political-news-img

తమిళనాట అన్నామలై క్రేజ్...24 గంటల్లో 14 లక్షల మంది చేరిక!

తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల కోసం అంటూ.. ‘ఉయ్ ద లీడర్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చేరాలనే అన్నామలై పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. దానికి ముందు ‘వి ద లీడర్స్’ ఉద్యమాన్ని ప్రకటించారు. తమిళనాడు ప్రజల హక్కులకోసం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. ఆయన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. భారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఉద్యమానికి ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా మద్దతు తెలుపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షలు మంది చేరినట్టు వెబ్‌సైట్‌‌లో నమోదయ్యింది.

Publish Date: Jun 6, 2026 9:04PM

political-news-img

కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం.. కోహెడ సభలో రేవంత్ ఫైర్

రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా రైతులే పండ్లు, కూరగాయలు, పాలు అందించేవారని, రియల్ ఎస్టేట్ విస్తరణతో వ్యవసాయం క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగినా, నగర అవసరాలను తీర్చేందుకు మరింత మౌలిక సదుపాయాలు అవసరమని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో 240 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ నుంచే మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమవాలని, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, కందుకూరు ప్రాంతంలో టమోటా ఆధారిత సాస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, వరంగల్-ఆదిలాబాద్ విమానాశ్రయాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని సీఎం విమర్శించారు. "అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు" అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సీఎం తీవ్ర విమర్శలు చేశారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రస్తుతం "కూలేశ్వరం"గా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, 15 లక్షల కొత్త రేషన్ కార్డులు, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. మహిళలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. మెట్రో విస్తరణ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంతోనూ పోరాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నప్పటికీ, రోజుకు 18 గంటలు పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Publish Date: Jun 6, 2026 8:53PM

political-news-img

న్యూయార్క్‌లో తెలుగు యువకుడు దారుణ హత్య

అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు. మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కి చెందిన అన్షుల్ అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన అన్షుల్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రాత్రి 12 గంటల సమయంలో డెలివరీ నిర్వహిస్తుండగా గన్‌తో కాల్చి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. తీవ్ర గాయాలతో అన్షుల్‌ కుప్పకూలి కింద పడిపోయాడు. అతని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పేట్ బషీరాబాద్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రుల రోధన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. అన్షుల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Publish Date: Jun 6, 2026 8:32PM

political-news-img

కాంగ్రెస్ పోవాలి...కేసీఆర్ రావాలి : తలసాని

తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందా లేదా అనే విషయాన్ని ప్రజలను ప్రశ్నించాలని సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడిపించామని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచిన గులాబీ జెండాను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోసాలు, అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని విమర్శించిన తలసాని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ప్రజలను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ నిధులతో ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు "కాంగ్రెస్ పోవాలి... కేసీఆర్ రావాలి" అని కోరుకుంటున్నారని అన్నారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు లేదా ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది, ఎగిరేది గులాబీ జెండానే అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Publish Date: Jun 6, 2026 8:23PM

political-news-img

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి 14 రోజుల రిమాండ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు చివరకు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ హైడ్రామా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా ఆరోపణల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. నిన్నటి వరకు ప్రజాప్రతినిధిగా చలామణి అయిన ఒక సీనియర్ నేత, ఇప్పుడు చంచల్‌గూడ జైలు ఊచలు లెక్కబెట్టాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం రంగారెడ్డి జిల్లాలోని గండిపేట ప్రాంతం. గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18 లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఈ మాజీ ఎమ్మెల్యే కన్ను పడిందనేది ప్రధాన ఆరోపణ. కేవలం సాదాసీదా భూమి కాదు, దీని విలువ అక్షరాలా సుమారు 1,500 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతటి భారీ విలువైన ప్రభుత్వ ల్యాండ్‌ను కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారని పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేశారనేది అధికారుల విచారణలో తేలింది. నకిలీ మరియు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఆ ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నారని స్థానిక తహసీల్దార్ గుర్తించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారే స్వయంగా రంగంలోకి దిగి సైబరాబాద్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన పక్కా ఆధారాలు మరియు ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలించాయి. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయారు. పోలీసుల కళ్లు కప్పి తప్పించుకునేందుకు ఆయన పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చేరుకున్నారు. తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం కాంచీపురంలో ఆయన తలదాచుకున్నట్లు సైబరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేక పోలీసు బృందం కాంచీపురం చేరుకుని, నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం బొల్లా బ్రహ్మనాయుడిని రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ భారీ భూ కబ్జా కేసుకు సంబంధించిన వివరాలను, ఫోర్జరీ పత్రాల ఆధారాలను పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. కేసు తీవ్రతను పరిశీలించిన ఉప్పరపల్లి కోర్టు మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ప్రముఖ చంచల్‌గూడ కేంద్ర జైలుకు తరలించారు. 1,500 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ స్కామ్ కేసులో ఒక మాజీ ఎమ్మెల్యే జైలుపాలు కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది.

Publish Date: Jun 6, 2026 7:50PM

political-news-img

ఆపరేషన్ కవచ్.. హైదరాబాద్‌లో 562 హోటళ్లలో అర్ధరాత్రి సోదాలు

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో ఉన్న మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లలో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు కార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అతిథుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆపరేషన్‌ను సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను సందర్శించిన ఆయన, గదుల కేటాయింపు విధానం, సందర్శకుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అక్కడ బస చేస్తున్న కొందరు అతిథులతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, నగరానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి వంటి వివరాలను తెలుసుకున్నారు. జోన్ల వారీగా పరిశీలిస్తే ఖైరతాబాద్ జోన్‌లో అత్యధికంగా 119 హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించగా, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్ మరియు గోల్కొండ జోన్లలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల సోదాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, ప్రత్యేక విభాగాల పోలీసులు సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ హోటల్, లాడ్జీ నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అతిథి నుంచి తప్పనిసరిగా అసలు గుర్తింపు కార్డును పరిశీలించి, దాని స్పష్టమైన ప్రతిని భద్రపరచాలని ఆదేశించారు. రిజిస్టర్లలో పూర్తి వివరాలు, మొబైల్ నంబర్లు, చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు కేటాయించరాదని హెచ్చరించారు. అలాగే మైనర్లకు గదులు ఇవ్వకూడదని, వారి వయస్సును గుర్తింపు పత్రాల ద్వారా ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. హోటళ్లలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, రిసెప్షన్ ప్రాంతాలను కవర్ చేసే విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా త్వరలో డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా నగరంలో నేర కార్యకలాపాలను అరికట్టడంతో పాటు హోటల్ రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.

Publish Date: Jun 6, 2026 7:05PM

MOVIE NEWS