లక్నోపై రాజస్థాన్ గెలుపు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి
Publish Date:Apr 22, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా బుధవారం (ఏప్రిల్ 22) జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తక్కువ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మహమ్మద్ షమీ ధాటికి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22), ధ్రువ్ జురెల్ పెవిలియన్కు చేరడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా బాధ్యతాయుతంగా ఆడి 43 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మయాంక్ అగర్వాల్ 20 పరుగులు సమర్పించుకోవడం రాజస్థాన్కు కలిసొచ్చింది. అనంతరం 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది. ముఖ్యంగా చివరి 15 పరుగుల వ్యవధిలోనే లక్నో ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో లక్నోబ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ఆర్చర్ కు తోడుగా బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. సమష్టి కృషితో రాణించిన రాజస్థాన్, లక్నోను వారి సొంత మైదానంలోనే చిత్తు చేసింది. ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ఆరు మ్యాచ్లలో ఐదు విజయాలు నమోదు చేసిన పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ మొత్తం 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానానికి చేరుకుంది.
http://www.teluguone.com/news/content/rajasthan-royals-win-over-lucknow-36-218014.html





