ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పొరెల్ పై చీటింగ్ కేసు
Publish Date:Jun 24, 2026
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ పై చీటింగ్ కేసు నమోదైంది. మైదానంలో పరుగుల వరద పారించే ఈ 23 ఏళ్ల యువ క్రికెటర్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో సహజీవనం చేసి, నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా మోగ్రా పోలీస్ స్టేషన్లో అభిషేక్ పోరెల్పై కేసు నమోదైంది. ఈ వార్త క్రికెట్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాధితురాలైన వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కాగా గత ఏడాదిన్నరగా వారి మధ్య విభేదాలు తలెత్తాయని, అప్పట్లోనే ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినప్పటికీ, ఆ సమయంలో కేసు నమోదు కాలేదని సమాచారం. అయితే.. ఇప్పుడు ఆ విభేదాలు మరింత ముదరడంతో పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ పొరెల్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా.. అభిషేక్ పొరేల్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ పొరేల్.. ఆ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, ఢిల్లీ కేపిటల్స్ అతడిని రిటైన్ చేసుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతంగా రాణించి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. హూగ్లీ జిల్లాలోని చందన్నగర్కు చెందిన ఈ యువ క్రికెటర్, కెరీర్ పరంగా ఎదుగుతున్న తరుణంలోనే మోసం కేసు నమోదు కావడం అతడి ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా కెరీర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/cheating-case-against-ipl-cricketer-abishek-porel-36-223959.html





