ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బాలికను వేధించిన కీచక ఉపాధ్యాయుడు!
Publish Date:Jun 22, 2026
Advertisement
కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతోంది నిజమే.. కానీ.. కొందరు దీనిని దుర్మార్గాలు కూడా వాడేస్తున్నారు. సమాజానికి హాని కలిగించేందుకు ఇందుకు వినియోగిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో సాంకేతికతను ఒక ట్యూషన్ టీచర్ దుర్వినియోగం చేసిన తీరు విస్మయపరిచేలా, ఏఐ అంటేనే భయపడేలా ఉంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం నిందితుడు షణ్ముఖ్ హితేష్ తన వద్ద రెగ్యులర్గా ట్యూషన్ నేర్చుకోవడానికి వచ్చే ఒక మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని.. ఆ బాలికకు సంబంధించిన ఫొటోలను సేకరించాడు. ఆ తర్వాత ఏఐ టూల్స్ ఉపయోగించి, ఆ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని చూపించి సదరు బాలికను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు లొంగకపోతే.. ఈ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాననీ, ఇతరులందరికీ పంపిస్తానని ఆ మైనర్ బాలికను బెదరించాడు. నిందితుడు షణ్ముఖ్ హితేష్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో, ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే.. విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు షణ్ముఖ్ హితేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు, ఐటీ యాక్ట్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
http://www.teluguone.com/news/content/predatory-teacher-harassed-a-girl-using-ai-technology-36-223724.html





