political-news-img

పేర్ని పాకులాట ఎందుకంటే?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారు. అనుచరవర్గాన్ని చెదిరిపోకుండా చూసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దాదాపు వైసీపీ క్యాడర్ చెల్లాచెదురైపోయినట్లు కనిపిస్తున్నది. జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పేర్ని నానికి కుమారుడి రాజకీయ అస్తిత్వం కాపాడాలంటే జనంలో కనిపించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అవనసరపు హడావుడితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనీ, కాదు కాదు వార్తల్లో ఉండటానికి పాకులాడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించినా, ఓడిపోయినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని హడావుడి చేస్తున్నారు. స్థానిక అంశాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ప్రతిదానికీ స్పందిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు వెనకాడబోమంటూ సవాళ్లు విసురుతున్నారు. వాస్తవంగా కేసులు, అరెస్టుల వరకూ వచ్చే సరికి పలాయనం చిత్తగించి, అవి సద్దుమణగగానే మళ్లీ హడావుడి పెంచుతున్న పరిస్థితి. ఇందుకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై పేర్ని నానికి ఉన్న ఆందోళనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాను సైలంట్ అయితే.. మచిలీపట్నంలో పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమౌతుందన్న ఆందోళనే నానిని చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండేందుకు తాపత్రేయపడేలా చేస్తున్నదని అంటున్నారు. అయితే నాని ఈ తాపత్రేయం ఎంతవరకూ ఫలిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు. రాజధాని అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో అమరావతికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న పార్టీగా వైసీపీ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని ఎంతగా పాకులాడినా పట్టు నిలుపుకోవడం అంత తేలిక కాదనీ చెబుతున్నారు.

Publish Date: Apr 7, 2026 5:40PM

political-news-img

పాకిస్థాన్‌లో లాక్‌డౌన్!

తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు రాత్రి 10 గంటలలోపు కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిమితులు పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, పీవోకే ప్రాంతాల్లో అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Publish Date: Apr 7, 2026 5:33PM

political-news-img

సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ , సీఎస్ జి.సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్టు చేసేలా చూడాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కంజ్యూమర్ ప్రాడెక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపూర్ లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ జీసీసీలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రాడెక్టులు వచ్చేలా చూడాలని దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రం నుంచి సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటం పై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ ను నిర్దేశించాలన్నారు. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎనర్జీ, బీఈఎస్ లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ఓ ఎస్ఓపీని సిద్ధం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ భద్రతా ప్రమాణాలను పారిశ్రామిక యూనిట్లు కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. ఇటీవల రాష్ట్రంలోని బాణా సంచా తయారీ యూనిట్లలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాణా సంచా తయారీ యూనిట్లు, మిల్క్ డెయిరీలు లాంటి అంశాల్లో ఉల్లంఘనలు లేకుండా ప్రామాణిక విధానాలు జారీ చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రమాణాలను పాటించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్వాంటం టవర్స్ ను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూములు కేటాయించిన పర్యాటక ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని.. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. వేగంగా ప్రాజెక్టులు గ్రౌండింగ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభం అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వీటితో పాటు భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేకించి ఆయా ప్రభుత్వ శాఖలు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. భారీ ప్రాజెక్టులపై ప్రతీ ఎస్ఐపీబీ సమావేశంలోనూ సమీక్షిద్దామని సీఎం స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉత్పత్తి సామర్ధ్యం పెరగాలన్నారు. పామాయిల్, కోకో లాంటి ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం సూచించారు. ఉద్యాన ఉత్పత్తులు 200 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగాలని అన్నారు. దీనికి తగినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రాడెక్టు పర్ఫెక్షన్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని సీఎం సూచించారు. తాజాగా 16వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 538 ఎంఓయూలకు గానూ రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది.

Publish Date: Apr 7, 2026 5:13PM

political-news-img

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టు!

కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టుపడుతోంది. జగన్ హయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు తెలిసిందే. అప్పట్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా సాగిన మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన నాయకులు, కూటమి అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అసోసియేషన్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు. మరోవైపు కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా, ఎగుమతులపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తుండటంతో ద్వారంపూడి వ్యాపార సామ్రాజ్యం కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయనకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు. ఇలా ఉండగా జనసైనికులు అయితే ద్వారంపూడిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో పవన్‌ను టార్గెట్ చేసి ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పాల్పడిన ద్వారంపూడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. జనసేన ఒత్తిడి ఫలితంగానే త్వరలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉదనీ, ఆ ఎన్నికల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పెత్తనానికి చెక్ పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒక సారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పట్టు సడలితే.. ఇక వరుసగా అన్ని వైపుల నుంచీ గతంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ముప్పేట దాడికి జనసైనికులు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు కాకినాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Apr 7, 2026 5:09PM

political-news-img

భారత ఆర్మీ చేతికి వందల ఆత్మాహుతి డ్రోన్లు

ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి. కామికాజిగా పిలిచే ఈ ఆత్మాహుతి డ్రోన్లు పేలుడు పదార్ధాలను మోసుకెళ్లి, లక్ష్యాన్ని ఢీకొని పేలిపోతాయి. ఇవి గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 10 కి.మీ పరిధిలోని శత్రు స్థావరాలను AI సహాయంతో ఖచ్చితంగా ధ్వంసం చేస్తాయి. మైనస్ 35 డిగ్రీల వరకు) మరియు GPS లేని ప్రదేశాల్లో కూడా పని చేసే ఈ డ్రోన్లు సాధారణ క్షిపణుల కంటే చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ రూ. 10 కోట్ల ఒప్పందంతో తాజాగా సైన్యానికి అప్పగించినట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గం ఘటన నేపధ్యంలో సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ వందలాది ఆత్మహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు సమాచారం.

Publish Date: Apr 7, 2026 4:52PM

political-news-img

హైకోర్టుకు అంబటి రాంబాబు.. ఎందుకంటే?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించింది ఏదో కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం కాదు. గతంలో తనను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో అమానుషంగా ప్రవర్తించారనీ, శారీరక హింసకు గురిచేశారనిఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేర తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టై, ఆ తరువాత రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలులో ఉండి, ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చిన ఇన్ని రోజుల తరువాత.. నల్లపాడు పోలీసు స్టేషన్ లో తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ అంబటి హైకోర్టును ఆశ్రయించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన పలు సందర్భాలలో తన అరెస్టు అక్రమం అని చెప్పారే కానీ, పీఎస్ లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారనిగానీ, శారీరకంగా హింసించారని కానీ ఎన్నడూ చెప్పలేదు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనీ, ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేయాల్సినట్లుగా మర్యాదగా వ్యవహరించలేదని అటూ వచ్చారు. అటువంటిది ఇప్పుడు ఏకంగా తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారనీ, నేలపై కూర్చోబెట్టి అమానుష పద్ధతుల్లో హింసించారనీ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

Publish Date: Apr 7, 2026 4:45PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img