నరసన్నపేటలో అన్నదమ్ముల సవాల్
Publish Date:Apr 3, 2012
Advertisement
శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన కుటుంబం నేడు కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ జిల్లానుంచి ఎన్నికయిన ధర్మాన ప్రసాదరావు మంత్రిగా కొనసాగుతుండగా ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయి తాజా మాజీగా మారారు. వైయస్ మరణానంతరం జగన్ సొంత కుంపటి పెట్టడంతో ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆయన పంచన చెరి అనర్హత వేటుకు గురయ్యారు. అక్కడినుంచే వీరి కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన మరో సోదరుడు రామ్ దాస్ రంగలో నిలబడ్డారు. కుటుంబంలో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రామ్ దాస్ ఒక వర్గంగా ఏర్పడ్డారు. మరోవైపు వీరి అన్నగారైన ధర్మాన కృష్ణదాస్ వీరికి వ్యతిరేకంగా మారారు. దీంతో నరసన్నపేట ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ధర్మాన కృష్ణదాస్ నిత్యం తన సోదరుడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాద రావుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రసాదరావి రాజకీయంగా తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, తన సహచరులను బెదిరిస్తున్నాడని తన ఓటమికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నాడని కృష్ణదాస్ ఆరోపిస్తున్నాడు. తాజాగా తనముందు ధర్మాన ప్రసాదరావు బచ్చాగాడని, అతనికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని కృష్ణదాస్ ప్రకటించాడు. ఒకవైపు అన్నగారు తనపై ఒంటికాలిపై వస్తున్నా తమ్ముల్లిద్దరూ మాత్రం నిగ్రహంతో వ్యవహరిస్తుండటం విశేషం.
http://www.teluguone.com/news/content/srikakulam-district-congress-party-24-13139.html





