వెలిగొండ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.!
Publish Date:Aug 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా సాగునీరు, తాగునీటి కోసం నిరీక్షిస్తున్న ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజల కల సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూరం దగ్గరపడింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలా ఖరులోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీని ద్వారా కృష్ణా నది నుంచి వరద జలాలను టన్నెళ్ల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలించి విడుదల చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్త చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలో మిగిలి ఉన్న అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఆగస్టు నెలాఖరు నాటికే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు విస్పష్ట ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 3 వేల కోట్ల భారీ వ్యయంతో నిలిచిపోయిన ప్రధాన ఇంజినీరింగ్, టన్నెల్, కాలువల పనులను పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోని వివిధ కీలక విభాగాల పనులు 90 శాతం నుంచి 99 శాతం పూర్తయ్యాయి. రాబోయే రెండు వారాల్లో మిగిలిన చిన్నపాటి పనులన్నీ పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన సొరంగం లోపల ఉన్న భారీ టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) తొలగింపు పనులను వేగంగా సాగుతున్నాయి. 1,900 మెట్రిక్ టన్నుల బరువు, 175 మీటర్ల పొడవు ఉన్న ఈ భారీ యంత్రాన్ని బయటకు తీసే పనుల్లో 70 శాతానికి పైగా పూర్తికాగా రానున్న వారం రోజుల్లో మిగిలిన 30 శాతం పని పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఇక కొల్లంవాగు నుంచి కృష్ణా జలాలను టన్నెల్కు చేర్చే అప్రోచ్ ఛానల్ పనులతో పాటు హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్మాణం కూడా పూర్తి అయ్యింది. మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల సహాయంతో పనులు శరవేగంతో సాగుతున్నాయి. వైసీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పడకేశాయి. జగన్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. 2024లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి.. ఫేజ్-1 పరిధిలోని అన్ని కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు, రాయలసీమ సరిహద్దు మండలాలకు కృష్ణా జలాలు అందించడమే లక్ష్యంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో కూడా ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి కూడా చంద్రబాబు సమ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని 4 వేల761 నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి 600 కోట్ల రూపాయల పునరావాస పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించి ఇప్పటికే తొలి విడతగా ఇప్పటికే 318 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన నిధులను రెండు విడతల్లో నెలాఖరుకల్లా అంటే ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాటికల్లా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ నిండితే, దశాబ్దాలుగా నీటి కర వుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారం లభించనుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తాగునీటి ఎద్దడి తీరి ఆయా ప్రాంతాలలో వ్యవసాయం, ఆర్థిక పురోగతి ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, ఫ్లోరైడ్ రహిత తాగునీరు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి వస్తుంది.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-36-228416.html





