సీఎం జగన్ ఫోటోకి మద్యాభిషేకం.. గోవిందా గోవిందా..
Publish Date:Mar 21, 2022
Advertisement
మద్య నిషేధం అన్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. ధరలు పెంచి డిమాండ్ తగ్గిస్తానన్నారు. మళ్లీ మాట తప్పి, మడమ తిప్పి.. ధరలు తగ్గించారు. జే-బ్రాండ్లకు తోడుగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి.. మద్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఇది చాలదన్నట్టు.. ఏపీ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ నాటు సారా తయారీ, అమ్మకాలు. పదుల సంఖ్యలో చావులు. జగన్రెడ్డి అడ్డగోలు విధానాలపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో మద్యం పాలసీపై రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తోంది. తాజాగా, నాటు సారా చావుల ఎపిసోడ్తో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతీరోజూ నిరసనలు చేస్తున్నారు. తాజాగా, సీఎం జగన్రెడ్డి చిత్రపటానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్యంతో అభిషేకం చేసి వినూత్న నిరసన తెలిపారు. మద్య నిషేధం హామీ గోవిందా గోవిందా అంటూ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు. నాటు సారా, జే-బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా ఐదోరోజూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసింది. ఇంకెన్ని సారా చావులు జగన్ కోరుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/tdp-agitation-against-cm-jagan-liqour-policy-39-133295.html





