీవారి సేవకులు వేడివేడి అన్నప్రసాదాల ప్లేట్లను వరుసగా ఉంచుతారు. క్యూలైన్లలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు తమ ప్రయాణాన్ని ఆపకుండానే, పక్కనే కదులుతున్న టేబుల్ పైనుంచి సులభంగా తమకు కావాల్సిన ప్రసాదం ప్లేటును అందుకోవచ్చు. ప్లేటును భక్తులు తీసుకోగానే ఖాళీ అయిన ఆ ప్రదేశంలో సేవకులు వెంటనే మరొక అన్నప్రసాదం ప్లేటును ఉంచుతారు. దీనివల్ల భక్తులు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా, రద్దీ నిరంతరం కదులుతూనే అన్నప్రసాదం పొందేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రయోగాత్మక మూవింగ్ టేబుల్ పనితీరుపై తిరుమలలోని రింగ్ రోడ్డు వద్ద టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అక్కడ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. భక్తులు, శ్రీవారి సేవకుల నుంచి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో తిరుమలలోని ప్రధాన క్యూలైన్ మార్గాలన్నింటిలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రణాళికలు వేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 తో పాటు నారాయణగిరి షెడ్లు, ఇతర కీలక క్యూలైన్ మార్గాల్లో మొత్తం సుమారు 10 కదిలే మూవింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయనుంది. TTD moving dining conveyor, Tirumala prasadam conveyor belt, TTD Vaikuntam queue complex, Tirupati news today, Tirumala devotees facilities, TTD food conveyor belt
http://www.teluguone.com/news/content/ttd-moving-dining-conveyor-36-228261.html





