ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.
Publish Date: Mar 18, 2024 6:30PM

 ఆ అధికారులను తొలగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు 

లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కుదరదూ అంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజ‌రాత్, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, జార్ఖండ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ హోంశాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొల‌గించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక ఈసీ మొదటిసారి ఈ చ‌ర్య‌లు తీసుకుంది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ) అధికారుల‌ పైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ క‌మిష‌న‌ర్, అద‌న‌పు, డిప్యూటీ క‌మిషన‌ర్ల‌ను ఈసీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Publish Date: Mar 18, 2024 3:24PM

గాజువాకలో గుడ్డు మంత్రికి ఎదురీతే!?

గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో  జోష్ కనిపిస్తున్నది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్  గాజువాక నుంచి పోటీ చేయరని తేలిపోయిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం పార్టీ గాజువాక సీటును తమ ఖాతాలో వేసేసుకుంది. కచ్చితంగా గెలిచే స్థానాలలో గాజువాక మొదటి వరుసలో ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు ఢంకా బజాయించి చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావు, గత ఐదేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా మారారు. ఎన్ని  అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీ క్యాడర్ కు అండగా నిలిచారు. నియోజకవర్గ సమస్యలపైనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా క్రియాశీలంగా వ్యవహరించారు. ఆందోళనా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. దీంతో నియోజకవర్గ ప్రజలలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు పోరాటాలు, నియోజకవర్గ ప్రజలకు ఆయన అండగా నిలిచిన తీరు ప్రజలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తిన తీరు నియోజకవర్గ ఓటర్లకు ఆయనను దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆయన తిరుగులేని నేతగా మారారు.  అందుకు భిన్నంగా అధికార పార్టీ వైసీపీ గాజువాకలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అంతర్గత విభేదాల కారణంగా వైసీపీలో గ్రూపుల పోరు తీవ్రస్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా నియోజవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విషయంలో పలు మార్పులు, చేర్పులూ జరిగాయి. అలా జరిగిన ప్రతి సారీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పీక్స్ కి వెళ్లింది. తొలుత గాజువాక వైసీపీ అభ్యర్థిగా వి. రామచంద్రరావు అలియాస్ చందును జగన్ నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీలో  పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. అసంతృప్తులను బుజ్జగించుకుని చందు  నియోజకవర్గంతో తన ప్రచారం ప్రారంభించారో లేదో అంతలోనూ చందూను కాదని జగన్ మంత్రి అమర్నాథ్ ను అభ్యర్థిగా ప్రకటించారు.   అయితే మంత్రి అమర్నాథ్ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమర్నాథ్ కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో గాజువాక నుంచి అమర్నాథ్ విజయం నల్లేరు మీద బండి నడక ఎంత మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో గాజువాక నుంచి తెలుగుదేశం విజయం పక్కా అని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎలా అయితే చంద్రబాబుకు  కంచుకోటగా ఉందో గాజువాక కూడా అలాగే తెలుగుదేశం కంచుకోట అని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. 
Publish Date: Mar 18, 2024 3:20PM

మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు షాక్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను టార్గ్ చేస్తూ పావులు కదుపుతోంది. వారిపై ఉన్న పోలీస్ కేసులను తిరగతోడుతుంది. మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. హిట్ అండ్ రన్ కేసును తిరిగి ఓపెన్ చేశారు. రెండేళ్ల క్రితం... 17 మార్చి 2022న హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలుడిని ఢీకొట్టిన కారు షకీల్‌కు చెందినదిగా ఆరోపణలు వచ్చాయి. ఈ కారు మీరా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా అప్పుడు గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ తనది కాదని... తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు షకీల్ అప్పుడు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జీషీట్ వేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేశారు.
Publish Date: Mar 18, 2024 3:02PM

మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు 

అధికారం ఒకరిని అందలం ఎక్కిస్తే మరొకరిని పాతాళంలో తోసేస్తుంది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అయిన మల్లారెడ్డిని  అన్ పాపులర్ చేసింది  ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులే. వీరికి  మరికొందరు తోడయ్యారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు రాజకీయ ప్రత్యర్థులకు బాసటగా నిలుస్తున్నారు.  ఇటీవల మల్లారెడ్డి అల్లుడు ఆక్రమించిన ప్రభుత్వ, ప్రయివేటు భూములను రేవంత్ సర్కార్ స్వాధీనం చేసుకుంది.  మల్లారెడ్డి కబ్జా చేసిన భూములు, మల్లారెడ్డి విద్యాసంస్థలపై కూడా  రేవంత్ సర్కార్  ఉక్కుపాదం మోపింది. మల్లారెడ్డి  తన  విద్యా సంస్థ భవనాన్ని అక్రమంగా కట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. జెసీబీలతో తొక్కించి అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో, వీరంతా ధర్మాకు దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మరోవైపు యూనివర్శిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు
Publish Date: Mar 18, 2024 2:45PM

సుప్రీంను ఆశ్రయించిన కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం ను ఆశ్రయించారు. లిక్కర్ కుంభకోణం కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ డైరెక్టర్ ను చేర్చారు. ఇలా ఉండగా ఈడీ కస్టడీలో కవిత తొలి రోజు విచారణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు విచారణ తతంగాన్నంతా వీడియో తీశారు. తొలి రోజు విచారణ పూర్తి కాగానే కవితను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులు కలిశారు. అలాగే కవిత భర్త  అనీల్, న్యాయవాది మోహిత్ రావులు కూడా కవితతో భేటీ అయ్యారు. అంతకు ముందు కవిత తరఫున్యాయవాది సుప్రీం కోర్టులో ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించి కవితను అరెస్టు చేసిందని ఆరోపించారు.   ఈడీ డైరెక్టర్‌ను చేర్చనున్నారు. కాగా, ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ ఆదివారం పూర్తి అయింది. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్, కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు కలిశారు. 
Publish Date: Mar 18, 2024 2:33PM