ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేమ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చినందుకు కార్మిక సంఘాలను సీఎం అభినందించారు.“నేను వేరు – మీరు వేరు అనే భావన నాకు లేదు. అందరం కలిసే ప్రభుత్వం,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని, వారి పోరాటాల్లో తాము ఎప్పుడూ తోడుగా ఉన్నామని అన్నారు. ఆర్టీసీలో బస్సులు, నియామకాలు, ఆదాయం పెరిగాయని తెలిపారు. కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ దేశంలో ప్రముఖ సంస్థగా నిలిచిందని కొనియాడారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టర్మినల్, శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం డీజిల్పై సుమారు రూ. 2000 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులపై దృష్టి పెట్టామని వివరించారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ ప్రభుత్వ కాలానికి చెందినవి కాకపోయినా, వాటిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాజకీయ ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని కోరారు. ఒక డ్రైవర్ను కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని తెలిపారు. సంస్థ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని, డిపో మేనేజర్లతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తున్నామని, ఈసారి రూ. 1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను శాతం 100 పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, కార్మికుల వెంట ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.“సంస్థ ఆగిపోతే అది ఊపిరి ఆగినట్లే. సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేయొద్దు,” అని సూచించారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలనీ, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, కేసులను వెంటనే ఎత్తివేయడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Publish Date: May 1, 2026 9:19PM