టి-కాంగ్రెస్లో పీకే తుపాను..
Publish Date:Apr 19, 2022
Advertisement
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇంచుమించుగా ఖరారై పోయింది.కొద్దిమంది సీనియర్ నాయకులు అందుకు అభ్యంతరం చెపుతున్నా,పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం పీకే వైపే మొగ్గుచూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా వినవస్తోంది. నిజానికి, సోనియా గాంధీ తమ ముందున్న సమస్యల్లో కాంగ్రెస్ పార్టీని బతికించడం కంటే, పార్టీ పగ్గాలు తమ చేజారి పోకుండా కాపాడుకోవడమే కీలకంగా భావిస్తున్నారని,అందుకే ఆమె, పీకేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా సిద్డమయ్యారని అంటున్నారు. అలాగే, సీనియర్లు (జీ 23 ప్లస్) విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా తిప్పి కొట్టి పార్టీ పగ్గాలు చేజారకుండా ఉండాలంటే, పీకే శరణు వేడడం మినహా మరో మార్గం లేదనే నిర్ణయానికి సోనియా వచ్చారని పార్టీ నాయకుల అంటున్నారు. అందుకే ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా పీకే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ఇటు రాజకీయ విశ్లేషకులు,అటు కాంగ్రెస్ వర్గాలు కూడా గట్టిగా విశ్వశిస్తున్నాయి. అయితే, పీకే కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన దేశంలో హస్త రేఖలు మరాతాయో లేదో కానీ, తెలంగాణలో మాత్రం, పీకే ఎంట్రీతో పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని టీ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పీకే ఇప్పటికే తెరాసతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాసను గెలిపించడంతో పాటుగా కేసీఆర్’ని జాతీయ నేతగా ఎలివేట్’ చేసేందుకు ఐదారు వందల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు పీకే కాంగ్రెస్’లో చేరితే, తెరాసకు కాంగ్రెస్ ప్రత్యాన్మాయం కాలేదని, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా లేకున్నా, ప్రజలు ఆ రెండు పార్టీలను ఒకటిగానే చూస్తారని, ఫలితంగా తెరాస వ్యతిరేక ఓటు గంపగుత్తగా బీజేపీకి పోతుందని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. సరే, పీకే ‘ఫ్రీ’ గా పని చేస్తున్నారా, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు అరోపిస్తున్న విధంగా వందల కోట్ల,’సుపారీ’ తీసుకునే పనిచేస్తున్నారా, అనేది పక్కన పెడితే, పీకే తెలంగాణలో తెరాస విజయానికి నడుం బిగించారు. ఇందుకోసం ఆయన బృందం ఇప్పటికే పనిలోకి దిగింది. పీకే సలహాల ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.ఎదురు దెబ్బలు తగిలినా, అవమానాలు ఎదురైనా పీకే మీద విశ్వాసంతో ముందుకు పోతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బతికించే సత్తా, సామర్ధ్యం ఒక్క పీకేకి మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఏ విధంగా అయితే నమ్ముతున్నారో, అదే విధంగా రాష్ట్రంలో పతనం వెంట పరుగులు తీస్తున్న తెరాసను రక్షించే సత్తా, సామర్ధ్యం కూడా ఒక్క పీకేకే ఉన్నాయని కేసీఆర్’ నమ్ముతున్నారు. అయితే ఎంత పీకే అయితే మాత్రం ఒకే సారి రెండు పార్టీలను ఎలా గెలిపిస్తారు? అనేది, ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న. ఈ నేపధ్యంలోనే పీకే పౌరోహిత్యంలో కాంగ్రెస్, తెరాస ఒకటయ్యే అవకాశం ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరో వంక ఆ రెండు పర్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబందించి కాంగ్రెస్ నాయకులు సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, కాంగ్రెస్, తెరాసల మధ్య పొత్తు ఉండదని విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.అయితే అదే సమయంలో, ఆయన మరోవంక ఆయన సంజాయిషీలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఉత్తమ కుమార్ రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని అడుగుతున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, రాష్ట్రంలో కాంగ్రెస్’ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతుందని ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిజానికి, ఒక్క ఉత్తమ కుమార్ రెడ్డి మాత్రమే కాదు , రేవంత్ రెడ్డి వర్గీయులు కూడా అదే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
నిజానికి, పీకేతో తెరాస డీల్’కు సంబంధించి, ముఖ్యమంత్రి కేసీఆర్, స్వయంగా స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దేదించేందుకు పీకే తమతో కలిసి, పని చేస్తున్నారని ప్రెస్ మీట్’లోనే స్పష్టంగా చెప్పారు. అంతే కాదు, అందులో తప్పేముందని మీడియాను ప్రశ్నించారు.అయితే, పీకే ఫ్రీ’గా పనిచేస్తున్నారని కేసీఆర్ జనం చెవిలో పులు పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా పీకే కాంగ్రెస్’లో చేరే విషయంలో సమాలోచనలు జరుగుతున్నాయని ప్రకటించింది. ఇక్కడ కేసీఆర్, ‘పీకే సేవలు ఫ్రీ నంట్లుగానే, అక్కడ కాంగ్రెస్ పార్టీ పీకే పదవులు ఆశించి పార్టీలోకి రావడం లేదని, సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరుతున్నారని, జనం చెవిలో మరో రకం పులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pk-storm-in-t-congress-39-134613.html





