ఐఆర్సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా!
Publish Date:Jun 24, 2026
Advertisement
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండి) సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందిస్తూ, రైల్వే టికెటింగ్ మరియు పర్యాటక రంగంలో తిరుగులేని నమ్మకాన్ని సంపాదించుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీలో సంజయ్ కుమార్ జైన్ రాజీనామా సంచలనంగా మారింది. తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే ఆయన వచ్చే నెల 20 వరకూ విధుల్లో కొనసాగుతారు. సంస్థలో బాధ్యతల బదిలీ ప్రక్రియలో అడ్డంకులు లేకుండా, సజావుగా సాగేందుకు వీలుగా సంజయ్ కుమార్ జూలై 20 వరకు ఆయన సీఎండీగా కొనసాగుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జూన్ 22నే తమకు అధికారిక లేఖ అందినట్లు ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్లో సంస్థ అధికారికంగా వెల్లడించింది. తదుపరి సీఎండీగా ఎవరు రానున్నారు, లేదా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయాలపై త్వరలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ కానున్నాయి. సంజయ్ కుమార్ జైన్ 1990 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. రైల్వే రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన.. 2024 ఫిబ్రవరిలో ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన నాయకత్వంలో ఐఆర్సీటీసీ మినీరత్న నుంచి నవరత్న స్థాయికి ఎదిగింది. అలాగే.. ప్రభుత్వ రంగ సంస్థల అత్యున్నత వర్గీకరణ జాబితాలో షెడ్యూల్ బి నుంచి షెడ్యూల్ ఎ ఎదిగింది. ఆయన హయాంలో ఐఆర్సీటీసీ డిజిటల్ సేవల విస్తరణ, రైల్వే క్యాటరింగ్ నాణ్యతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
http://www.teluguone.com/news/content/rctc-cmd-sanjay-kumar-jain-resigns-36-223958.html





