గడప గడపకూ వైసీపీ సర్కార్ కు ఎదురుగాలి.. మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసనల సెగ
Publish Date:May 12, 2022
Advertisement
గడప గడపకూ వైసీపీ అంటూ ప్రజల వద్దకు వెళ్లడానికి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. అందుకే రాత్రికి రాత్రి గడప గడపకూ వైసీపీ పేరును గడప గడపకూ ప్రభుత్వం అంటూ మార్చేశారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తున్నదంటే నిరసనలు తెలియజేయడానికి జనం భయపడతారనీ, కేసులు ఉంటాయని జంకుతారనీ వైసీపీలోని మేధావి వర్గం వ్యూహం పన్నింది. దానిని అమలు చేసింది. గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జనం వద్దకు వెళ్లే కార్యక్రమంలో పార్టీ నేతలే కాకుండా, అధికారులను కూడా భాగం చేసింది. ఇలా అయితే జనం ఎక్కడైనా తిరగబడినా. నిలదీసినా కేసుల ఉంటాయని జనం బయపడతారని జగన్ అంచనా వేశారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టింది. వైసీపీ ప్రభుత్వమైనా, పార్టీ అయినా మా కొకటే.. నిరసన నిరసనే అంటూ జనం ఎక్కడికక్కడ తిరగబడ్డారు. జనంతో పాటు కొన్ని చోట్ల వైసీపీ క్యాడర్ కూడా నిరసనలు తెలియజేసింది. చేసిన పనులకు మూడేళ్లుగా బిల్లులు రాలేదన్న ఆగ్రహం వారిది. కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న వారిని తాము కరోనా సమయంలో కూడా అప్పులు చేసి మరీ సాయం చేశామని చెప్పి వారిని ఓటు బ్యాంక్గా ఉంచుకోవడమే లక్ష్యంగా జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పేరేదైనా జగన్ పార్టీ చేపట్టినది గడప గడపకూ వైసీపీ కార్యక్రమమే. పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అన్నంత మాత్రాన కార్యక్రమం రూపు రేఖలు మారిపోవు. నిజానికి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అయితే అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ నేతల వెనుక అధికారులూ ఉంటున్నారు. అయినా ప్రజలు ఎక్కడికక్కడ తన నరసన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల పాటు ముఖం చాటేసి ఇప్పుడెందుకు వస్తున్నారంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులూ కూడా ప్రజా వ్యతిరేకతను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చవి చూస్తున్నారు. కేవలం నిలదీసి ఊరుకోవడం లేదు. తమ సమస్యలు వినకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ అడ్డుకుంటున్నారు. తిట్ల పురాణం విప్పుతున్నారు. అనంత పురం నుంచి శ్రీకాకుళం వరకూ జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనలు భగ్గు మంటున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. జిల్లా హిందూపురంలోని కోట్నూరులో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా గడపగడపకూ అంటూ రావడం ఎందుకు అంటూ నడిరోడ్డుపై నిలదీశారు. ఓవైపు మహిళలు సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. ఎంపీ, ఎమ్మెల్సీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లారు. ఒక్క హిందూపురంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఆర్థిక మంత్రి బుగ్గన కూడా ప్రజా నిరసన చవి చూశారు. అలాగే చిత్తూరు జిల్లాలో మంత్రి రోజానూ జనం నిలదీశారు.న ఎరక్కపోయి గడప గడపకూ కార్యక్రమం చేపట్టామని వైసీపీ నేతలు లోలోన మధన పడుతున్న పరిస్థితి కనబడుతోంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో వైసీపీ పట్ల, జగన్ సర్కార్ పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో తేటతెల్లమైందని పరిశీలకులు చెబుతున్నారు. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు గడపగడపకూ నిరసన ఎదురైందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/people-protest-against-ycp-in-gadapa-gadapaku-programmee-25-135767.html





