షాబాద్ ఆరు హత్యల కేసులో ట్విస్ట్..!
Publish Date:Jul 12, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను కొత్తూరు మండలంలోని అక్కివేని గూడెం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన అనంతరం పరారైన రాజ్కుమార్ కోసం పోలీసులు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఉపయోగించిన కారు కొత్తూరు మండలం చేగూరు రైల్వే లైన్ సమీపంలో లభించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించిన పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం చిరునామా అడుగుతున్న వ్యక్తిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి రాజ్కుమారేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. అతడిని అదుపులోకి తీసుకున్నది స్థానిక పోలీసులా, లేక ప్రత్యేక దర్యాప్తు బృందమా అన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్కుమార్ అరెస్టుకు సంబంధించిన వార్తలపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పోలీసుల ధృవీకరణ అనంతరం మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/shabad-murders-36-225797.html





