మహిళల భద్రత కోసం షీ నేత్ర
మహిళల గోప్యతకు ముప్పుగా మారుతున్న రహస్య కెమెరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ నగరంలో పోలీసులు కొత్త అడుగు వేశారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్ను రంగంలోకి దించారు. బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు. రహస్య కెమెరాలు, స్పై కెమెరాలు, సెల్ఫోన్ కెమెరాలను గుర్తించగల ఈ పరికరాల సహాయంతో నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. షాపింగ్ మాల్స్లోని ట్రయల్ రూమ్స్, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాల్లో మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఈ సందర్భంగా సజ్జనార్ హెచ్చరించారు. తమ ప్రాంగణాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవడం ఆయా యాజమాన్యాల బాధ్యత అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే సంస్థలను బ్లాక్లిస్ట్ చేసే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంస్థ తప్పనిసరిగా కస్టమర్ సేఫ్టీ ఇన్చార్జ్ ను నియమించి, షీ టీమ్స్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగంతో పాటు దాని దుర్వినియోగం కూడా పెరుగుతోందనీ, సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్, ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. హార్డ్వేర్ రూపంలో సీక్రెట్ కెమెరాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్లైన్ 9490616555కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Publish Date: Apr 10, 2026 11:45PM